విదేశీ దురాక్రమణ నుంచి అంతర్గత కల్లోలాల నుంచి ప్రతి రాష్ట్రాన్ని పరిరక్షించి, అన్ని రాష్ట్రాల్లోనూ పాలన రాజ్యాంగబద్ధంగా సాగేటట్లు చూడటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని 355వ అధికరణ స్పష్టీకరిస్తోంది. మలిదఫా కోరసాచిన కొవిడ్ మహమ్మారి రికార్డు స్థాయి కేసులు, మరణాలతో అంతర్గత కల్లోలం సృష్టిస్తుంటే, పౌరుల జీవన హక్కుకు దిక్కులేకుండా పోతున్న దురవస్థలో రాష్ట్రాలు కూరుకుపోతుంటే- కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? దేశవ్యాప్తంగా 741 జిల్లాల్లో 301 చోట్ల కొవిడ్ పాజిటివ్ రేటు 20శాతం దాటి పోయిందని గణాంకాలు చాటుతున్నాయి. అసోమ్, పశ్చిమ్ బంగ, ఒడిశా, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల దిశగా కొవిడ్ పయనం సాగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ 'వాతావరణ నివేదిక' వెలువరించింది. ఐసీయూలో ఒక్క పడక ఖాళీ అయితే, విషమ స్థితిలో ఉన్న 30 మంది పేషంట్లలో ఎవరికి అది కేటాయించాలో తెలియక కుమిలిపోతున్నామన్న కర్ణాటక యువ వైద్యుల ఆవేదన- దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ప్రతిఫలిస్తోంది. నీతిఆయోగ్ సభ్యులు వీకేపాల్ సారథ్యంలోని కమిటీ నిర్దేశించిన నమూనా మేరకు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా అందిస్తున్నామన్న కేంద్రం వాదనను నిష్కర్షగా తోసిపుచ్చిన సుప్రీంకోర్టు- తానే చొరవచూపి 12 మంది సభ్యులతో జాతీయ టాస్క్ఫోర్స్ను కొలువుతీర్చింది. కొవిడ్ కోరలు పెరకడానికంటూ నిరుడు మార్చిలోనే 21 మంది సభ్యులతో టాస్క్ఫోర్స్ను కేంద్రం ఏర్పాటు చేసినా- దాన్ని ఉత్సవ విగ్రహంగా మార్చేసింది. దేశవ్యాప్తంగా 500 కేసులున్నప్పుడే జాతీయ లాక్డౌన్ ప్రకటించిన కేంద్రం- నేడు రోజుకు నాలుగు లక్షలకుపైగా కొత్త కేసులు పోటెత్తుతున్నా చోద్యం చూస్తున్నదంటేనే టాస్క్ఫోర్స్ నిరర్థకత బోధపడుతోంది. వైరస్ ఉరవడిని గణిత నమూనాలో అంచనా కట్టి ముందస్తు హెచ్చరిక చేసేందుకు నిరుడు మే నెలలో ఏర్పాటు చేసిన సూపర్ మోడల్ కమిటీ మొన్న మార్చిలోనే మలిదశ విజృంభణపై నివేదించినా కేంద్రం చెవిన పెడితే ఒట్టు. మానవ కల్పిత మహా విషాదంలో కొట్టుమిట్టాడుతున్న జాతికి 'సుప్రీం' చొరవే చుక్కాని కానుందిప్పుడు!
కరోనాపై సమరాన్ని ప్రజా ఉద్యమంగా మలిచామని, ప్రాణాల్ని కాపాడటంలో ఘన విజయం సాధించిన దేశాల సరసన నిలిచామని జనవరి చివరి వారంలో ప్రధాని మోదీయే ప్రకటించారు. కరోనా ఉత్పరివర్తనాల అధ్యయనానికి పది ప్రతిష్ఠాత్మక సంస్థలతో జెనెటిక్స్ కన్సార్షియాన్ని మొన్న డిసెంబరులో ఏర్పాటు చేశారు. కొవిడ్ పలాయనం చిత్తగించిందంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి మార్చి తొలివారంలో ప్రకటించిన రెండు రోజులకే- వైరస్ బెడద శీఘ్రగతిన పెరగనున్నట్లు వ్యాధుల నిరోధక జాతీయ కేంద్రాని(ఎన్సీడీసీ)కి కన్సార్షియం నివేదించింది. ఆ సంగతి ప్రధానికి తెలియకుండా ఉండే అవకాశం లేదన్న సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా- ముందు జాగ్రత్తలు తీసుకోని కారణంగా దాపురించిన ముప్పు ఇదని వ్యాఖ్యానించారు! జన సమూహాల్లోకి వైరస్ చొచ్చుకుపోయేకొద్దీ మరింత ప్రమాదకర ఉత్పరివర్తనాలు చోటుచేసుకొంటాయన్న అధ్యయనాల నేపథ్యంలోనే- మరికొద్ది నెలల్లో కొవిడ్ మూడోవిడత విజృంభణ అంచనాలు చెవిన పడుతున్నాయి. ఆ అంశాన్ని సూటిగా ప్రస్తావించిన సుప్రీంకోర్టు- వర్తమాన, భవిష్యత్ అవసరాల రీత్యా జాతీయ కోణంలో ప్రాణవాయువు ఉత్పత్తి, పంపిణీ సరఫరాలపై శాస్త్రీయ హేతుబద్ధ విధానం రూపొందించే బాధ్యతను టాస్క్ఫోర్స్కు కట్టబెట్టింది! అత్యవసర మందులు, ఔషధాల లభ్యతపైనా టాస్క్ఫోర్స్ దృష్టి సారించాలన్న సుప్రీంకోర్టు- అంటువ్యాధులు, వైరాలజీలకు చెందిన నిపుణులకూ అందులో చోటుపెడితే బాగుండేది. అసలు మహమ్మారిపై యుద్ధం అనేది- శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా, వైద్య శిఖామణుల పర్యవేక్షణలో, భిన్న విభాగాల సమన్వయంతో ప్రజల్ని జాగృతం చేస్తూ నిష్ఠగా సాగాల్సిన మహాయజ్ఞం. ఆ బాధ్యతలో విఫలమైన ప్రభుత్వం న్యాయపాలిక మార్గదర్శకాలకు మోరసాచడమే దౌర్భాగ్యం!
ఇదీ చూడండి: 'నిధుల కేటాయింపుల్లో ఆరోగ్య రంగంపై నిర్లక్ష్యం'