హీరోయిన్ శ్రుతిహాసన్.. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. చివరగా 'కాటమరాయుడు'లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ... రవితేజ కొత్త చిత్రం 'క్రాక్'లో అవకాశం దక్కించుకుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ భామ.. పలు ఆసక్తికర విషయాలు చెప్పింది.
"టాలీవుడ్లో తిరిగి నటిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. నేను తమిళ అమ్మాయిని అయినా, తెలుగు సినిమాలంటే ఎంతో ఇష్టం. హీరోయిన్గా నా సినీ ప్రయాణం తెలుగులోనే మొదలైంది. టాలీవుడ్ నాకు రెండో ఇళ్లులాంటిది"
-శ్రుతిహాసన్, హీరోయిన్
'క్రాక్'లో సముద్రఖని, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకుడు. బి.మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
తమిళంలో విజయ్ సేతుపతి నటిస్తున్న 'లాభం'లో హీరోయిన్గానూ శ్రుతి నటిస్తోంది. డిస్నీ తెరకెక్కించిన 'ఫ్రోజెన్ 2' చిత్రంలో ఎల్సా పాత్రకు గాత్రం అందించింది. త్వరలో విడుదల కానుందీ సినిమా.
ఇదీ చదవండిః నేడు గవర్నర్తో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ భేటీ