ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ రంగుల ప్రపంచంలో అడుగు పెట్టడానికి ఎదురు చూసేవారు ఎందరో.. ఒక్క అవకాశం ఇస్తే తామేంటో నిరూపించుకుంటామని చిత్ర పరిశ్రమలో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారూ ఉన్నారు. ప్రత్యేకించి ఇక్కడ మెగాఫోన్ పట్టుకుని దర్శకుడు/దర్శకురాలిగా మారాలని కలలు కనేవారే ఎక్కువ. ఇలాంటి వారు ఎన్నో సవాళ్లు అధిగమించాల్సి ఉంటుంది. సరైన స్క్రిప్టు ఉంటే సరిపోదు. దానికి తగ్గ నటీనటులు, బడ్జెట్ పెట్టే నిర్మాత, పనిచేసే సాంకేతిక నిపుణులు ఉండాలి. అలా అన్నీ సమకూర్చుకొని త్వరలో టాలీవుడ్ను నూతన దర్శకులు పలకరించబోతున్నారు. ఆ దర్శకులెవరో ఓసారి చూద్దాం.
'మహానటి'గా అందరి మన్ననలు పొందిన కథానాయిక కీర్తి సురేశ్ నటిస్తున్న సినిమా 'మిస్ ఇండియా'. ఈ చిత్రంతో నరేంద్రనాథ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే కీర్తి ఫస్ట్లుక్ విడుదలైంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ''మహానటి' తర్వాత మహిళా నేపథ్యమున్న ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పిందీ భామ. ఇందులోని తన పాత్రకు ప్రతి అమ్మాయి కనెక్ట్ అవుతుందని తెలిపింది. సినిమా షూటింగ్ అమెరికాలో జరగబోతోంది. నరేంద్రనాథ్ గొప్ప కథను రాశారు. ప్రేక్షకులకు కూడా ఇది బాగా నచ్చుతుంది' అని పూజా కార్యక్రమంలో కీర్తి సురేశ్ చెప్పారు. ఏప్రిల్ 17న ఈ సినిమా విడుదల చేయాలని భావించారు. కానీ లాక్డౌన్ నేపథ్యంలో వాయిదా పడింది.

'గద్దలకొండ గణేష్'లాంటి విభిన్న కథా చిత్రంతో వినోదం పంచిన యువహీరో వరుణ్ తేజ్.. ఇప్పుడు బాక్సర్ అవతారం ఎత్తారు. తన పదో సినిమా కోసం అనేక కసరత్తులు చేసి, ఇంకా ఫిట్గా తయారయ్యారు. బాక్సింగ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ సినిమాను నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తీస్తున్నారు. ఆయన గతంలో 'అంతరిక్షం', 'తొలిప్రేమ', 'టచ్ చేసి చూడు', 'వీర', 'మిరపకాయ్', 'శంకర్దాదా ఎంబీబీఎస్' సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు.

మంచు మనోజ్.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతోన్న సినిమా ‘అహం బ్రహ్మాస్మి’. దీనితో శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఎం.ఎం.ఆర్ట్స్ పతాకంపై నిర్మలాదేవి మంచు, మనోజ్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇందులో మనోజ్కు జంటగా ప్రియా భవానీ శంకర్ సందడి చేయనున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్లుక్లో మనోజ్ విభిన్నమైన గెటప్లో కనిపించారు.

'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్నుమాదాస్'తో అందరి దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు విశ్వక్ సేన్. ఇటీవల వచ్చిన ‘హిట్’ ఆయన ఇమేజ్ను మరింత పెంచింది. హీరో నాని ఈ సినిమాను నిర్మించారు. విశ్వక్సేన్ నటించిన తొలి చిత్రం 'వెళ్లిపోమాకే..' అయినా ఆపై వచ్చిన సినిమాలతోనే గుర్తింపు లభించింది. ఆయన ఇటీవల మరో ప్రాజెక్టుకు సంతకం చేశారు. ఈ సినిమాకు 'పాగల్' అనే టైటిల్ ఖరారు చేశారు. నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మరి ఈ సినిమా విశ్వక్ కెరీర్ను ఎలాంటి మలుపు తిప్పబోతోందో చూడాలి. 'హిట్' సినిమానూ నూతన దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించారు.

మెగా కుటుంబం నుంచి మరో హీరో వెండితెరపైకి రాబోతోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్తేజ్ 'ఉప్పెన'తో అరంగేట్రం చేయబోతున్నారు. ఈ సినిమాతో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కృతి శెట్టి కథానాయికగా నటించారు. తమిళ స్టార్ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వైష్ణవ్ తొలి సినిమా కావడం, దీన్ని నూతన దర్శకుడు తెరకెక్కిస్తుండటం వల్ల ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ సినిమా.. లాక్డౌన్ వల్ల వాయిదా పడింది.

దర్శకుడు క్రాంతి మాధవ్ కెరీర్లో హిట్గా నిలిచిన 'మళ్లీ మళ్లీ ఇదిరానిరోజు' సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశారు కౌషిక్ పేగళ్లపాటి. ఆయన దర్శకుడిగా మారి తీస్తున్న తొలి చిత్రం 'చావు కబురు చల్లగా..!'. 'ఆర్ఎక్స్ 100' ఫేం కార్తికేయ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్లుక్ విడుదలైంది. కార్తికేయ ఇందులో 'బస్తీ బాలరాజు' అనే పాత్రలో కనిపించనున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తుండటం విశేషం.

యువ కథానాయకుడు నాగశౌర్య మొదటి నుంచి నూతన నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇటీవల ‘అశ్వథ్థామ’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్వరలో ఆయన, రీతూ వర్మ జంటగా ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇటీవల పూజా కార్యక్రమం జరిగింది. ఈ చిత్రంతో లక్ష్మి డైరెక్టర్గా పరిచయం కాబోతున్నారు. అంతేకాదు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమాలోనూ నాగశౌర్య నటించబోతున్నారు. ఈ సినిమాకూ నూతన దర్శకుడు రాజా దర్శకత్వం వహిస్తున్నారు.

'ప్రతిరోజు పండగే' హిట్ తర్వాత సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్'. ఈ ప్రాజెక్టుతో సుబ్బు అనే దర్శకుడు పరిచయమవుతున్నారు. నభా నటేష్ హీరోయిన్. రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కిస్తున్నారట. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మే ఆరంభంలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు యూనిట్ ప్రకటించింది. కానీ లాక్డౌన్ వల్ల షెడ్యూల్లో మార్పులు జరిగాయి. మరి ఈ చిత్రంలో సాయిధరమ్ ఎలా అలరించనున్నారో చూడాలి.
