భారత్లో క్రికెట్ ఓ మతం. క్రికెటర్లే దేవుళ్లు. వారిలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీది అగ్రస్థానం. సాధారణ వికెట్ కీపర్గా కెరీర్ మొదలుపెట్టి ప్రపంచ నెంబర్వన్ బ్యాట్స్మన్గా ఎదిగాడు. ఆ సమయంలోనే సారథిగా మారి గొప్ప ఫినిషర్ అవతారం ఎత్తాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఆపద్భాందవుడయ్యాడు.
కెప్టెన్గా అనతి కాలంలోనే తొలి టీ20 ప్రపంచకప్ నెగ్గాడు. భారతీయులు 28 ఏళ్లుగా నిరీక్షిస్తున్న వన్డే ప్రపంచకప్ కలను సాకారం చేశాడు. ఎంతో మందిని స్టార్లుగా తీర్చిదిద్దాడు. ఎన్నో ఘనతలు మౌనంగానే సాధించిన ధోనీ... అంతే మౌనంగా ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
అమితాబ్ బచ్చన్ పాటతో...
స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన వీడ్కోలు ప్రకటిస్తూ.. ఇన్స్టాగ్రామ్లో ఈమేరకు ఓ సందేశం ఉంచాడు.'కెరీర్ సాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని ధోనీ పేర్కొన్నాడు. అమితాబ్ బచ్చన్ నటించిన 'కబి కబి' సినిమాలోని 'మై పల్ దో పల్ కా షాయర్ హు' పాటతో ఆ వీడియోను రూపొందించారు.
గోల్ కీపర్ నుంచి వికెట్ కీపర్
మహేంద్రసింగ్ ధోనీ..! టీమ్ఇండియా ముఖచిత్రాన్ని మార్చి, ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. 1981 జులై7న పాన్ సింగ్, దేవకిదేవి దంపతులకు రాంచీలో జన్మించాడు మహీ. పాఠశాల దశలో ఫుట్బాల్, బ్యాడ్మింటన్ను అమితంగా ఇష్టపడేవాడు. ఈ క్రీడల్లో జిల్లా స్థాయిలో ప్రాతినిధ్యం వహించాడు. తన ఫుట్బాల్ కోచ్ సూచనతో క్రికెట్ కీపర్గా మారాడు. తొలి మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శనతో స్థానిక కమాండో క్రికెట్ క్లబ్కు కీపర్గా మారాడు. ఈ క్రమంలోనే అతడి ప్రతిభను గుర్తించి 1997-98లో అండర్-16 వినూమన్కడ్ ట్రోఫీకి ఎంపిక చేశారు.
ప్రతి సిక్స్కు 50 రూపాయలు
10వ తరగతి పూర్తయ్యాక పూర్తిస్థాయిలో క్రికెట్పై దృష్టిసారించాడు ధోనీ. 1998లో సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్(CCL) జట్టు తరఫున ఆడాడు. ఆ సమయంలో కోచ్ దేవల్ సహాయ్.. మహీ కొట్టే ప్రతి సిక్స్కు 50 రూపాయలు ఇచ్చేవాడు. భారీషాట్లతో విరుచుకుపడిన ధోనీ ఎన్నోసార్లు CCLకు ఘన విజయాలు అందించాడు.
తొలి మ్యాచ్లోనే 'రనౌట్-డకౌట్'
ధోనీ ఆటపై ఇష్టాన్ని పెంచుకున్న కోచ్ దేవల్.. 1999-2000లో బిహార్ క్రికెట్ టీమ్ తరపున రంజీట్రోఫీలో అవకాశం ఇప్పించాడు. అది సద్వినియోగం చేసుకున్న మహీ.. ఆ తర్వాత దేవ్ధర్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడాడు. 2003లో జాతీయ క్రికెట్ అకాడమీలో చేరాడు. 2003-04లో ఇండియా-ఏ జట్టులో చోటు సంపాదించాడు. 2004లో భారత జాతీయజట్టు తలుపు తట్టాడు. అదే ఏడాది బంగ్లాదేశ్ సిరీస్కు ఎంపికైన మహీ.. తొలి మ్యాచ్లోనే పరుగులేమీ చేయకుండానే రనౌటై వెనుదిరిగాడు.
విశాఖ వన్డే.. ధోనీ కెరీర్లో ఓ మలుపు..!
బంగ్లాదేశ్లో ప్రదర్శనతో సంబంధం లేకుండా అదే ఏడాది పాకిస్థాన్తో స్వదేశంలో జరిగిన సిరీస్కు ధోనీని ఎంపికచేశారు. అందులోని విశాఖ వన్డే మహీ కెరీర్ను మర్చిందనే చెప్పాలి. అప్పటి వరకూ ఏడో స్థానంలో ఆడిన ఈ క్రికెటర్ను కెప్టెన్ గంగూలీ మూడోస్థానంలో బ్యాటింగ్కు దింపాడు. ఈ మ్యాచ్లో 123 బంతుల్లో 148 పరుగులు కొట్టి.. ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్గా ఘనత సాధించాడు. 2005 జైపుర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన పోరులో శ్రీలంకపై 145 బంతుల్లో 183 పరుగులు బాది తన రికార్డును తానే అధిగమించాడు.
నెంబర్ వన్.. వారం మాత్రమే
2006లో పాకిస్థాన్ సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన ధోనీ.. ఐసీసీ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో తొలిసారి నెంబర్వన్గా నిలిచాడు. అయితే వారం రోజులు మాత్రమే ఈ స్థానంలో ఉన్నాడు.
28 ఏళ్ల నిరీక్షణకు తెర
2007 వన్డే ప్రపంచకప్లో భారత్ వైఫల్యానికి బాధ్యుడిని చేస్తూ రాంచీలోని ధోనీ ఇంటిపై జేఎమ్ఎమ్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. అనంతరం సీనియర్ల సూచన మేరకు టీమ్ఇండియా పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్లో భారత్ను ఛాంపియన్గా నిలిపాడు. 2011 వన్డే ప్రపంచకప్ తెచ్చిపెట్టి, భారత అభిమానుల 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు.
అన్ని ఘనతలు ధోనీ హయంలోనే
2009లో తొలిసారి భారత్ను టెస్టు ర్యాంకింగ్స్లో నెంబర్వన్ స్థానానికి చేర్చాడు. 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. 2010, 2016లో ఆసియా కప్ను భారత్ ఖాతాలో చేర్చాడు.
మూడుసార్లు ఐపీఎల్ విన్నర్
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, పుణె సూపర్ జైంట్స్కు సారథిగా వ్యవహరించాడు ధోనీ. చెన్నైను 3 సార్లు ఛాంపియన్గా నిలిపాడు. రెండు సార్లు ఛాంపియన్స్ లీగ్ టీట్వంటీలో విజేతగా అవతరించాడు.
ధోనీపై పాక్ ప్రధాని ప్రశంసలు
ధోనీ.. తన 16 ఏళ్ల కెరీర్లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20ల్లో భారతజట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 10 వేల పరుగులు మైలురాయిని దాటాడు. కెరీర్ ఆరంభంలో జులపాల జుట్టుతో కనిపించిన మహీ.. తన బ్యాటింగ్తో పాటు హెయిర్ స్టైల్తో పాక్ మాజీ ప్రధాని ముషారఫ్ ప్రశంసలు అందుకున్నాడు.
ధోనీపై మరపురాని బయోపిక్
ధోనీకి భారత్ సైన్యం లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఇచ్చింది. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, రాజీవ్గాంధీ ఖేల్రత్న అవార్డులతో సత్కరించింది. 2008, 2009లో ఐసీసీ వన్డే ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. 2016లో ఈ క్రికెటర్ జీవితం ఆధారంగా 'ధోని: ద అన్టోల్డ్ స్టోరీ' సినిమా వచ్చింది.
ధోనీ బలం వీరిద్దరే
2010 జులై 4న తన స్నేహితురాలు సాక్షి సింగ్ను ధోనీ పెళ్లి చేసుకున్నాడు. వీరికి జివా అనే పాప ఉంది.