భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఫిబ్రవరి తొలివారంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచి టీమిండియా ఎంతో బలంగా కనిపిస్తోంది. అటు ఇంగ్లాండ్ జట్టు కూడా శ్రీలంకపై విజయంతో మంచి ఉత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల టాప్ ఆర్డర్ బలాబలాలు ఏంటో ఓ సారి పరిశీలిద్దాం.
ఆస్ట్రేలియాతో సిరీస్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్లు ఓపెనర్లుగా సఫలమయ్యారు. నంబర్ 3లో ఇక ఛెతేశ్వర్ పుజారా ఉండనే ఉన్నాడు. ఇక ప్రత్యర్థి జట్టు విషయానికొస్తే.. శ్రీలంకతో సిరీస్లో ఓపెనర్లు జాక్ క్రావ్లే, డొమినిక్ సిబ్లీలు చెప్పుకోదగ్గ ఆరంభాలు ఇవ్వలేదు. సిబ్లీ ఒకే ఒక అర్ధ శతకం చేశాడు.
ఇక మూడో నంబర్లో వన్డౌన్లో బ్యాటింగ్కు దిగే జానీ బెయిర్ స్టో 46.33 సగటుతో ఫర్వాలేదనిపించినా.. ఆటగాళ్ల రొటేషన్లో భాగంగా భారత్తో తొలి రెండు టెస్టులకు అతన్ని ఎంపిక చేయలేదు ఇంగ్లాండ్ బోర్డు. ఈ విషయంపై పునరాలోచించాల్సిందిగా ఆ దేశ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు.
"బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, జో రూట్లు స్పిన్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటారు. అలాంటిది ప్రస్తుత సిరీస్కు బెయిర్ స్టోను స్వదేశానికి పంపించే విషయాన్ని మరోసారి ఆలోచించాలి" అని నాసర్ పేర్కొన్నాడు.
బెయిర్ స్టోతో ఖాళీ అయిన 3వ స్థానాన్ని క్రావ్లీతో ఆడించే యోచనలో ఉంది ఇంగ్లాండ్ జట్టు. శ్రీలంకతో సిరీస్కు అందుబాటులో లేని రెగ్యులర్ ఓపెనర్ రోరీ బర్న్స్ .. సిబ్లీతో జతకట్టనున్నాడు.
శ్రీలంకతో సిరీస్కు ముందు క్రావ్లీ వన్డౌన్లో ఆడిన అనుభవం ఉంది. ఓ డబుల్ సెంచరీ కూడా చేశాడు. కానీ, స్పిన్నర్లపై ఆడటంలో క్రావ్లీ బ్యాటింగ్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని నాసర్ అతని వైఫల్యాలను ఎత్తి చూపాడు.
అంతేకాక, ఈ ముగ్గురు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లకు ఒక్క శ్రీలంకలో తప్ప ఉపఖండ పరిస్థితుల్లో ఆడిన అనుభవం లేదు. చివరిసారిగా 2018లో అక్కడ పర్యటించినప్పుడు.. క్రావ్లీ ఆరు ఇన్నింగ్స్ల్లో కలిపి 25.83 సగటుతో 155 పరుగులు మాత్రమే చేశాడు. బర్న్స్, క్రావ్లీ, సిబ్లీలు ముగ్గురు కలిసి 45 టెస్టుల్లో ఆడిన అనుభవం ఉంది. వాటిలో 7 టెస్టులు మాత్రమే ఉపఖండ పిచ్లపై(అన్ని శ్రీలంకలోనే) ఆడారు.
అదే భారత్ టాప్ ఆర్డర్ను తీసుకుంటే.. రోహిత్, పుజారాలు 115 టెస్టుల్లో ఆడిన అనుభవం వారి సొంతం. ఇందులో 55 టెస్టులు స్వదేశంలో.. 8 మ్యాచ్లు శ్రీలంక, బంగ్లాలపై ఆడినవే. ఒక్క గిల్ మాత్రమే ఇటీవల ఆస్ట్రేలియాతో అరంగ్రేటం చేశాడు. అతనికి కూడా దేశవాళీ మ్యాచ్ల్లో ఆడిన అనుభవం ఉండనే ఉంది.
ఇదీ చదవండి: భారత్- ఇంగ్లాండ్ సిరీస్కు టీవీ రైట్స్ ఎప్పుడో!