అందాల తార శ్రీదేవి(Sridevi) వారసురాలిగా వెండి తెరకు పరిచయమైంది జాన్వీ కపూర్(Janhvi kapoor). కానీ విభిన్న పాత్రలను ఎంచుకుంటూ గుర్తింపు తెచ్చుకుంది. తన సౌందర్య పరిరక్షణలో తల్లి పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. శ్రీదేవికి రసాయనాలు ఎక్కువగా ఉండే ప్రొడక్ట్లను ఉపయోగించడం ఇష్టముండదని చెప్పింది. అందుకే ఇంట్లో దొరికే వాటినే ఉపయోగించేదని వెల్లడించింది. తలకు నూనెనీ ఎండిన పూలు, ఉసిరితో తనే కాచి సిద్ధం చేసేదని చెప్పుకొచ్చింది. తాను ఆ పద్ధతినే కొనసాగిస్తున్నట్లు చెప్పిన ఈ ముద్దుగుమ్మ దాని గురించి ఈ కింది విధంగా వివరించింది.
"ఆ రోజు ఏ పండు ఆహారంగా తీసుకుంటే దాని రసాన్నే పాలు లేదా వెన్నతో కలిపి ముఖానికి పట్టిస్తా. పండ్లలో సి విటమిన్ ఉంటుంది. చర్మానికి ఇది చాలా మంచిది. ఆరెంజ్, అరటి, బొప్పాయి, అవకాడో ఇలా దేన్నైనా ప్రయత్నించవచ్చు. జుట్టు విషయానికొస్తే ప్రతి మూడు రోజులకోసారి తలకు నూనెను పట్టించి, మర్దనా చేసుకుంటా. మెంతులు, ఉసిరి, కోడిగుడ్లతోపాటు మెంతి ఆకునూ తలకు పట్టిస్తా. ఇవి చుండ్రును దూరంగా ఉంచడం సహా సహజ కండిషనింగ్నూ అందిస్తాయి. వీటితోపాటు నీరు ఎక్కువగా తీసుకోవడం, ఎప్పుడూ ఆనందంగా ఉండటం తప్పనిసరి". అని జాన్వీ చెప్పింది.
ఇదీ చూడండి: మహేశ్ సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ!