మైదానంలో ప్రస్తుత టీమ్ఇండియాకు రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ సారథి అని మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడు బౌలింగ్ చేయగలడని ప్రశంసించాడు. ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడని అన్నాడు.
"తాను ఏం చేయాలనుకుంటున్నాడో అశ్విన్కు కచ్చితంగా తెలుసు. అతడింకా కొత్తవాడేమీ కాదు. గతంలోనూ ఆస్ట్రేలియాలో పర్యటించాడు. జట్టులో చోటు కోసం ఆడాల్సిన పరిస్థితి లేదు. ఒక ఆటగాడికి అదే అత్యంత ముఖ్యమైన విషయం. ప్రదర్శన బాగాలేకపోయినా జట్టులో చోటుంటుందని తెలిసినప్పుడు బౌలర్ దేహభాష మారుతుంది. కొన్ని ప్రయోగాలు చేసేందుకు వీలుంటుంది. అదే అశ్విన్ పాత్రను భిన్నంగా మార్చింది. మైదానంలో అతడు భారత జట్టుకు బౌలింగ్ కెప్టెన్." అని ఓజా అన్నాడు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో అశ్విన్ అదరగొడుతున్నాడు. 2 మ్యాచుల్లో 10 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఆసీస్ ప్రధాన ఆటగాడు స్టీవ్స్మిత్ తక్కువ పరుగులకే పెవిలియన్కు చేరుకోవడంలో అతడిదే కీలక పాత్ర. మొత్తం నాలుగు ఇన్నింగ్స్ల్లో అతడిని రెండుసార్లు ఔట్ చేశాడు. లెగ్సైడ్ ఫీల్డర్లను పెట్టి ఉచ్చు బిగించి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు పరుగులు చేయకుండా నియంత్రిస్తున్నాడు.
ఇవీ చదవండి : బ్యాట్స్మన్కు ఫ్రీ హిట్ ఉంది.. మరి బౌలర్లకు?