జూనియర్ ఎన్టీఆర్.. తన అభిమానులకు త్వరలో ఓ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తూ బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో... తన తర్వాతి చిత్రం కోసం అప్పడే ప్రణాళిక రచించాడట. ఈ కొత్త ప్రాజెక్టును మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తాడని సమాచారం. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో 'అరవింద సమేత వీర రాఘవ' వచ్చింది. తాజా చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్స్ట్, సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించనుంది చిత్రబృందం.
గాయకుడిగా ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్లో గాయకుడు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో తెలుగు, కన్నడ అభిమానులకు తన స్వరాన్ని పాటల రూపంలో వినిపించాడు. అయితే ఈ స్టార్ నటుడు మరోసారి గాయకుడిగా ప్రేక్షకులను అలరించనున్నాడని సమాచారం. తమిళంలో విజయ్ కథానాయకుడిగా, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'మాస్టర్'. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకుడు. ఇటీవల ఈ చిత్రం నుంచి 'కుట్టీ స్టోరీ' పాట విడుదల చేశారు. 'లెట్ మి సింగ్ ఎ కుట్టీ స్టోరీ' అంటూ హీరో విజయ్ స్వయంగా పాడిన ఈ పాట నెటిజన్లను ఓ ఊపు ఊపింది. అయితే తెలుగులో 'మాస్టర్' చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు విడుదల చేయనున్నాడు. ఇందులో భాగంగా అతడు.. ఎన్టీఆర్ చేత 'కుట్టీ స్టోరీ' పాడించాలనుకుంటున్నాడట! ఇప్పటికే హీరోని కలిసి విజ్ఞప్తి చేసినట్లు సినీవర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్టీఆర్ నోట మరో పాట వినొచ్చు.
ఇదీ చూడండి.. "శంకరాభరణం'.. నన్ను 40 ఏళ్లు వెనక్కి పంపింది'