మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రంలోని... "ముగ్గురుకి సాయం చేయి... ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పు" డైలాగ్ అప్పట్లో జనాల్లోకి విపరీతంగా దూసుకెళ్లింది. ఇదే సారాంశంతో ప్రస్తుతం గ్రీన్ ఛాలెంజ్ నడుస్తోంది. ఇందులో భాగంగా యంగ్టైగర్ ఎన్టీఆర్కు యాంకర్ సుమ కనకాల గ్రీన్ ఛాలెంజ్ విసిరింది.
భావితరాలు సంతోషంగా ఉండాలంటే ప్రతి వ్యక్తి మూడు మొక్కలు నాటాలన్న 'గ్రీన్ ఛాలెంజ్'లో భాగంగా.. మొక్కలు నాటాలని ఎన్టీఆర్కు విజ్ఞప్తి చేసింది సుమ. తెరాస ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ హరిత ఉద్యమంలో సహజ నటి జయసుధ చేసిన సవాల్ను సుమ స్వీకరించింది. బేగంపేటలోని మయూరి స్టూడియో ఆవరణలో అశోక, వేప, కదంబం మొక్కలు నాటింది. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్, తెలంగాణ ప్రభుత్వానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
"మనిషికి కష్టం ఎదురైనప్పుడు ప్రాణ వాయువును అందించే ప్రకృతి మధ్య గడిపితే నూరేళ్లపాటు ఆనందంగా ఉంటాం" అని ఈ సందర్భంగా సుమ తెలిపింది. ఎన్టీఆర్తో పాటు నటి మంచు లక్ష్మి, బిగ్బాస్ సీజన్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్, బుల్లితెర వ్యాఖ్యాత ఓంకార్కు...ఈ 'గ్రీన్ ఛాలెంజ్' విసిరింది సుమ కనకాల.