రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సారి తన ఆటతీరుతో కాకుండా తన కెప్టెన్సీ వల్ల సరికొత్త ఫీట్ను అందుకున్నాడు కోహ్లీ. సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ఇండియాకు అత్యధిక మ్యాచ్ల్లో సారథ్యం వహించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇప్పటివరకు మాజీ కెప్టెన్ ధోనీతో సమానంగా 60 టెస్ట్ల్లో భారత్కు నాయకత్వం వహించాడు విరాట్. తాజాగా సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ మ్యాచ్తో(WTC Final) కోహ్లీ.. 61వ టెస్ట్లో టీమ్ఇండియాకు సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
టెస్ట్ల్లో అత్యధిక మ్యాచ్లకు సారథిగా వ్యవహరించిన కెప్టెన్ల జాబితాలో విరాట్ ఆరో స్థానంలో నిలిచాడు. అతడి కంటే ముందు గ్రేమ్ స్మిత్(దక్షిణాఫ్రికా) అత్యధికంగా 109 టెస్ట్ల్లో నాయకత్వం వహించాడు. అలెన్ బోర్డర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్, లాల్లయిడ్ అతడి తర్వాత ఉన్నారు.
దీంతో పాటు టెస్టుల్లో టీమ్ఇండియాకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గానూ తొలి స్థానంలో ఉన్నాడు విరాట్. 61 టెస్ట్ల్లో భారత్కు నాయకత్వం వహించి 36 మ్యాచ్లు గెలిపించాడు. మరో 14 మ్యాచ్లు ఓడిపోగా.. 10 మ్యాచ్లను డ్రాగా ముగించాడు.
ఇదీ చదవండి: టీమ్ఇండియా టెస్టు ప్రయాణం చరిత్రాత్మకం!
రోహిత్ అరుదైన రికార్డు..
టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు ప్రారంభ ఐసీసీ ఈవెంట్ ఫైనల్స్లో పాల్గొన్న మొదటి ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ ఘనత అందుకున్న తొలి ఆటగాడు అతడే కావడం విశేషం.
ఇదీ చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ వాచ్ అంత ఖరీదా?
ఇక 2007 టీ20 ప్రారంభ ప్రపంచకప్లోనూ రోహిత్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్తో జరిగిన తుదిపోరులో.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ గంభీర్ తర్వాత అత్యధిక రన్స్ చేసింది రోహితే. కేవలం 16 బంతుల్లోనే 30 పరుగులు చేసి జట్టుకు ఉపయుక్తమైన స్కోరు అందించాడు. లక్ష్య ఛేదనలో పాక్ 152 పరుగులకు ఆలౌటైంది. దీంతో ప్రారంభ పొట్టి కప్ను భారత్ గెలుపొందింది.