కరోనా ప్రభావంతో లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్ర పరిశ్రమల కార్యకలాపాలు ఆగిపోయాయి. తమిళనాడు ప్రభుత్వం మాత్రం అక్కడి సినిమా, టీవీలకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలకు తాజాగా అనుమతినిచ్చింది.
తమిళనాడు ప్రభుత్వం ఇటీవల కొన్ని రంగాలకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు కూడా అనుమతి ఇవ్వాలని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్ కే సెల్వమణి, కొందరు సీనియర్ నిర్మాతలు కలసి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని కోరారు. వారి కోరిక మేరకు ఈనెల 11 నుంచి నిర్మాణానంతర పనులకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్ (డీఐ), రీ రికార్డింగ్, సౌండ్ డిజైనింగ్, మిక్సింగ్ పనులకు గరిష్ఠంగా ఐదుమందిని మాత్రమే అనుమతించాలని పేర్కొంది. అలాగే వీఎఫ్క్స్, సీజీఐ పనులకు 10 నుంచి 15 మందిని అనుమతించింది. సంబంధిత చిత్ర నిర్మాణ సంస్థలు ప్రభుత్వ అనుమతి లేఖ పొందాలని, కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.