భారత్తో టీ20 సిరీస్కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. ప్రపంచ కప్కు ముందు స్పిన్ పిచ్ల అనుభవం సంపాదించాలనుకున్నట్లు పేర్కొన్నాడు. భారత్తో జరగనున్న 5 మ్యాచ్ల పొట్టి సిరీస్కు తమ జట్టు టర్నింగ్ పిచ్లు ఆశిస్తున్నట్లు తెలిపాడు.
"మేము గత రెండేళ్లుగా టీ20ల్లో అద్భుత విజయాలను నమోదు చేశాం. ఈ ఫార్మాట్లో మా జట్టు మంచి ఫామ్లో ఉంది. సానుకూల దృక్పథంతో ఉన్నాం. టీ20 ప్రపంచ కప్కు ముందు అన్ని బలహీనతలు అధిగమిస్తూ.. ఆటతీరు మరింత మెరుగు పరుచుకోవడం అవసరం. సాధ్యమైనంత వరకు బలమైన జట్టుతో వరల్డ్ కప్లో బరిలోకి దిగాలనుకుంటున్నాం. తక్కువ స్కోర్లు నమోదయ్యే టర్నింగ్ పిచ్లు ఉంటే మేలు. దాని వల్ల మాకు తగిన ప్రాక్టీస్ లభిస్తుంది."
-ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ టీ20 కెప్టెన్.
"టెస్టు సిరీస్లోని అన్ని మ్యాచ్లకు ఒకే తరహా పిచ్ ఉండాలని నేను కోరుకోను. స్పిన్ వికెట్ కూడా ఉండాలనుకుంటాను. ఫ్లాట్ పిచ్లపై మేమేంటో మాకు తెలుసు. స్పిన్ పిచ్లపై మా బౌలర్లు ఇంకా నేర్చుకుంటున్నారు. ఇండియాలో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో.. తక్కువ స్కోర్లు నమోదయ్యే పిచ్లు మాకు ఎదురు కావాలని ఆశిస్తున్నాం" అని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతి విభాగంలో ఈ పర్యటన ప్రతి ఒక్కరికీ సవాలు లాంటిదని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. 2016 టీ20 ప్రపంచ కప్లోని పలు మ్యాచ్ల్లో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా అలాంటి పిచ్లు ఎదురవ్వాలని ఆశిస్తున్నామని ఇంగ్లాండ్ కెప్టెన్ పేర్కొన్నాడు.
జోఫ్రా ఫిట్!
జోఫ్రా ఆర్చర్ ప్రస్తుతం ఫిట్గా ఉన్నాడని మోర్గాన్ వెల్లడించాడు. మోచేతి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని తెలిపాడు. టీ20లకు అందుబాటులో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, జోఫ్రా అందుబాటులో ఉండేది లేనిది వైద్యబందం సూచన మేరకు నిర్ణయిస్తామని ఇంగ్లాండ్ కోచ్ సిల్వర్వుడ్ ఇది వరకే తెలిపాడు.
భారత్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ మార్చి 12 నుంచి ప్రారంభం కానుంది. అన్ని మ్యాచ్లకు అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
ఇదీ చదవండి: 'ది మొతేరా థాలీ ఛాలెంజ్'కు మీరు సిద్ధమా