కరోనా కారణంగా అక్టోబరులో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన సందిగ్ధంలో పడింది. ఒకవేళ పర్యటనకు వెళ్లగలిగితే అడిలైడ్ ఓవల్లో కొత్తగా నిర్మితమైన హోటల్ను క్వారంటైన్ సెంటర్గా ఉపయోగించుకోవడానికి భారత జట్టుకు ఇచ్చే అవకాశముంది.
కరోనాను నియంత్రించడానికి సరిహద్దులు మూసివేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ప్రయాణాలపైనా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో అనుకున్న ప్రకారం సిరీస్లు జరిగితే పర్యటక జట్ల ఆరోగ్యం, భద్రత కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్రంగా కసరత్తు చేస్తోంది.
ఇప్పుడు నిబంధనల ప్రకారం ఆస్ట్రేలియా వచ్చే వాళ్లందరికీ 14 రోజుల ఐసోలేషన్ తప్పనిసరి. దీని వల్ల భారత జట్టు సాధనకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశముంది. అయితే సెప్టెంబరులో ఆరంభమయ్యే 138 గదుల ఓవల్ హోటల్లో ఉంటే కోహ్లీసేనకు చాలా సౌకర్యంగా ఉంటుంది. హోటల్కు ఆనుకుని ఉన్న నెట్స్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మంచి భోజన సదుపాయం కూడా ఉంటుంది.