టీమ్ఇండియా రన్మెషిన్, సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli).. తన కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా ఇబ్బంది పడుతున్నాడు. ఏడాదికి కనీసం నాలుగైదు సెంచరీలు సాధించే కోహ్లీ ఖాతాలో.. గత 18 నెలలుగా ఒక్క సెంచరీ కూడా లేకపోవడం ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా.. అతడి బ్యాటింగ్ సగటు కూడా పడిపోతుండటం అభిమానులను కలవరపెడుతోంది.
టెస్టులు, వన్డేల్లో కలిపి ఇప్పటికే 70 శతకాలు సాధించిన కోహ్లీ.. ఇటీవల జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిఫ్ ఫైనల్లోనూ (WTC final) డీలాపడ్డాడు. త్వరలో ఇంగ్లాండ్తో జరగనున్న సిరీస్లోనైనా 71వ శతకం అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పడిపోయిన బ్యాటింగ్ సగటు..
గత ఏడాదిన్నర కాలంగా బ్యాటింగ్లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు విరాట్ కోహ్లీ. 2019 నవంబర్లో బంగ్లాదేశ్పై చివరిసారిగా సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కొద్దిసార్లు మాత్రమే 70, అంతకుమించిన పరుగులు సాధించాడు.
2008లో క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఏడాది శతకం సాధిస్తూ వచ్చాడు టీమ్ఇండియా సారథి. 2020లో మాత్రమే అతడు మూడెంకల స్కోరు అందుకోలేకపోయాడు.
ఇప్పటివరకు టెస్టుల్లో 52.04 సగటుతో బ్యాటింగ్ కొనసాగిస్తూ వచ్చాడు కోహ్లీ. 2019లో చివరగా సెంచరీ కొట్టిన తర్వాత 8 టెస్టులు ఆడాడు. వీటిలో 14 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసిన విరాట్.. 24.64 సగటును నమోదు చేశాడు. వీటిల్లో రెండు అర్ధ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. స్వదేశంలో చెన్నై వేదికగా ఇంగ్లాండ్పై ఒకటి.. మరొకటి ఆసీస్తో అడిలైడ్ టెస్ట్లో చేశాడు.
2019 తర్వాత వన్డేల్లో 15 మ్యాచులాడిన విరాట్.. 43.26 సగటుతో 649 రన్స్ చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో కోహ్లీ సగటు 59.07గా ఉంది. టెస్టులతో పోలిస్తే వన్డేల్లో ఫర్వాలేదనిపించాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. కానీ, మూడెంకల స్కోరును అందుకోలేకపోయాడు.
అయితే ఇదే సమయంలో టీ20 ఫార్మాట్లో మునుపటి కంటే మెరుగ్గా కనిపించాడు విరాట్. 64.45 సగటుతో 709 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్లో అతని కెరీర్ సగటు 52.65గా ఉంది.
ఇదీ చదవండి: డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్ షురూ- భారత్ షెడ్యూల్ ఇదే..