బార్సిలోనా క్లబ్ శిక్షణా మైదానానికి వెళ్లే ముందు చేయాల్సిన కరోనా టెస్ట్కు స్టార్ ఫుట్బాలర్ మెస్సీ నిరాకరించాడు. ఇటీవలే ఛాంపియన్స్ లీగ్లో ఆడిన మెస్సీ.. బార్సిలోనా జట్టుతో, కొత్త కోచ్ రొనాల్డ్ కోమాన్ ఆధ్వర్యంలో జరిగే ప్రీ-సీజన్ శిక్షణకు హాజరై, ఆదివారం కరోనా పరీక్షలు చేసుకోవాలి. కానీ దానికి ససేమిరా ఒప్పుకోలేదు ఈ ప్లేయర్.
స్పానిష్ మీడియా నివేదికలు ప్రకారం.. మెస్సీ శిక్షణ కోసం మైదానానికి వెళ్లలేదు. ఎందుకంటే ఆగస్టు 25న తాను బార్సిలోనా జట్టుకు వీడ్కోలు పలకాలనుకుంటున్నాడని సదరు కబ్ల్ వెల్లడించింది. వారితో మెస్సీ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఎలాంటి బదిలీ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ బార్సిలోనా క్లబ్ అందుకు అంగీకరించడం లేదు. రెండు దశాబ్దాలుగా ఈ క్లబ్కు ఆడినా మెస్సీ.. 36కు పైగా ట్రోఫీలను అందించాడు.
తమ నుంచి విడిపోతున్నాననే విషయాన్ని జూన్ 10 నాటికే చెప్పాల్సిందని ఎఫ్సీ బార్సిలోనా పేర్కొంది. కరోనా ప్రభావంతో టోర్నీలు నిలిపేయడం వల్ల సీజన్, ఆగస్టు 14 వరకు పూర్తి కాలేదని సదరు క్లబ్ వాదించింది.
2017లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఈ ఏడాది జూన్ 10లోగా మెస్సీ అభ్యర్థిస్తే క్లబ్ను ఉచితంగా వదిలేయవచ్చు. దీనికి మెస్సీ కూడా అంగీకరించాడు. కానీ, అప్పటికే గడువు ముగిసిందని బార్సిలోనా తెలిపింది. అతడిని ఉచితంగా వదులుకునేందుకు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. జూన్ 2021 వరకు మెస్సీ, తమ జట్టు తరఫున ఆడేలా రూ.6,069.66 కోట్లకు బార్సిలోనా డీల్ కుదుర్చుకుంది.