కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో దాదాపు 6నెలల పాటు నిలిచిపోయిన క్రికెట్ కార్యకలాపాలు పునఃప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించే మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్ల కోసం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమైంది. సెప్టెంబరు 4న తొలి మ్యాచ్ జరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలియజేశాయి.
మాంచెస్టర్లోని సౌతాంప్టన్, ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఈ సిరీస్ను నిర్వహించే అవకాశం ఉంది. దీనికోసం ఆసీస్ జట్టు ప్రైవేట్ విమానంలో ఇంగ్లాండ్కు చేరుకోనుంది. పర్యటనలో మొత్తం ఆరు మ్యాచ్లు జరగనున్నాయి. సెప్టెంబరు 4,6,8 తేదీల్లో టీ20లు, 10,12,15 తేదీల్లో వన్డేలను నిర్వహించనున్నట్లు స్థానిక పత్రిక తెలిపింది.
అయితే ఈ పర్యటనపై ఆస్ట్రేలియా క్రికెట్ జాతీయ జట్టు చీఫ్ బెన్ ఓలివర్ స్పందిస్తూ... ఇంగ్లాండ్లో ఆసీస్ ఆటగాళ్లు ఎదుర్కొనే ఆంక్షల ఆధారంగా ఈ పర్యటనపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. "ఆటగాళ్లు, సిబ్బంది, తదితరులకు వైద్యపరమైన భద్రత చాలా కీలకం. క్వారంటైన్కు సంబంధించిన ఏర్పాట్లపై వారు ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు." అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్తో తలపడుతోంది. కరోనా తర్వాత నిర్వహించిన తొలి అంతర్జాతీయ సిరీస్ ఇదే కావడం గమనార్హం. అనంతరం పాకిస్థాన్తో తదుపరి సిరీస్ ఆడనుంది ఇంగ్లీష్ జట్టు.