ఇటీవల విడుదలై సూపర్ హిట్ అందుకున్న మలయాళ చిత్రం 'దృశ్యం 2' ప్రస్తుతం తెలుగులో అదే పేరుతో రీమేక్ అవుతోంది. వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రల్లో మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడీ సినిమా త్వరలోనే హిందీలోనూ రీమేక్ కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ 'దృశ్యం 2' హిందీ రీమేక్ హక్కులు సొంతం చేసుకుంది. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది.
"పనోరమ స్టూడియోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులు సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీని వల్ల దృశ్యం 2 కథ చాలామంది ప్రేక్షకులకు దగ్గరవుతుంది" అని ఈ సందర్భంగా తెలియజేశారు దర్శకుడు జీతూ.
దర్శకుడు, తారాగణం, సాంకేతిక వర్గ వివరాలన్నీ త్వరలోనే తెలియనున్నాయి. 'దృశ్యం' హిందీ రీమేక్లో అజయ్ దేవగణ్, శ్రియ నటించారు. గతంలో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'దృశ్యం' కొనసాగింపుగా 'దృశ్యం 2' రూపొందింది.
ఇదీ చూడండి: దృశ్యం 2: ఓటీటీలో కాదు.. థియేటర్లలోనే