18 years tennis player died: ఛాంపియన్షిప్స్ పోటీల్లో పాల్గొని విజేతగా తిరిగి రావాలని వెళ్లిన 18 ఏళ్ల టేబుల్ టెన్నిస్ ప్లేయర్ విశ్వ దీనదయాలన్(తమిళనాడు) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషయాన్ని టెబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.
నేడు(సోమవారం) 83వ సీనియర్ నేషనల్ అండ్ ఇంటర్ స్టేట్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఏప్రిల్ 17న విశ్వ సహా మరో ముగ్గురు ఆటగాళ్లు ట్యాక్సీలో గువాహటి నుంచి షిల్లాంగ్కు బయలుదేరారు. ఈ క్రమంలోనే ఎన్హెచ్ 6పై ప్రయాణిస్తుండగా షాంగ్బంగ్లా వద్ద ఎదురుగా వచ్చిన ఓ ట్రక్ అదుపుతప్పి.. ఈ ప్లేయర్స్ ప్రయాణిస్తున్న ట్యాక్సీపైకి దూసుకొచ్చి బలంగా ఢీ కొట్టింది. దీంతో ట్యాక్సీ డ్రైవర్, విశ్వ అక్కడికక్కడే కన్నుమూయగా.. రమేశ్ సంతోశ్ కుమార్, అభినాష్ ప్రసన్నాజీ, కిషోర్ కుమార్కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై పలువురు క్రీడా ప్రముఖులు సహా మేఘాలయ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. విశ్వ మరణం తనను తీవ్ర బాధకు గురి చేసిందని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మ ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: Cheteshwar Pujara: కౌంటీల్లో పుజారా డబుల్ సెంచరీ