దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవితగాథ త్వరలో ‘తలైవి’గా వెండితెరపై సందడి చేయబోతోంది. బాలీవుడ్ స్టార్ కథానాయిక కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తోంది. ఏఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కరోనా పరిస్థితుల కారణంగా చిత్రీకరణ తాత్కాలికంగా ఆగింది. అయితే ఇప్పుడీ విరామ సమయంలో చిత్ర బృందం ఎన్టీఆర్ కోసం వేట కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్, శోభన్బాబు
జయలలిత జీవితగాథలో ఎంతో మంది రాజకీయ నాయకులతో పాటు ఆనాటి చిత్ర ప్రముఖులకు స్థానం ఉంది. ముఖ్యంగా తెలుగులో ఆమె ఎన్టీఆర్, శోభన్బాబు వంటి అగ్ర కథానాయకులతో నటించిన నేపథ్యంలో సినిమాలో వాళ్ల పాత్రలకూ ప్రాధాన్యత ఉంది. అయితే శోభన్బాబు పాత్రకు జిషూ సేన్ను ఎంపిక చేసుకోగా.. ఎన్టీఆర్ పాత్ర ఎవరితో చేయించాలన్న చిక్కుముడి వీడటం లేదు.
బాలకృష్ణతో..
నిజానికి ఎన్టీఆర్ పాత్రను ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్తో చేయిద్దామని ప్రయత్నించింది చిత్ర బృందం. కానీ, ఆయన మాత్రం దీన్ని సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆ పాత్రను నందమూరి బాలకృష్ణతో చేయిస్తే బాగుంటుందని చిత్ర బృందం ప్రణాళిక రచించింది.
నో చెప్పారట..
కానీ, ‘ఎన్టీఆర్ బయోపిక్’ ఫలితం చూశాక.. మరోసారి తన తండ్రి పాత్రను పోషించకూడదని బలమైన నిర్ణయం తీసుకున్నారట బాలయ్య. అందుకే ‘తలైవి’ బృందానికి నో చెప్పారట ఆయన. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్ర బృందానికి నటసార్వభౌముడి పాత్ర పెద్ద చిక్కుముడిలా మిగిలిపోయింది. ప్రస్తుతానికైతే ఈ చిత్ర బృందం మిగిలిన భాషల్లో ఎన్టీఆర్ పాత్ర పోషించగల నటుడి కోసం వేట కొనసాగిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
ఇవీ చూడండి: 'దేశంలో తబ్లీగీ వల్లే రెట్టింపు కేసులు'