కరోనా రెండోదశలో పలువురు ప్రముఖులు మహమ్మారి బారిన పడి మరణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యల దగ్గరనుంచి సెలబ్రిటీల వరకు ఆక్సిజన్ కష్టాలు తప్పడం లేదు. సరైన సమయంలో ఆక్సిజన్ అందక రాజస్థాన్కు చెందిన ప్రసిద్ధ మంగనియార్ గాయకుడు తాలిబ్ ఖాన్ మరణించారు. ఆస్పత్రిలో పడక కోసం దాదాపు రెండు గంటలు వేచి ఉన్న ఆయన.. సకాలంలో చికిత్స అందక తుదిశ్వాస విడిచారు. దానికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్గా మారింది.
ఏం జరిగిందంటే?
మూడు రోజులుగా శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయనకు.. సోమవారం ఆక్సిజన్ స్థాయి గణనీయంగా పడిపోయింది. దీంతో ఆయన్ను ఆస్పత్రికి చేర్చగా అక్కడ పడకలు అందుబాటులో లేవు. ఆ సమయంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడినట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. అయితే రెండు, మూడు గంటల తర్వాత ఆయనకు బెడ్ దొరికినా అంతలోనే ఆయన కన్నుమూసినట్లు తెలిపారు. ఆస్పత్రిలో పడక కోసం గంటల తరబడి వీల్ఛైర్లో వేచి చూసిన ఆయన అక్కడే ప్రాణాలను విడిచారని వారు వెల్లడించారు. అయితే తలాబ్ ఖాన్కు కరోనా సోకిందా? లేదా? అనేది తెలియాల్సిఉంది.
ఇదీ చూడండి: డైరెక్టర్ కావాలని యాక్టర్ అయ్యాడీ హీరో!