పాకిస్థాన్ ఆధిపత్యం చెలాయించే రోజుల్లో టీమ్ఇండియా ఆటగాళ్లు తమపై దయ చూపమని అడిగేవారని షాహిద్ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలకు మాజీ బ్యాట్స్మన్ ఆకాశ్చోప్రా గట్టి కౌంటర్ ఇచ్చాడు. భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన అన్ని మ్యాచ్ల గణాంకాలు బయటకు తీసి అతడు చేసిన ఆరోపణలను ఖండించాడు. అఫ్రిదీ ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పాడన్నాడు. ఆకాశ్చోప్రా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ పాక్ మాజీ సారథిపై మండిపడ్డాడు.
"పాము కాటుకు చికిత్స ఉంది కానీ, దురభిప్రాయం కలిగిన వాడికి ఎలాంటి చికిత్స లేదని కొందరు మేధావులు చెప్పారు. అఫ్రిదీ ఆడే రోజుల్లో ఇరు జట్లూ సమానంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఆ సమయంలో భారతే కాస్త ఆధిపత్యం చెలాయించే స్థితిలో ఉండేది. అలాగే ప్రపంచకప్ల చరిత్ర చూసినా భారత్ ఎంతో మెరుగైన స్థాయిలో ఉంది. అయితే, వాళ్లెప్పుడూ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్నే గుర్తు చేసుకుంటారు. కానీ, అదే టోర్నీలో భారత్ కూడా ఆ జట్టును ఓడించింది. టీమ్ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు కంగారూ జట్టును ఓడించింది. పాకిస్థాన్ అదే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు ఓటమిపాలైంది. ఇప్పుడున్న స్థితిలో రెండు జట్ల మధ్య ఎంతో సారూప్యత నెలకొంది."
-ఆకాశ్ చోప్రా, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
అలాగే ఒకప్పుడు పాకిస్థాన్ నిజంగానే భారత్పై ఆధిపత్యం చెలాయించిందని, అది మాత్రం అఫ్రిదీ ఆడుతున్నప్పుడు కాదన్నాడు ఆకాశ్. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ లాంటి ఆటగాళ్లున్నప్పుడు పాక్.. భారత్పై పైచేయి సాధించేదని వెల్లడించాడు. ఇక ఇరు జట్ల మధ్య 15 టెస్టులు జరిగాయని, అందులో చెరో ఐదు మ్యాచ్లు గెలిచినట్లు టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ పేర్కొన్నాడు. అలాగే 82 వన్డేల్లో పాక్ 41 గెలిచిందని, భారత్ 39 మ్యాచ్ల్లో విజయం సాధించిందన్నాడు. ఈ నేపథ్యంలో ఎవరైనా రెండు మ్యాచ్లు ఓడిపోతేనే వాళ్లని తమపై దయచూపమని అడుగుతారా అనే సందేహం కలుగుతుందన్నాడు.
చివరగా టీ20 క్రికెట్ గురించి మాట్లాడుతూ.. ఈ ఫార్మాట్లో దాయాది జట్టు అద్భుతంగానే ఉన్నా భారత్ చేతిలో ఘోరంగా విఫలమైందని గుర్తుచేశాడు. ఇప్పటివరకు 8 టీ20లు జరగ్గా భారత్ 7-1 తేడాతో ఆధిపత్యం చెలాయించిందని అఫ్రిదీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.