బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో జరిగిన ఓ సంఘటనను పాక్ క్రికెట్ ప్రధాన కోచ్ సక్లయిన్ ముస్తాక్ గుర్తు చేసుకున్నాడు. తొలుత గంగూలీ గురించి తప్పుడు అభిప్రాయంతో ఉండేవాడినని.. అయితే బీసీసీఐ అధ్యక్షుడు చేసిన దానికి ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నాడు.
"మొదటిసారి నేను గంగూలీని కలిసేటప్పుడు కాస్త కంగారు పడ్డా. ఎందుకంటే అతడు టీమ్ఇండియా కెప్టెన్, దిగ్గజ క్రికెటర్. అలాంటి వ్యక్తి నిన్ను ఎందుకు కలుస్తాడని కొందరు చెప్పడం వల్ల ఆందోళన ఇంకొంచెం పెరిగింది. అయితేనేం చివరికి కలిశా.. కానీ 'హలో', 'హాయ్' మాటలకే గంగూలీ పరిమితమయ్యాడు. దీంతో దాదా తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని భావించా. ఎప్పుడూ మాట్లాడకూడదని అనుకొన్నా. అయితే 2003-2004 సీజన్లో భారత్తో ఆడేందుకు నాకు మళ్లీ అవకాశం వచ్చింది. అప్పటికే నా మోకాలికి చిన్న ఆపరేషన్ జరిగింది. సచిన్ కూడా ఎల్బోకి శస్త్రచికిత్స చేయించుకొని జట్టులోకి వచ్చాడు. ఆపరేషన్ తర్వాత విశ్రాంతి తీసుకొన్న తర్వాత ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ అదే. అప్పటికే సస్సెక్స్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడి ఫిట్నెస్ సాధించా" అని వివరించాడు.
ఈ క్రమంలో గంగూలీ చేసిన పనికి ఆశ్చర్యంతోపాటు అతడిపై నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేసిందని ముస్తాక్ తెలిపాడు. "భారత్తో సిరీస్ సందర్భంగా ఇరు జట్లకూ పక్కపక్కనే డ్రెస్సింగ్ రూమ్లు ఉండేవి. చిన్న గోడ మాత్రమే అడ్డు. దీంతో గంగూలీ రెండు కాఫీ కప్లతో వచ్చాడు. గోడ దగ్గరకు వచ్చాక ఎలా రావాలని ఆలోచిస్తుండగా.. గోడ దూకైనా రావచ్చు, లేకపోతే వెనక నుంచి తిరిగి రావచ్చు అని చెప్పా. అయితే గంగూలీ గోడపై నుంచి జంప్ చేశాడు. రెండు కాఫీ కప్లను చేతిలో ఉంచుకొని మరీ సౌరభ్ గోడను దూకి రావడంతో షాక్కు గురయ్యా. కాఫీ ఇచ్చి దాదాపు 30 నిమిషాలపాటు నాతో మాట్లాడాడు. ఆశ్యర్యపోవడం నావంతైంది. గతంలో గంగూలీ గురించి అలా అనుకోవడం గుర్తొచ్చి అప్పుడు నామీద నాకే సిగ్గుగా అనిపించింది. నా మోకాలి గాయం గురించి అడిగిన గంగూలీ జాగ్రత్తలు చెప్పాడు" అని సక్లయిన్ ముస్తాక్ చెప్పాడు. భారత్-పాక్ పోరులో సచిన్-ముస్తాక్ మధ్య జరిగే పోటీ అప్పట్లో అభిమానులను అలరించింది.
ఇదీ చూడండి: కోపంగా కోహ్లీ.. రోహిత్ ఫన్నీ రియాక్షన్.. ఏమైంది?