క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ను ఒక్కసారి మాత్రమే తప్పుడు నిర్ణయంతో ఔటివ్వలేదని, చాలా సార్లు ఇచ్చానని ప్రముఖ అంపైర్ సైమన్ టౌఫెల్ అన్నాడు. లిటిల్ మాస్టర్ ఆడే రోజుల్లో పలు సందర్భాల్లో ఔటవ్వకున్నా అంపైర్ల తప్పుడు అంచనాలకు పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 2007లో ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్తో ఆడిన ఓ టెస్టులో సచిన్ 91 పరుగుల వద్ద ఉండగా టౌఫెల్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. అది అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది.
పాల్ కాలింగ్వుడ్ వేసిన ఆ బంతిని ఎల్బీడబ్యూగా అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. అయితే, ఆ బంతి వికెట్లకు తాకదనే నమ్మకంతో ఉన్న లిటిల్ మాస్టర్ కొద్దిసేపు అలాగే క్రీజులో వేచిచూసి తర్వాత మైదానం వీడాడు. రీప్లేలో బంతి వికెట్లకు తాకలేదని తెలియడం వల్ల టౌఫెల్ తప్పుడు నిర్ణయం ప్రకటించాడని స్పష్టమైంది. తాజాగా ఇదే విషయంపై స్పందించిన నాటి అంపైర్.. అప్పుడు తాను అనుకోకుండా ఔటిచ్చానని చెప్పాడు. అదొక్కసారే కాదని, సచిన్ విషయంలో చాలా సార్లు అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించాడు.
"నేను ఔటిచ్చాక సచిన్ సంతోషంగా లేడు. నేను కళ్లారా చూశా. కొద్దిసేపు అలాగే క్రీజులో ఉండి తర్వాత వెళ్లిపోయాడు. మాస్టర్ ఎప్పుడూ అలా మైదానంలో ఉండడు. కానీ ఆ రోజు ఔట్కాలేదనే నమ్మకంతోనే అలా నిలబడ్డాడు. తర్వాత నెలరోజుల పాటు నేను పేపర్లు చదవలేదు, వార్తలు వినలేదు. మరుసటి రోజు ఉదయమే సచిన్ను కలిశా. ముందురోజు నాకు ఔట్గా అనిపించడం వల్ల అలా ఔటిచ్చినట్లు చెప్పా. సచిన్ కూడా దానికి సానుకూలంగా స్పందించాడు. 'నువ్వో మంచి అంపైర్. ఎప్పుడూ తప్పులు చేయవు. ఆ విషయం నాకు తెలుసు. దాని గురించి వదిలెయ్. పట్టించుకోకు' అని నాతో అన్నాడు."
-సైమన్ టౌఫెల్, మాజీ అంపైర్
ఆ తర్వాత తాను మరింత బాధ్యతగా అంపైరింగ్ చేశానని ఆపై ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు నిర్ణయాలు తీసుకోలేదని సైమన్ టౌఫెల్ చెప్పాడు.