నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ(ఎన్డీటీఎల్)పై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా). ఐపీఎల్ సందర్భంగా క్రికెటర్ల నుంచి సేకరించే డోప్ నమూనాలను స్పెయిన్లోని బార్సిలోనా ల్యాబ్లో పరీక్షించనున్నారు.
తొలిసారి..
ఎన్డీటీఎల్పై వేటు తర్వాత ఎప్పుడూ ఖతార్లోని దోహా ల్యాబ్కే నమూనాలు పంపించేంది బీసీసీఐ. అయితే తొలిసారి బార్సిలోనా క్లబ్కు చెందిన కాటలోనియన్ యాంటీ డోపింగ్ ల్యాబొరేటరీ తెరపైకి వచ్చింది. యూఏఈ నేషనల్ యాంటీ డోపింగ్ ఆర్గనైజేషన్(నాడో) నిబంధనల మేరకే ఈ కొత్తల్యాబ్ను ఎంచుకున్నారట. ఇందువల్ల బీసీసీఐపై భారీగానే భారం పడనుంది. దోహా ల్యాబ్లో మూత్ర నమూనాలు పరీక్షించేందుకు ఒక్కో శాంపిల్కు 120 డాలర్లు ఖర్చయితే.. బార్సిలోనా ల్యాబ్లో దానికి దాదాపు 10 రెట్లు చెల్లించాలట.
ఆటగాళ్ల మూత్ర నమూనాలు తీసుకునే డీసీఓల.. ప్రయాణాలు, వారి ఆతిథ్యం కోసం ఐపీఎల్ నిర్వాహకులు లక్షలు ఖర్చుపెట్టనున్నారు. మొత్తం ఐదుగురు అధికారులు చొప్పున మూడు బృందాలు టెస్టులు నిర్వహిస్తాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 మధ్య మూడు విడతల్లో పరీక్షలు చేయనున్నారు. ఇందుకోసం ఆతిథ్య దేశంలో ప్రత్యేకంగా 5 డోపింగ్ నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
మ్యాచ్లు జరిగే దుబాయ్, షార్జా, అబుదాబి స్డేడియాల్లో ముూడు కేంద్రాలు, ఆటగాళ్లు సాధన చేసే ఐసీసీ అకాడమీ, జాయెద్ క్రికెట్ స్టేడియాల్లో మిగతా రెండు కేంద్రాలు ఉంటాయి. వీటిల్లో విరాట్, ధోనీ, రోహిత్ వంటి స్టార్ క్రికెటర్లు సహా మొత్తం 50 మంది శాంపిల్స్ తీసుకుంటారు. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ మొదలుకానుంది.