కరోనా మహమ్మారి లేకపోతే ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ ఇప్పటికే ముగిసేది. బ్యాట్స్మెన్ల సునామీ ఇన్నింగ్స్లు, సెంచరీలు, బౌలర్ల ప్రదర్శన, ఫీల్డర్ల విన్యాసాలు ఇలా చాలా విషయాలపై ఫ్యాన్స్ చర్చించుకుంటూ ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆ సరదా అంతా దూరమైంది. త్వరలోనే ఈ లీగ్ ప్రారంభమవ్వాలని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. అయితే ఇప్పటివరకు ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీలు ఎవరి పేరు మీద ఉన్నాయో ఓసారి చూద్దాం.
క్రిస్ గేల్ (30 బంతులు-2013)
సునామీ ఇన్నింగ్స్లకు పెట్టింది పేరు క్రిస్ గేల్. అతడు ఒక్కసారి బ్యాట్కు పనిచెప్పాడంటే బౌండరీల మోత మోగాల్సిందే. స్కోర్ బోర్డు పరుగులు పెట్టాల్సిందే. బౌలర్ ఎవరన్నది ముఖ్యం కాదు బంతి బౌండరీ దాటడమే లక్ష్యం అన్న విధంగా అతడి బ్యాటింగ్ ఉంటుంది. ఈ ఆటగాడికి టీ20 లీగ్లంటే మరీ సరదా. అందుల్లో ఆడటానికి తెగ ఇష్టపడతాడు. ఐపీఎల్లోనూ ఇతడి పేరిట పలు రికార్డులు ఉన్నాయి. అందులో అత్యంత వేగవంతమైన సెంచరీ ఒకటి. 2013లో పుణె వారియర్స్తో జరిగిన మ్యాచ్లో గేల్ తన సునామీ ఇన్నింగ్స్ను రుచి చూపించాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేసి బెంగళూరు ఫ్యాన్స్కు మజా అందించాడు.
పుణె బౌలర్లను ఊచకోత కోసిన గేల్ చెమట పట్టకుండా అలవోకగా సెంచరీ సాధించాడు. కేవలం 30 బంతుల్లోనే శతకంతో పాటు 66 బంతుల్లో 175 పరుగులతో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్తో పాటు టీ20 క్రికెట్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. 13 ఫోర్లు, 17 సిక్సర్లతో స్ట్రైక్ రేట్ 266తో పరుగులు సాధించాడు.. ఇతడి ధాటికి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 5 వికెట్ల నష్టానికి 263 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇది కూడా ఐపీఎల్లో ఓ జట్టు అత్యధిక స్కోరుగా నిలిచింది. కానీ పుణె మాత్రం బెంగళూరుకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా ఆర్సీబీ 130 పరుగుల తేడాతో విజయం సాధించింది.
యూసఫ్ పఠాన్ (37 బంతులు-2010)
2010 ఐపీఎల్లో తన విధ్వంసకర ప్రదర్శనతో అందరినీ తనవైపు తిప్పుకున్నాడు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యూసఫ్ పఠాన్. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 213 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచింది. అప్పటికే తన విఫల ప్రదర్శనతో ఉన్న యూసఫ్ ఈ మ్యాచ్లో మాత్రం తానేంటో నిరూపించుకున్నాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీతో జట్టుకు విజయాన్నందించినంత పని చేశాడు. కానీ దురదృష్టవశాత్తు రనౌట్గా వెనుతిరగగా.. ఫలితం తారుమారైంది. ఈ ప్రదర్శనతో మూడేళ్లు ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు యూసఫ్. 2013లో గేల్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. యూసప్ ఈ మ్యాచ్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లు సాధించాడు.
డేవిడ్ మిల్లర్ (38 బంతులు-2013)
ఐపీఎల్ చరిత్రలో 2013 సీజన్ను మోస్ట్ ఎంటర్టైనింగ్ ఎడిషన్గా చెప్పుకోవచ్చు. అద్భుతమైన ఛేజ్లు, బ్యాట్స్మెన్స్ విధ్వంసకర ఇన్నింగ్స్, ఉత్కంఠ రేపే మ్యాచ్లు ఇలా ఈ ఏడాది క్రికెట్ ప్రేక్షకుల్ని గొప్పగా అలరించిందీ లీగ్. గేల్ సునామీ సెంచరీ చేసిన కొన్ని రోజులకే మరో స్టైలిష్ శతకం అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ మ్యాచ్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మొదట 190 పరుగులు చేయగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 13 ఓవర్లలో 95 పరుగులతో ఓటమి అంచున నిలిచింది. అయితే ఐదో నెంబర్ బ్యాట్స్మన్గా వచ్చిన డేవిడ్ మిల్లర్ కేవలం 54 నిమిషాల్లో మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. 8 ఫోర్లు, 7 సిక్సులతో చెలరేగిపోయాడు. 265 స్ట్రైక్ రేట్తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఇంకా 12 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో పంజాబ్ విజయ బేరీ మోగించింది. మూడు పరుగులు చేస్తే జట్టు గెలుపు అనగా 95 పరుగుల వద్ద ఉన్న మిల్లర్ సిక్స్తో సెంచరీతో పాటు జట్టుకు విజయాన్ని చేకూర్చాడు.
ఆడమ్ గిల్క్రిస్ట్ (42 బంతులు-2008)
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ఆడమ్ గిల్క్రిస్ట్ ఐపీఎల్లోనూ సత్తాచాటాడు. 2008లో ముంబయి ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఈ దక్కన్ ఛార్జర్స్ ఆటగాడు మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. 155 పరుగుల లక్ష్య ఛేదనలో 42 బంతుల్లోనే సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. మరో ఓపెనర్ వీవీఎస్ లక్ష్మణ్ 7 పరుగులతో రాణించడం వల్ల దక్కన్ ఛార్జర్స్ 10 వికెట్ల తేడాతో మరపురాని విజయం కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో గిల్క్రిస్ట్ 9 ఫోర్లు, 10 సిక్సులు సాధించాడు. మొత్తంగా 47 బంతుల్లో 109 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇప్పటికి 12 ఎడిషన్లు పూర్తయినా గిల్క్రిస్ట శతకం నాలుగో స్థానంలో నిలవడం విశేషం.
ఏబీ డివిలియర్స్ (2016), డేవిడ్ వార్నర్ (2017)- 43 బంతులు
ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్ మోస్ట్ స్టైలిష్, విధ్వంసకర ఓపెనర్లుగా పేరు తెచ్చుకున్నారు. వీరికి భారత్లోనూ గొప్ప ఫ్యాన్ ఫాలోయంగ్ ఉంది. దానికి కారణం ఐపీఎల్లో వీరి ప్రదర్శనే. అయితే ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన శతకం వీరిద్దరి పేరిటా ఉంది. 2016లో గుజరాత్ లయన్స్పై సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో 43 బంతుల్లో సెంచరీ బాదాడు డివిలియర్స్. తన సొంత మైదానం హైదరాబాద్ రాజీవ్గాంధీ స్టేడియంలో కోల్కతా నైటరైడర్స్పై ఈ శతకం సాధించాడు వార్నర్. 10 ఫోర్లు, 12 సిక్సులతో 52 బంతుల్లో 129 పరుగులతో నాటౌట్గా నిలిచిన ఏబీ.. బెంగళూరుకు విజయాన్నందించాడు. అలాగే 59 బంతుల్లో 126 పరుగులతో కేకేఆర్ పతనాన్ని శాసించాడు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి.