అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ లీగుల్లో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఇటీవలే కెనడా గ్లోబల్ లీగ్లో పాల్గొన్న యువీ త్వరలో జరిగే అబుదాబి టీ10 లీగులోనూ ఆడనున్నాడు. యువరాజ్ వంటి ఆటగాడు ఈ లీగ్లో ఆడటం చాలా సంతోషంగా ఉందన్నాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఆమ్లా.
"ఇలాంటి లీగుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లు ఆడాలని అభిమానులు కోరుకుంటారు. ఇప్పుడు యువీ టీ10 లీగ్ ఆడటం అద్భుతంగా ఉంది. అలాగే యువ క్రికెటర్లు అతడితో కలిసి ఆడటం ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. బీసీసీఐకి నిర్దిష్టమైన నియమాలు ఉన్నందున టీమిండియా క్రికెటర్లపై స్పందించడం సరికాదు. యువీ ఇరవై ఏళ్లుగా అద్భుతమైన క్రికెటర్గా ఎదిగాడు. అబుదాబి టీ10 లీగ్ ఆడటం కోసం ఎంతో ఎదురుచూస్తున్నా. ఈ లీగ్ మూడు, నాలుగేళ్లుగా జరుగుతున్నా ఇదొక కొత్త ఫార్మాట్. అయితే, ఈ ఫార్మాట్లో చాలా కాలం నుంచే ఆడుతున్నారు. చిన్నప్పుడు స్నేహితులతో ఇలాగే ఆడుతూ పెరిగాము. అయితే, అత్యుత్తమ స్థాయిలో ఆడటం ఇంకా అద్భుతంగా ఉంటుంది."
-ఆమ్లా, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు
మరాఠా అరేబియన్స్ ఫ్రాంఛైజీ తరపున ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నాడు యువీ. జింబాబ్వే మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్ ఆ జట్టు కోచ్గా నియమితులయ్యాడు. అతడే యువీ పేరును సూచించినట్లు సమాచారం. మరాఠా అరేబియన్స్ జట్టుకు డ్వేన్ బ్రేవో సారథ్యం వహిస్తున్నాడు. లసిత్ మలింగ, క్రిస్ లిన్, ఆఫ్గాన్ ఆటగాళ్లు హజ్రతుల్లా జజాయ్, నజీబుల్లా జద్రాన్ తదితరులు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఇవీ చూడండి.. కీపింగ్ మానేద్దామనుకుంటున్నా...: ముష్ఫికర్ రహీమ్