కరోనా ప్రభావం సినిమాలపై రోజురోజుకూ పెరుగుతోంది. హాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ భారీ చిత్రాలు వాయిదా పడుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో ప్రముఖ హాలీవుడ్ చిత్రం 'ఎఫ్9', బాలీవుడ్ చిత్రం 'సూర్యవంశీ' చేరాయి. ఈ వైరస్ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితీ గందరగోళంగానే మారింది. కొన్ని చోట్ల థియేటర్లు మూతపడుతున్నాయి. ఉగాదికి రానున్న చిత్రాల విడుదల సందిగ్ధంలో పడింది. వేసవి చిత్రాలపైనా ఈ ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి.
కొన్నాళ్లుగా థియేటర్లు వెలవెలబోతున్నాయి. ప్రేక్షకుల సందడి లేక బాక్సాఫీసు బోసిపోయింది. ఇది పరీక్షల కాలం, పైగా అగ్ర తారల సినిమాల విడుదలలు లేవు కాబట్టి ఆ ప్రభావం టాలీవుడ్పై పెద్దగా కనిపించలేదు. కరోనా ప్రభావం ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపించినా, మన సినిమాకు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదన్నట్టుగా ధైర్యంగా కనిపించాయి వ్యాపార వర్గాలు.
![పూజా హెగ్డే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6402656_fds-2.jpg)
ఇప్పుడు మన తెరనూ కాటేసింది కరోనా. నెల్లూరులో థియేటర్లు శుక్రవారం మూతపడ్డాయి. మన సినిమాలు బాగా ప్రదర్శితమయ్యే కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనూ, అలాగే ఒడిశాలోనూ థియేటర్లు బంద్ అయ్యాయి. ఓవర్సీస్ వ్యాపార వర్గాలైతే విడుదల తేదీల్ని మార్చేయాల్సిందేనని చాలా రోజులుగా పట్టుబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉండటం వల్ల అన్నివైపుల నుంచి మన సినిమాకు ముప్పు ఏర్పడినట్టయింది. తెలుగు సినిమాలు ఒక్కొక్కటిగా విడుదల తేదీల్ని మార్చుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మాతలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనిపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో పంపిణీదారులు, ప్రదర్శనకారులు, నిర్మాతలు నేడు సమావేశం కాబోతున్నారు. కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.
ఉగాది సినిమాలు రావా?
తెలుగు సినిమాకు కీలకమైన సీజన్ వేసవే. అది ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. నిర్మాతలు పక్కా ప్రణాళికలతో చిత్రాల్ని విడుదల చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రచార కార్యక్రమాల్ని ఇప్పుడిప్పుడే ముమ్మరం చేస్తున్నారు. ఇంతలోనే కరోనా మన తెరను కమ్మేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదట నెల్లూరులో థియేటర్లు బంద్ అయ్యాయి. శనివారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. బయటి రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ ఇప్పటికే కరోనా ప్రభావం బలంగా ఉండటం వల్ల మన సినిమాలకు వాయిదాలే శరణ్యంగా కనిపిస్తోంది. ఒక్క సినిమా వాయిదా పడిందంటే... ఆ తర్వాత సినిమాల విడుదల తేదీలు తారుమారువుతాయి. అలా కీలకమైన వేసవి సీజన్పై గట్టి దెబ్బపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగాదికి విడుదల కావల్సిన నాని సినిమా 'వి' దాదాపు వాయిదా పడినట్టే. వచ్చే నెల 2న రావాల్సిన రానా 'అరణ్య' వాయిదా పడింది. అనుష్క 'నిశ్శబ్దం' విడుదలపైనా సందిగ్ధం నెలకొంది. ఈ పరిణామాలు మన సినిమా పరిశ్రమకు నష్టం కలిగిస్తాయనడంలో సందేహం లేదు. ఈ విషయం గురించి ప్రముఖ నిర్మాత డి.సురేశ్బాబు 'ఈనాడు సినిమా'తో మాట్లాడారు.
"పండగ తర్వాత థియేటర్ల దగ్గర సందడి లేదు. వసూళ్లు చాలా తగ్గిపోయాయి. బలమైన సినిమాలు లేవు కాబట్టి మామూలే అనుకున్నాం. ఈ నెల 25 నుంచి పెద్ద సినిమాలు మొదలవుతున్నాయి. ఈ దశలో కరోనా ముప్పు పరిశ్రమపై ప్రభావం చూపిస్తుంది. వేసవిలో థియేటర్లు మూసేస్తే సినిమాలకు ఇబ్బంది ఎదురవుతుంది. విడుదలలు ఆగిపోతే నిర్మాతలపై వడ్డీల భారం పెరిగిపోతుంది. ఆ తర్వాత అన్ని సినిమాల్నీ ఒకేసారి విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి. దేనికీ సరైన వసూళ్లు రావు. థియేటర్లు మూసివేస్తే అక్కడ పనిచేసే ఉద్యోగులకూ ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. సినిమాకే కాదు, అన్ని రంగాలపైనా కరోనా ప్రభావం ఉంది."
-డి.సురేశ్బాబు, నిర్మాత
కరోనా ప్రభావం వాయిదాల పర్వం
'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫ్రాంఛైజీలో వస్తున్న తొమ్మిదో చిత్రం 'ఎఫ్ 9'. విన్ డీజిల్, మైఖేల్ రోడ్రిగిజ్, టైరస్ గిబ్సన్, జాన్సెనా, జోర్డానా బ్రూస్టర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. జస్టిన్ లిన్ దర్శకుడు. ఈ ఏడాది మే 22న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఏప్రిల్ 2, 2021కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వాయిదాకు కారణం ప్రత్యేకంగా కరోనా అని ఎక్కడా ప్రస్తావించలేదు కానీ "అందరి రక్షణ కోసమే" అని మాత్రం పేర్కొన్నారు. నిర్మాణాంతర కార్యక్రమాల్లో జాప్యం ఓ కారణంగా చెబుతున్నాయి హాలీవుడ్ వర్గాలు.
అక్షయ్కుమార్ నటిస్తున్న చిత్రం 'సూర్యవంశీ'. రోహిత్శెట్టి దర్శకుడు. కత్రినాకైఫ్ నాయిక. అజయ్దేవగణ్, రణ్వీర్సింగ్ అతిథి పాత్రల్లో నటించారు. పోలీస్ కథతో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ నెల 24న విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేసింది. కానీ కరోనా ప్రభావం పెరుగుతుండటం వల్ల వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు అక్షయ్కుమార్.
![పూజా హెగ్డే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6402656_fds.jpg)
"సూర్యవంశీ’ని సంవత్సరం పాటు కష్టపడి తీశాం. ఇది తీసింది ప్రేక్షకుల కోసమే. కానీ కరోనా కారణంగా వారు థియేటర్లకు రాలేని పరిస్థితి. వారి ఆరోగ్యం, రక్షణం దృష్టిలో ఉంచుకుని సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించాం. సరైన సమయం చూసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తాం"అని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు అక్షయ్.