మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-దిల్లీ క్యాపిటల్స్ మధ్య దుబాయ్ వేదికగా సోమవారం మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడి మూడింటిలో విజయం సాధించిన దిల్లీ.. పాయింట్ల పట్టికలో ముందంజలో ఉంది. రాజస్థాన్పై అద్భుత విజయంతో కోహ్లీసేన జోరుపెంచి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు ఈ రెండు జట్లు తొలిసారి తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాలు బలహీనతలపై ఓ లుక్కేద్దాం.
వ్యూహాలు ఫలించేనా?
ఈ సీజన్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న జట్టు దిల్లీ క్యాపిటల్స్. ఓపెనర్లు పృథ్వీ షా, ధావన్ బ్యాటింగ్లో మెరుపులు మెరిపిస్తుంటే.. సారథి శ్రేయస్ అయ్యర్ ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. వారిని ఆపడం ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద సవాలనే చెప్పాలి. పంత్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక బౌలర్లు హర్షల్ పటేల్, రబాడా, అమిత్ మిశ్రాల అండ జట్టుకు ఉండనే ఉంది.
దిల్లీ వేగాన్ని ఆపగలదా?
తొలి మ్యాచ్లో మంచి ఆరంభాన్నిచ్చి అభిమానుల్లో ఆశలు పెంచిన కోహ్లీ సేన.. ఆ తర్వాత మ్యాచ్లో నిరాశపరిచింది. శనివారం రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో దూకుడు పెంచి అందరి దృష్టినీ ఆకర్షించింది. కోహ్లీ(72), పడిక్కల్(63) అద్భుతంగా ఆడారు. వాషింగ్టన్ సుందర్, డివిలియర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ పరంగా సైనీ, చాహల్, జంపా, శివమ్ దూబె వంటి స్టార్ బౌలర్లతో జట్టు బలంగా ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్, పార్థివ్ పటేల్, ఆరోన్ ఫించ్, జోష్ ఫిలిప్, క్రిస్ మోరిస్, మహ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ, ఆడమ్ జంపా.
దిల్లీ క్యాపిటల్స్
పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్, హెట్మెయర్, స్టోయినిస్, అశ్విన్, కగిసో రబాడ, ఎన్రిచ్ నోర్ట్జే, అమిత్ మిశ్రా, హర్షల్ పటేల్