ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల పోలీస్ స్టేషన్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. కరణ్సింగ్, విశాల్ పటేల్ అనే వ్యక్తులు నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు కారులో వెళ్తున్నారు. వీరి కారును 3 కార్లలో దుండగులు... ఆదిలాబాద్ సమీపంలోని జాతీయ రహదారి దగ్గర వెంబడించి అడ్డగించారు. ఇద్దరిపై దాడి చేశారు. వారిని అపహరించి గుడిహత్నూర్ మండలం రాగాపూర్ వద్దకు తీసుకెళ్ళి వదిలేసి పారిపోయారు. మరో కారులో ఉన్న నలుగురు దుండగులు... బాధితుల కారుని మహారాష్ట్రకు తీసుకెళ్లి అందులోని డైమండ్ లాకర్లను తెరిచారు. కారును ధ్వంసం చేశారు. ఏమీ లభించకపోవటం వల్ల కారును వదిలేసి వెళ్లిపోయారు. బాధితులు గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మొట్టమొదటి సారిగా జీరో ఎఫ్ఐఆర్...
ఎస్పీ ఆదేశాల మేరకు 3 బృందాలుగా ఏర్పడిన పోలీసులు దర్యాప్తు చేశారు. సాంకేతికత సహాయంతో మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా వారాకోటలో నిలిపిన కారును గుర్తించారు. అందులో డైమండ్ల లాకర్ ఏర్పాటు చేసినట్లుగా... వాటిని దుండగులు ధ్వంసం చేసి తెరిచినట్లుగా పేర్కొన్నారు. బాధితులు గుజరాత్ నుంచి బొంబాయి, నాగపూర్ మీదుగా హైదరాబాద్కు డైమండ్స్ కోసం వెళుతున్నారు. కారులో డైమండ్స్ ఉన్నట్టు ఊహించిన దుండగులు వెంబడించి చోరికి యత్నించారని పోలీసులు వివరించారు. జిల్లాలో మొదటి సారిగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని... గుడిహత్నూర్ నుంచి మావల పోలీస్స్టేషన్కు కేసు బదిలీ చేసినట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
ఇదీ చూడండి: 'నిర్భయ' దోషులకు ఉరి ఆలస్యం- జనవరి 7న నిర్ణయం!