టీ20ల్లో బాగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్ తాజా ర్యాంకింగ్స్లో మరింత ముందుకు దూసుకెళ్లాడు. ఇటీవలే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ను అధిగమించిన అతడు.. మరో ర్యాంకును మెరుగుపరుచుకుని.. 801 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ చివరి మ్యాచ్లో 36 బంతుల్లో 69 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ అద్భుత ప్రదర్శన తర్వాత తాజా ఘనతను అందుకున్నాడు.
కాగా, పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 861 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బాబర్ ఆజమ్ 799 పాయింట్లతో మూడోస్థానాన్ని సర్దుకొన్నాడు. రోహిత్ శర్మ 613 పాయింట్లతో 13వ స్థానంలో, విరాట్ కోహ్లీ ఒక పాయింటు మెరుగుపర్చుకొని 606 పాయింట్లతో 15వ స్థానంలో ఉన్నారు.
ఇక బౌలింగ్ విభాగంలో భారత ఆటగాడు భునేశ్వర్ కుమార్ 658 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నాడు. గతంతో పోలిస్తే ఒక పాయింటు కోల్పోయాడు. ఇక అక్షర్ పటేల్ 11 పాయింట్లు మెరుగు పర్చుకొని 588తో 18వ స్థానానికి ఎగబాకాడు. యజువేంద్ర చాహల్ 27వ స్థానంలో ఉన్నాడు. టాప్-30లో ముగ్గురు మాత్రమే భారత బౌలర్లు ఉన్నారు. ఇక అగ్రస్థానంలో 737 పాయింట్లతో జోష్ హేజిల్వుడ్ ఉన్నాడు.
ఆల్రౌండర్ విభాగంలో హార్దిక్ పాండ్యా ఒక్కడే ఈ జాబితాలో స్థానం సంపాదించుకొన్నాడు. మొత్తం 184 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితా టాప్లో 246 పాయింట్లతో బంగ్లాదేశ్ ఆల్రౌండర్ మహమ్మద్ నబీ కొనసాగుతున్నాడు. ఇక ఈ జాబితాలో మరే భారత ఆటగాడికి చోటు దక్కలేదు.
ఇదీ చూడండి: IND VS SA: కోహ్లీ-రోహిత్ల భారీ కటౌట్.. ఫ్యాన్స్ సోషల్మీడియా వార్