భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మహమ్మారి సంక్షోభాన్నీ సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. కరోనా పేరిట నకిలీ ఖాతాలతో విరాళాలు సేకరిస్తూ లక్షలు కొల్లగొడుతున్నారు. భారత్లోని పలు సంస్థలను పోలిన నకిలీ ఈమెయిళ్లు ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. అసలైన సంస్థల నుంచి సంప్రదిస్తున్నట్లు మభ్యపెట్టి వ్యక్తుల నుంచి సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఐటీ సెక్యూరిటీ సంస్థ బర్రాకుడా నెట్వర్క్స్ విడుదల చేసిన ఓ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
- మొత్తం కేసుల్లో ఇలాంటివి(స్పియర్ ఫిషింగ్) కేసులు 72 శాతం నమోదయ్యాయి.
- సైబర్ దాడులలో 36 శాతం స్కామర్ల నుంచి ఉన్నాయి.
- 71 శాతం స్పియర్ ఫిషింగ్ మెయిళ్లలో ప్రమాదకర యూఆర్ఎల్లు ఉంటున్నాయి.
- బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్(బీఈసీ) దాడుల్లో 30 శాతం మెయిళ్లలో మాత్రమే లింక్లు ఉంటున్నాయి.
"స్పియర్ ఫిషింగ్ దాడుల్లో 13 శాతం అంతర్గత కాంప్రమైజ్డ్ ఖాతాల నుంచి వచ్చినవే. కాబట్టి బయట వ్యక్తుల నుంచి తమ ఖాతాలను రక్షించుకునేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తాయో.. అదే రకంగా అంతర్గత ఈమెయిల్ ట్రాఫిక్పైనా సంస్థలు దృష్టిసారించాలి."
-బర్రాకుడా నెట్వర్క్స్ నివేదిక
బీఈసీ మెయిళ్లను పంపించి బాధితుల నమ్మకాన్ని చూరగొంటున్నారని తెలిపింది బర్రాకుడా. చాలా సార్లు యూఆర్ఎల్ లేకపోవడం వల్ల ఈ దాడి జరిగిన విషయాన్ని గుర్తించలేకపోతున్నట్లు పేర్కొంది.
దేశంలోని చాలా సంస్థలకు ప్రస్తుతం ఈ ముప్పు పొంచి ఉందని 'బర్రాకుడా నెట్వర్క్స్' మేనేజర్ మురళి పేర్కొన్నారు. తమ వ్యూహం బయటపడగానే సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారని వెల్లడించారు. ప్రమాదకరమైన లింక్లను దాచిపెట్టడానికి వివిధ పద్ధతులు పాటిస్తున్నారని తెలిపారు. ఈ దాడులను ఎదుర్కొనే సాంకేతికతను సంస్థలు అందిపుచ్చుకోవాలని సూచించారు. కేటుగాళ్ల వలలో పడకుండా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు.