ఐపీఎల్కు ప్రాధాన్యమిచ్చే ఇంగ్లాండ్ ఆటగాళ్ల జీతాల నుంచి కోత విధించాలని.. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డును కోరాడు మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్కాట్. ఈ లీగ్లో ఆడే అన్ని దేశాల క్రికెటర్ల నుంచి ఆయా క్రికెట్ బోర్డులు 10 శాతం కోత విధించాలని సూచించాడు.
''ఇంగ్లాండ్ తరఫున జాతీయ జట్టులో ఆడుతున్న ఆటగాళ్లకు మంచి పారితోషికం లభిస్తుంది. దేశానికి ఆడటానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఐపీఎల్ ద్వారా డబ్బులు సంపాదించడానికి నేను అడ్డుపడను. కానీ, జాతీయ జట్టుకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలి.''
-జెఫ్రీ బాయ్కాట్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్.
రొటేషన్ పాలసీ.. తెలివి తక్కువ పని..
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న ఆటగాళ్ల రొటేషన్ పాలసీపై స్పందించాడు జెఫ్రీ. "అదొక అర్ధరహితమైన, తెలివిలేని విధానమని విమర్శించాడు. ఆటగాళ్లకు ఏదైనా మానసిక సమస్యలుంటే, బయో బబుల్ వాతావరణాన్ని వారు ఎదుర్కోలేకపోతుంటే.. వాళ్లను స్వదేశానికి పంపొచ్చు. అంతేకాని.. రొటేషన్ పాలసీ సరైన విధానం కాదు. దీన్ని తక్షణమే నిలిపివేయాలి." అని బాయ్కాట్ పేర్కొన్నాడు.
"కారణం లేకుండా స్వదేశానికి వెళ్తానని ఏ ఒక్క క్రికెటర్ కోరినా.. అతడి జీతంలో కోత విధించండి. లేకపోతే ముందుగానే అతడితో సిరీస్ మొత్తానికి ఆడే విధంగా ఒప్పందం చేసుకోండని" బోర్డుకు సూచించాడు జెఫ్రీ. ఐపీఎల్ ఆడే ఏ ఆటగాడైనా ఈ విధమైన కారణాలతో ఐపీఎల్కు దూరమవుతున్నారా? అని బాయ్కాట్ ప్రశ్నించాడు.
సీనియర్ క్రికెటర్ జెఫ్రీ.. ఐపీఎల్పై ఈ తరహా వ్యాఖ్యలు చేయగా, ఇంగ్లాండ్ కోచ్ సిల్వర్వుడ్ మాత్రం ఐపీఎల్కు తమ ఆటగాళ్లు పూర్తిగా అందుబాటులో ఉంటారని ఇంతకుముందే వెల్లడించాడు. ఈ పొట్టి లీగ్ వల్ల న్యూజిలాండ్తో జూన్లో జరిగే టెస్టు సిరీస్కు పలువురు ఆటగాళ్లు అందుబాటులో ఉండట్లేరు.
ఐపీఎల్.. ఇంగ్లాండ్కు చాలా ఉపయోగపడింది..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ను ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్ కీర్తించాడు. ఐపీఎల్ ద్వారా తమ జట్టు చాలా లాభపడిందని అభిప్రాయపడ్డాడు. కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి వేదికైందని తెలిపాడు. భారత్లో ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ దృష్ట్యా.. ఐపీఎల్ చాలా అవసరమని బట్లర్ పేర్కొన్నాడు.
ఈ లీగ్ వ్యక్తిగతంగానే కాకుండా ఇంగ్లాండ్ జట్టుకు కూడా ఎంతో లబ్ధి చేకూరిందని బట్లర్ తెలిపాడు. ఆటలో పురోగతి సాధించడానికి, నైపుణ్యాలు నేర్చుకోవడానికి, అనుభవం సంపాదించడానికి ఈ టోర్నీ చాలా దోహదపడిందని వెల్లడించాడు. ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ అభివృద్ధికీ ఐపీఎల్ ఉపయోగపడిందని పేర్కొన్నాడు.
ఎలా విస్మరిస్తాం..
పెద్ద మొత్తంలో డబ్బులొచ్చే ఐపీఎల్ను విస్మరించలేమని బట్లర్ అన్నాడు. దేశానికి ఆడటం గర్వకారణమేనని తెలిపాడు. కొన్నిసార్లు రెండింటి మధ్య సమతూకం కష్టమేనని అంగీకరించాడు. ఐపీఎల్ కోసం కొందరు ఆటగాళ్లు న్యూజిలాండ్ టెస్టు సిరీస్ నుంచి తప్పుకోవచ్చన్న విమర్శల నేపథ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
"మిగతా ఆటగాళ్ల సంగతి నాకు తెలియదు. న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ప్రకటించక ముందే ఐపీఎల్ భాగస్వామ్యంపై ఒప్పందం కుదిరింది. నిజమే, తమ ఫ్రాంఛైజీలు ప్లేఆఫ్స్కు చేరుకుంటే ఆ సిరీస్ ఆడని పరిస్థితి రావొచ్చు. ఏదేమైనా కివీస్ సిరీస్ను షెడ్యూల్లో తర్వాత చేర్చారు. కానీ ఇంగ్లాండ్ మ్యాచ్లను ప్రతిసారీ కొందరు ఆటగాళ్లు మిస్సవుతూనే ఉంటారు కదా."
-జోస్ బట్లర్, ఇంగ్లాండ్ క్రికెటర్.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్తో టీ20లకు నటరాజన్ దూరం!