నిరవధిక వాయిదా పడిన ఈ ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్కు ఆడిన అవేశ్ ఖాన్.. ఎనిమిది మ్యాచులాడి 14 వికెట్లు తీశాడు. ఇందులో భాగంగా ఓ మ్యాచ్లో ధోనీని బౌల్డ్ చేయడం, అందులోనూ రెండో బంతికే పెవిలియన్కు పంపడం విశేషం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవేశ్.. ధోనీని ఔట్ చేయడానికి పంత్ తనకు సలహా ఇచ్చినట్లు చెప్పాడు.
"మహీ భాయ్ క్రీజులోకి వచ్చే సమయానికి కొన్ని ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ సమయంలో ధోనీ హిట్ చేస్తాడనే విషయం పంత్కు తెలుసు. కానీ నాలుగు నెలల గ్యాప్ తర్వాత అతడు ఆడుతున్నాడు కాబట్టి అది చేయలేడని గ్రహించిన పంత్.. నన్ను బంతిని షార్ట్ ఆఫ్ లెంగ్త్తో వేయమన్నాడు. నేను అదే చేశాను. ధోనీ హిట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది ఎడ్జ్ తీసుకుని బౌల్డ్ అయ్యాడు. మూడేళ్ల క్రితం మహీ భాయ్ వికెట్ తీసే అవకాశం వచ్చినా అది చేజారిపోయింది. ఈ సారి ఔట్ చేయడం వల్ల నా కల నెరవేరింది. ఎంతో సంతోషంగా ఉన్నాను." అని వివరించాడు.
ఈ ఐపీఎల్ ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన అతనికి మంచి అవకాశం కూడా దక్కింది. జూన్ 18-22 మధ్య సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, ఆపై ఇంగ్లాండ్తో జరిగే ఐదు టెస్టుల సిరీస్కు అవేశ్ఖాన్తో పాటు అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్జాన్ నాగ్వాస్వాలా స్టాండ్ బై బౌలర్లుగా ఎంపికయ్యారు.
ఈ పర్యటనలో తుది జట్టులో ఆడే అవకాశం వస్తే తన శక్తిమేరకు కృషి చేసి మంచి ప్రదర్శన ఇవ్వటానికి సిద్ధంగా ఉంటానని అవేశ్ఖాన్ పేర్కొన్నాడు. "నేను నెట్ బౌలర్గా టీమ్ఇండియాతో కలిసి దక్షిణాఫ్రికా వెళ్లాను. ఇంగ్లాండ్లో జరిగిన 2019 ప్రపంచకప్ సమయంలోనూ జట్టుతో ఉన్నా. ఆసియా కప్, స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్కు కూడా టీమిండియాతోనే ఉన్నా. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో స్టాండ్ బై బౌలర్గా నాకు మంచి అవకాశం వచ్చింది. ఒకవేళ జట్టులో ఎవరైనా గాయపడితే తుది జట్టులో చోటు దక్కొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కసరత్తులు మొదలుపెడతా. తుది జట్టులో చోటు దక్కితే శక్తిమేరకు కృషి చేసి మంచి ప్రదర్శన ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాను" అని అవేశ్ఖాన్ అన్నాడు.
ఇదీ చూడండి: క్రేజీ ఐడియా.. వెదురుతో క్రికెట్ బ్యాట్!