ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన భారత్.. రెండో టెస్టుకు తుది జట్టులో మూడు నుంచి అయిదు మార్పులు చేస్తుందన్న అంచనాలున్నాయి. కోహ్లీ, షమీ సిరీస్లో మిగతా మ్యాచ్లకు అందుబాటులో లేకుండా పోయారు కాబట్టి ఆ ఇద్దరి స్థానాల్ని వేరే ఆటగాళ్లతో భర్తీ చేయాలి. అలాగే తొలి టెస్టులో ఘోరంగా విఫలమై తీవ్ర విమర్శల పాలైన పృథ్వీ షాపై వేటు పడటమూ ఖాయమే. పృథ్వీ స్థానంలోకి గిల్, షమీ బదులు సిరాజ్ లేదా సైనీ వస్తారని అంచనా.
అయితే కోహ్లీ బదులు రాహుల్ వస్తాడని అంతా అనుకుంటుండగా.. తాత్కాలిక కెప్టెన్ రహానె, కోచ్ రవిశాస్త్రి అందుకు భిన్నంగా యోచిస్తున్నట్లు సమాచారం. ఫిట్నెస్ సాధించిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను కోహ్లీ స్థానంలోకి తీసుకోనున్నారట. కోహ్లీ స్థానంలో రాహులే ఖాయమని.. విహారి స్థానంలో జడేజాను తీసుకోవచ్చని, అలాగే సాహా బదులు పంత్ను ఎంచుకునే అవకాశాలున్నాయని వార్తలొచ్చాయి. కానీ విహారి, సాహాలను రెండో టెస్టుకు కొనసాగించనున్నారని తెలుస్తోంది. కోహ్లీ స్థానంలోకి ఆల్రౌండ్ సేవలందించగల జడేజాకు తీసుకొస్తారట. గతంలో లెక్కకు మిక్కిలి అవకాశాలు వచ్చినా వాటిని ఉపయోగించుకోకపోవడం, చివరగా ఆడించిన టెస్టు సిరీస్లో పేలవ ప్రదర్శన చేయడం, ఏడాదిన్నరకు పైగా టెస్టులకు దూరంగా ఉండటం రాహుల్కు ప్రతికూలంగా మారింది. అతణ్ని టెస్టు సిరీస్ ముంగిట వార్మప్ మ్యాచ్లోనూ ఆడించలేదు.