ఐపీఎల్ 13వ సీజన్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి థర్డ్ పార్టీలను ఆహ్వానించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). వేలంలో పాల్గొనదలచిన వారు ఆగస్టు 14లోపు వారి వివరాలు పంపిస్తే.. ఆగస్టు 18న వేలం జరుగుతుందని వెల్లడించింది.
"ఆసక్తి ఉన్నవారు 'ఐపీఎల్-2020 టైటిల్ స్పాన్సర్షిప్' కోసం తమ వివరాలను బీసీసీఐకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 14వ తేదీన సాయంత్రం ఐదు గంటల వరకు తుదిగడువు. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించాలా లేదా అనేది బీసీసీఐ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ వేలం ఆగస్టు 18 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. పైన తెలిపిన ప్రణాళికను బీసీసీఐ అభీష్ఠానుసారం మార్చడానికి వీలుంటుంది" అని బీసీసీఐ వెల్లడించింది.
"ఈ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కు గడువు కాలం 2020 ఆగస్టు 18 నుంచి 2020 డిసెంబరు 31 వరకు. టైటిల్ స్పాన్సర్షిప్ కోసం ఆసక్తి చూపే థర్డ్ పార్టీల ఆదాయం ఆడిట్ ప్రకారం రూ.300 కోట్లకు మించి ఉండాలి" అని క్రికెట్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది.
వివోతో తెగదెంపులు
ఇటీవలే భారత్-చైనా మధ్య జరిగిన సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ వివోతో ఐపీఎల్ స్పాన్సర్షిప్ను రద్దు చేసుకుంది బీసీసీఐ. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన గతవారమే విడుదల చేసింది. 2018 నుంచి ఐదేళ్ల పాటు (2022 వరకు) ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ను వేలంలో సొంతం చేసుకుంది వివో. దీనికోసం వివో మొత్తం రూ.2,190 కోట్లను బీసీసీఐకి చెల్లించింది.