కరోనా వైరస్ కారణంగా క్రీడారంగం పూర్తిగా స్తంభించిపోయింది. ఇప్పటికే పలు టోర్నీలు వాయిదా పడటం లేదా రద్దయ్యాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ను నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ. అయితే తాజాగా ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్పై సందిగ్ధం నెలకొంది. ఆస్ట్రేలియా.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తమ సరిహద్దులను 6 నెలలపాటు మూసివేసింది. దీంతో అక్కడ టీ20 ప్రపంచకప్ నిర్వహణపై అభిమానుల్లో అనుమానాలు నెలకొన్నాయి.
అయితే దీనిపై టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్ నిర్వహణ జరుగుతుందో లేదో తెలియదని అన్నాడు.
"ఈ ఏడాది అక్టోబర్లో టీ20 ప్రపంచకప్ జరుగుతుందో.. లేదో.. మనం ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో క్రికెట్ మళ్లీ ఎప్పుడు ఆరంభం అవుతుందో కూడా చెప్పే అవకాశం లేదు."
-రవిశాస్త్రి, టీమిండియా కోచ్.
అయితే క్రీడల పునఃప్రారంభం ప్రజల్లో తప్పకుండా వినోదాన్ని నింపుతుందని అన్నాడు. త్వరలోనే ఇది జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అందరిని ఇళ్లకు పరిమితం అయ్యేలా చేసిన కోవిడ్-19ను సమర్థమంతంగా తరిమికొట్టాలని అన్నాడు. అలా చేస్తేనే.. భవిష్యత్తు సంతోషంగా ఉంటుందని.. అందుకోసం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.