కరోనా వల్ల పలు క్రీడా టోర్నీలు రద్దవ్వగా మరికొన్ని వాయిదా పడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్గా పేరొందిన ఐపీఎల్ కూడా నిరవధిక వాయిదా పడింది. దీంతో టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారు. ధోనీతో సహా హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, దీపక్ చాహర్ లాంటి ఆటగాళ్లు చాలా కాలంగా ఆటకు దూరమయ్యారు. దీంతో వీళ్లంతా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేయాలి. అయితే దీంతో సంబంధం లేకుండా ధోనీ, పాండ్య ప్రపంచకప్ జట్టులో ఉంటారని హర్భజన్ సింగ్ అంటున్నాడు.
"ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఐపీఎల్తో సంబంధం లేకుండా ప్రపంచకప్ జట్టులో ఉంటాడు అందులో ఎలాంటి అనుమానం లేదు. కావాలంటే పేపర్ మీద రాసిస్తా. టీమ్ఇండియాలో సరైన కూర్పు కావాలంటే పాండ్య కచ్చితంగా జట్టులో ఉండాలి. గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరమైనా అతడు తుది జట్టులో ఉంటాడు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా అతడిని ఎంపిక చేయొద్దు."
-హర్భజన్ సింగ్, టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్
ధోనీ గురించి కూడా హర్భజన్ స్పందించాడు. టీమ్ఇండియాకు ప్రపంచకప్ అందించిన కెప్టెన్గా దోనీకి రికార్డుందని తెలిపాడు. అతడి అనుభవం టీ20 ప్రపంచకప్నకు పనిచేస్తుందని అన్నాడు.
"ధోనీని ఎలా జడ్జ్ చేస్తారు. ఐపీఎల్లో ఫామ్ చూసి అతడిని జట్టులోకి తీసుకుంటారా? లేక భారత్కు అత్యుత్తమ క్రికెటర్గా, కెప్టెన్గా అతడికి గౌరవం ఇస్తారా? టీమ్ఇండియాకు మహీ ఎంతో సేవ చేశాడు. అతడు అందుబాటులో ఉంటే జట్టులోకి తీసుకోవాలి."
-హర్భజన్ సింగ్, టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్
పాండ్య గత సెప్టెంబర్లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడాడు. తర్వాత వెన్నునొప్పికి సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం జరిగిన డీవై పాటిల్ టీ20 క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసి సత్తా చాటాడు. గతేడాది జరిగిన ప్రపంచకప్ సెమీస్ తర్వాత నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు ధోనీ. ఐపీఎల్లో బరిలోకి దిగాలనుకున్నా కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడింది.