తన సంగీతంతో ప్రేమికులను మైమరపించగలడు.. యువతను హోరెత్తించగలడు. బాణీలతో ప్రేక్షకులను ఏడిపించే సత్తా ఈ మ్యూజిక్ డైరెక్టర్ సొంతం. అంతే కాకుండా సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయగల ప్రతిభావంతుడైన దర్శకుడు అతడిలో ఉన్నాడు. వెండితెరపై అంధుడిగా కనిపించి ప్రేక్షకులను అలరించడమూ ఒక విశేషమే. ఇలా గాత్రంతో, నటనతో, దర్శకత్వంతో, సంగీతంతో ప్రేక్షకులకు అతి చేరువైన ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు... ఆర్పీ పట్నాయక్. పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకొన్న ఈ బహుముఖ ప్రజ్ఞశాలి పుట్టినరోజు నేడు. ఈ సందర్బంగా ఆర్పీ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామా!
కుటుంబం
ఆర్పీ పట్నాయక్ అసలు పేరు రవీంద్ర ప్రసాద్ పట్నాయక్. 1970 మార్చి 10న జన్మించాడు. పార్వతీపురం పక్కన సింగనాపురం స్వస్థలం. అయితే తండ్రి ఉద్యోగరీత్యా వీరి కుటుంబం ఒడిశాకు మారింది. ఆర్పీకి ఇద్దరు సోదరులు. అతని అన్నయ్యకు సంగీతంలో ప్రవేశం ఉంది. అయితే ఆర్పీ అన్నయ్య కేవలం సంగీత వాద్యాలు వాయించేవాడు. అందువల్ల ఆర్పీ తండ్రి వీరిచే కచేరి పెట్టించుకునేవారట. చిన్నతనంలో, ఆర్పీ పాడుతూ ఉంటే అతని సోదరుడు సంగీత వాద్యం వాయిస్తూ ఉండేవాడట. తన తల్లికి సంగీతం అంటే చాలా ఇష్టమని ఓ సందర్భంలో ఆర్పీ పట్నాయక్ చెప్పాడు. మొత్తానికి తాను సంగీతాన్ని ఆస్వాదించే కుటుంబంలో జన్మించినట్టు చెప్పుకొచ్చాడు ఆర్పీ.

చదువు
ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్పేస్ ఇంజనీరింగ్ చదివి.. ఆ తర్వాత సివిల్స్ పరీక్షలకు సంసిద్ధమయ్యాడు. కానీ, సినిమా పరిశ్రమపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆర్పీ.
త్రివిక్రమ్, సునీల్ రూంమేట్స్
సినిమా పరిశ్రమ పట్ల ఉన్న ఆసక్తితో ఇటువైపు వచ్చాడు ఆర్పీ. వచ్చిన కొత్తలో సునీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్లతో కలిసి మూడేళ్లు ఒకే రూమ్లో ఉన్నాడు. ఈ ముగ్గురు సినిమా ప్రయత్నాలు చేస్తుండేవారు. రాత్రివేళల్లో త్రివిక్రమ్ ఎదో రాస్తే దానికి ఆర్పీ పట్నాయక్ ట్యూన్ కట్టేవాడట. వీరిద్దరి టాలెంట్ గురించి సునీల్ జడ్జ్గా మారి తీర్పు చెప్పేవాడట.

దర్శకుడు కావాలని సంగీత దర్శకుడై...
సినిమా దర్శకుడు అవ్వాలన్న ఆశతో ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు ఆర్పీ. 'నీకోసం' సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా టాలీవుడ్కు పరిచయమయ్యాడు. దర్శకుడిగా మారిన కెమరామెన్ తేజ.. 'చిత్రం' సినిమాతో ఆర్పీ పట్నాయక్కి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత తన సంగీతంతో పరిశ్రమలో సునామీ సృష్టించాడు ఆర్పీ పట్నాయక్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'ఫ్యామిలీ సర్కస్', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే', 'నువ్వు లేక నేను లేను' వంటి సినిమాలతో యువతకు మరింత దగ్గరైయ్యాడు. నాగార్జున, వెంకటేష్ లాంటి పెద్ద హీరోలతో పనిచేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2008లో 'అందమైన మనసులో' సినిమాతో దర్శకుడిగా తెరకు పరిచయమయ్యాడు ఆర్పీ పట్నాయక్. 'నువ్వు నేను', 'సంతోషం' సినిమాలకు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నాడు. 'నువ్వు నేను' సినిమాకు ఆంధ్రప్రదేశ్ నంది అవార్డు పొందాడు.
ఆర్పీ సంగీత కచేరీకి ఆరు లక్షల మంది
విశాఖపట్నం సముద్రతీరాన ఆర్పీ పట్నాయక్ నిర్వహించిన సంగీత కచేరీకి అప్పట్లోనే ఏకంగా ఆరు లక్షల మంది వచ్చారు. ఆ తర్వాత యుఎస్, యూకే, దుబాయ్, కువైట్, సింగపూర్, దిల్లీ, చెన్నైలలో ఇంకా తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సంగీత కచేరీలు ఇచ్చి ప్రేక్షకులను అలరించాడు ఆర్పీ.
అతడు సంగీతం సమకూర్చిన 'జయం' వంటి సినిమాలు కేవలం ఒకేఒక్క ప్రాంతంలో 2.5 మిలియన్ యూనిట్లు (సీడీలు, క్యాసెట్లు) అమ్ముడయ్యాయి.
ఒక గాయకుడిగా కేవలం తన సంగీతంలోనే కాకుండా.. ఇళయరాజా వంటి ఇతర సంగీత దర్శకుల పాటలకూ గాత్రాన్ని అందించాడు. అలా సుమారు ఇతర సంగీత దర్శకులు కంపోజ్ చేసిన 300 పాటలు పాడాడు ఆర్పీ పట్నాయక్. 'చక్ర - ది సిగ్నేచర్ ఆఫ్ టైం' అనే అంతర్జాతీయ ఆల్బమ్కు వర్క్ చేశాడు.
ఔత్సాహిక గాయకుల పరిచయం
ఆర్పీ పట్నాయక్ సినీ పరిశ్రమకు ఎంతో మంది కొత్త గాయనీ గాయకులని పరిచయం చేశాడు. వారిలో రంజిత్, మల్లికార్జున్, రవివర్మ, నిహాల్, కౌసల్య ఉండడం విశేషం.
ఆర్పీ కొన్ని సినిమాలు
'సంతోషం', 'శ్రీరామ్', 'అల్లరి రాముడు', 'జయం', 'హోలీ', 'జెమినీ', 'నీ స్నేహం', 'ఈశ్వర్', 'దిల్', 'సంబరం', 'నిజం', 'నిన్నే ఇష్టపడ్డాను', 'నీకు నేను నాకు నువ్వు', 'అప్పుడప్పుడు', 'ఆ నలుగురు', 'ఔనన్నా కాదన్నా', 'మా ఇద్దరి మధ్య', 'బొమ్మలాట', 'లక్ష్మి కళ్యాణం', 'స్వాగతం', తదితర చిత్రాలకు సంగీతం అందించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నటుడిగా
అప్పటివరకు సంగీత దర్శకుడిగా ఉన్న ఆర్పీ 2004లో 'శీను వాసంతి లక్ష్మి' సినిమాలో నటుడిగా తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాలో అంధ గాయకుడి పాత్రను పోషించాడు ఆర్పీ. ఆ సినిమాలో సహజమైన నటనని ప్రదర్శించి ఎన్నో ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత 2010లో 'బ్రోకర్' సినిమాలో నటించాడు. ఈ చిత్రానికి ప్రజల నుంచి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత 'మనలో ఒకడు' సినిమాని తెరకెక్కించాడు. తమిళ, కన్నడ భాషలలోనూ తన పనితనాన్ని చూపాడు. హిందీలో 'కుచ్ తుం కహో కుచ్ హం కహే', 'యే దిల్' సినిమాలకు నేపథ్య సంగీతాన్ని సమకూర్చాడు.
2016లో 'తులసి దళం' అనే సినిమా వచ్చింది. ఈ సినిమా దర్శక, నిర్మాణ బాధ్యతలే కాకుండా.. నటనతోనూ, సంగీతంలోనూ తనదైన పాత్ర పోషించాడు ఆర్పీ.

పురస్కారాలు
2001లో 'నువ్వు నేను' సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ పురస్కారం అందుకొన్నాడు. ఆ తర్వాత 2002లో 'సంతోషం' చిత్రానికి అదే విభాగంలో మరో ఫిలింఫేర్ పురస్కారాన్ని కైవసం చేసుకున్నాడు. 2003లో కన్నడ భాషలో తెరకెక్కిన 'ఎస్క్యూజ్ మీ' సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా మూడవ ఫిలింఫేర్ పురస్కారం సొంతం చేసుకోగలిగాడు ఆర్పీ.
'నువ్వు నేను' సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా, 'అందమైన మనసులో', 'బ్రోకర్', చిత్రాలకు ఉత్తమ కథా రచయితగా నంది పురస్కారాలు అందుకున్నాడు. అతడు దర్శకత్వం వహించి, నటించిన 'మనలో ఒకడు' సినిమాకు ఉత్తమ చలన చిత్ర విభాగంలో నంది అవార్డు లభించింది.
ఇదీ చూడండి.. 'లవ్స్టోరీ' సినిమా విడుదల వాయిదా..!