కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కూర్పు ఏ మాత్రం బాగాలేదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శించాడు. అందుకే ఆ జట్టు గెలవాల్సిన మ్యాచులను ఓడిపోతోందని అన్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు జేమ్స్ నీషమ్ మ్యాచ్ విజేత కాడని వెల్లడించాడు. ముజిబుర్ రెహ్మన్కు తుది జట్టులో చోటివ్వలేకపోతున్న ఏకైక జట్టు ప్రపంచంలో ఇదేనని ఘాటుగా వ్యాఖ్యానించాడు.
"నేను చెప్పేదొక్కటే. పంజాబ్ సరైన జట్టుతో ఆడటం లేదు. తుది జట్టులో ముజిబుర్కు చోటివ్వలేకపోతున్న ఏకైక జట్టు ఇదే. విదేశీ పేసరైన నీషమ్ను వారు ఆడిస్తున్నారు. అటు పవర్ప్లే, ఇటు డెత్లో అతడు బౌలింగ్ చేయలేడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే అతడు మ్యాచ్ విజేత కాదు. నాలుగు, ఐదు స్థానాల్లో భారీ షాట్లు ఆడి గెలిపించలేడు. మరి అతడిని ఎందుకు తుది జట్టులోకి తీసుకుంటున్నారు? గెలిపించలేని ఆటగాడిని ఆడించడం వల్ల లాభమేంటి?"
-ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత
మహ్మద్ షమీ కూడా టీమ్ఇండియాకు తొలి ప్రాధాన్యం ఉన్న డెత్ బౌలర్ కాదని చోప్రా అన్నాడు. ముంబయి మ్యాచులో 15 ఓవర్లకు ముందే కాట్రెల్ కోటాను పూర్తి చేయించారని విమర్శించాడు. "ఇది ఏ రకమైన బౌలింగ్? మరి డెత్లో ఎవరితో వేయిస్తారు?కాట్రెల్ను మినహాయిస్తే మిగిలింది నీషమ్, గౌతమ్, షమీ. టీమ్ఇండియాకు షమీ తొలి ప్రాధాన్య డెత్ బౌలర్ కాదు. అందుకే 20వ ఓవర్ను గౌతమ్కు ఇచ్చారు. ఈ రోజుల్లో అనుభవజ్ఞులైన నరైన్, అశ్విన్, భజ్జీకి కూడా ఆఖరి ఓవర్ బంతి ఇవ్వడం లేదు కదా" అని చోప్రా అభిప్రాయపడ్డాడు.
అబుదాబి వేదికగా ముంబయితో జరిగిన మ్యాచులో రాహుల్ సేన 48 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో సత్తాచాటిన ముంబయి ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.