Railwayjobs cheating lady arrest in adilabad : ఎన్నో అలవెన్సులు, మరెన్నో సౌకర్యాలున్న కేంద్రప్రభుత్వ ఉద్యోగం వస్తుందంటే ఎవరూ వద్దంటారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగుల అశను ఆసరాగా చేసుకున్న సదరు మహిళ మరో ముగ్గురుతో కలిసి.. రైల్వేలో ఉద్యోగాలంటూ నమ్మించింది. నిజమైన అపాయింట్మెంట్ లెటర్లలాగే.. తప్పుడు జాయినింగ్ లెటర్లు, ఫేక్ ఐడీలను సృష్టించి వారి నుంచి డబ్బును వసూలు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 49 లక్షల రూపాయలను వసూలు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో నిరుద్యోగులకు వల వేసి రైల్వే ఉద్యోగుల పేరిట బురిడీ కొట్టించిన కిలాడీ లేడీని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆదిలాబాద్ పట్టణం బొక్కల్గూడకు చెందిన తోట రజిత రైల్వే ఉద్యోగాల పేరిట మోసం చేసిందని.. పది మంది అభ్యర్థులు పట్టణంలోని పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించి మహిళను పట్టుకున్నారు. వీరు ముఠాగా ఉన్నారని.. ఇందులో శేషగిరిరావు, కబీర్సింగ్, మల్విందర్ సింగ్ వ్యక్తులున్నారని తెలిపారు. వీరు ఒక్కొక్క వ్యక్తి నుంచి నాలుగు నుంచి అయిదు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై హరిబాబు దర్యాప్తు చేసి సదరు మహిళ అరెస్టు చేయడంలో కీలక భూమిక పోషించారన్నారు.
డబ్బుల రికవరీతో పాటు ఈ వ్యవహారంలో ఉన్న ముఠా సభ్యులందరిని పట్టుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే నమ్మకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
"నిరుద్యోగులకు రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. ఆదిలాబాద్ పట్టణం బొక్కల్గూడకు చెందిన తోట రజిత తప్పుడు అపాయింట్మెంట్ పత్రాలు సృష్టించి మోసం చేసింది. వీరు ముఠాగా ఉన్నారు. ఇందులో శేషగిరిరావు, కబీర్సింగ్, మల్విందర్సింగ్ అనే వ్యక్తులున్నారు. వీరు ఒక్కొక్క వ్యక్తి నుంచి నాలుగు నుంచి అయిదు లక్షల రూపాయలు వసూలు చేశారు. మొత్తంగా 49 లక్షల రూపాయలను వసూలు చేశారు" - ఉమేందర్ డీఎస్పీ
ఫేక్ పోలీస్.. హైదరాబాద్లో ఓ యువతి అశ్విని అనే పేరుతో జీవనం సాగిస్తోంది. అదే పేరుతో నకిలీ ఐడీ కార్డును సృష్టించి.. ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నానని పలువురిని నమ్మించింది. ఈ క్రమంలో లంగర్ హౌస్ హరిదాస్పుర బస్తీకి చెందిన నాయక్ అనే యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. అతని దగ్గర రూ.30వేలు వసూలు చేసింది. ఎన్ని రోజులైనా బాధితుడికి ఉద్యోగం రాకపోవడంతో.. ఆ యువకుడు సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి విచారించగా.. ఆమె నకిలీ కానిస్టేబుల్ అన్న విషయం బయటపడింది.
ఇవీ చదవండి: