డ్రైవింగ్ చేస్తూ.. మార్గమధ్యంలోనే ఓ లారీ డ్రైవర్ మరణిస్తే.. అధికారులకు సమాచారం ఇచ్చినా.. సాయంత్రం వరకు స్పందించని అమానవీయ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గంగులవారి చెరువుపల్లెకు చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం మే నెల 23న ఏపీ 39 టీబీ 3019 నెంబరు గల లారీలో సహచరుడు మల్లారెడ్డి వెంకట్రెడ్డితో కలిసి స్టీల్ లోడు కోసం మహారాష్ట్రలోని నాగ్పూర్ వెళ్లాడు. లోడుతో తిరిగి కేరళకు బయల్దేరాడు. మార్గమధ్యంలో ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పల్వాడ టోల్ప్లాజా వద్ద ఉదయం ఆరు గంటలకు టీ కోసం లారీ ఆపారు. అందరూ టీ తాగుతున్నా.. వారిలో సుబ్రహ్మణ్యం లేకపోవడం సహచరులు గమనించారు.
సుబ్రహ్మణ్మంతో వచ్చిన మల్లారెడ్డి వెంకట్రెడ్డి వెళ్లి చూడగా.. సుబ్రహ్మణ్మం స్పృహ లేకుండా పడి ఉన్నాడు. వెంటనే 104కు సమాచారం అందించాడు. ఉదయం ఫోన్ చేస్తే.. 104 అధికారులు సాయంత్రం వరకు స్పందించలేదు. రెవిన్యూ అదికారులకు సమాచారం ఇచ్చినా వారు కూడా స్పందించలేదు. సాయంత్రం వచ్చిన వైద్య సిబ్బంది సుబ్రహ్మణ్మంను పరీక్షించగా.. మూడు రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడినట్లు వెంకట్రెడ్డి 104 సిబ్బందికి తెలిపాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. స్పందించని వైద్య సిబ్బంది.. ఈటీవిలో కథనం వచ్చిన తర్వాత స్పందించారు. అప్పటి వరకు ఎర్రటి ఎండలో సుబ్రహ్మణ్యం మృతదేహం అలాగే ఉంది.
ఇదీ చూడండి: మండుతున్న ఎండలు