ETV Bharat / opinion

స్త్రీ సాధికారతను చిదిమేస్తున్న పురుషాధిక్యత

అనాదికాలం నుంచి భారత్​లో పురుషాధిక్యం వేళ్లూనుకుని ఉందనడంలో ఏం సందేహం లేదు. అయినా ఎన్నో అవరోధాలు దాటి ఆడదంటే.. అబల కాదు సబల అని ఎందరో నారీమనులు రుజువు చేశారు. అవకాశం ఉన్నచోట అతివలెంతగా రాణించగలరో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ లాంటివారు రుజువు చేసి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మన దేశంలో మాత్రం అతివల హక్కుల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఇప్పటికీ కనిపిస్తోంది.

author img

By

Published : Mar 28, 2021, 9:25 AM IST

Masculinity over women in India
కాటేస్తున్న పురుషాధిక్యత

భవిష్యత్తును తీర్చిదిద్దుకొనే హక్కు మగవాళ్లకెంత ఉందో మహిళలకూ అంతే ఉందన్నారు మహాత్మాగాంధీ. పురుషాధిక్య భావజాలం ప్రబలంగా ఊడలు దిగిన భారతీయ సమాజంలో అన్నింటా లింగ సమానత్వ భావనకు రాజ్యాంగమే పట్టం కట్టింది. సామాజికంగా వెనకబడిన వర్గాలకు తగు ప్రోత్సాహకాలందించే సదావకాశాన్ని ప్రభుత్వాలకు కట్టబెట్టింది. కులమత ప్రాంత వర్గ భేదాలతో నిమిత్తం లేకుండా తరాల తరబడి అబలలన్న ముద్రపడి ఇంటిపట్టుకే పరిమితమైన సగటు భారత నారి- సామాజిక వాతావరణంలో కొన్ని దశాబ్దాలుగా వస్తున్న మార్పులకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకొంటోంది. అవకాశం ఉన్నచోట అతివలెంతగా రాణించగలరో నాసా శాస్త్రవేత్త స్వాతి మోహన్‌, అగ్రరాజ్యం ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ రుజువు చేసి స్ఫూర్తిదాతలవుతుంటే- చట్టబద్ధంగా దక్కాల్సిన వాటికోసమూ కోర్టుల్ని ఆశ్రయించాల్సిన ప్రారబ్ధం దేశీయంగా మహిళల్ని వెంటాడుతోంది. గౌరవప్రద జీవనం కోసం అహరహం శ్రమించి ఎదుగుతున్న మహిళలకూ లైంగిక వేధింపులు తప్పని పీడ- ప్రాణాంతక చీడగా దాపురించింది. దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాలకు సిద్ధపడుతున్న జాతి మనది. జనావళిలో సగంగా ఉన్న మహిళల కన్నీటి నివేదనల్ని ఆలకించడం అందరి విధి!

రణరంగంలో శత్రువుల్ని చెండాడిన ఝాన్సీ లక్ష్మీబాయి వీరగాథను పాఠ్యాంశంగా పసి మెదళ్లకు నూరిపోసే ప్రభుత్వం- సైన్యంలో సమన్యాయానికి తలుపులు మూసేయడం ఏమిటి? ఇజ్రాయెల్‌లో మహిళా సైనికులు పాతికేళ్లకుపైగా పోరాట విధుల్లో పాల్గొంటుంటే- 2001 నుంచి జర్మనీ, 2013 నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, 2018 నుంచి బ్రిటన్‌ అందుకు అనుమతించాయి. పరిమిత కాల విధుల్లో (షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌)ని మహిళా అధికారులకు పర్మినెంట్‌ కమిషన్‌ ఇవ్వాలంటూ 2010లో దిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. అప్పటిదాకా జరిగిన తప్పును సరిదిద్దుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం- ఆ తీర్పుపై అప్పీలు చేస్తూ వినిపించిన వాదనలు, పాలకుల మెదళ్లలో బూజుపట్టిన భావజాలాన్ని కళ్లకు కట్టాయి. జవాన్లలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు కావడంతో కమాండ్‌ హోదాలో మహిళా అధికారుల్ని ఆమోదించేందుకు మానసికంగా వారింకా సంసిద్ధంగా లేరట!

స్త్రీసహజ ప్రకృతి ధర్మాలు, కుటుంబపర బాధ్యతల నిర్వహణ వంటి వాటివల్ల సైనిక విధుల్లోని సవాళ్లను వారు అధిగమించలేరట! ఆ వాదనలన్నీ పసలేనివిగా తీర్మానించిన సుప్రీంకోర్టు- కవాతుల్లో పురుష జవాన్లతో కూడిన దళాలను ముందుండి నడిపించిన లెఫ్ట్‌నెంట్‌ భావనా కస్తూరి, కెప్టెన్‌ తానియా షేర్‌గిల్‌ సామర్థ్యాన్ని, ఐరాస శాంతి పరిరక్షణ దళాల్లో భారత మహిళా అధికారుల పాత్రను ప్రస్తావించి నిరుడు ఫిబ్రవరిలో పర్మినెంట్‌ కమిషన్‌ ఇవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చింది. ఆ ఆదేశాల్ని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంపై 86 మంది మహిళలు మళ్లీ కోర్టును ఆశ్రయించిన నేపథ్యం- కీలక స్థానాల్లోనూ పురుషాధిక్య భావజాలం ఎంతగా బుసలు కొడుతోందో వెల్లడించింది. మగవారి కోసం, మగవారే పెట్టుకొన్న వ్యవస్థ మహిళలపట్ల ప్రదర్శిస్తున్న దుర్విచక్షణను న్యాయపాలిక మళ్ళీ ఉతికి ఆరేసింది. 'మహిళాధికారుల్ని ఎంపిక చేయడం కన్నా వారిని తిరస్కరించడానికే బోర్డు భేటీ అయినట్లుంది' అన్న సుప్రీం వ్యాఖ్య చాలు- లింగ విచక్షణకు అదే తిరుగులేని రుజువు. దుర్విచక్షణాపూరితమైన మదింపు విధానాన్ని మార్చాలంటూ సుప్రీంకోర్టు స్పష్టీకరించినా రాత్రికిరాత్రే సంబంధిత పెద్దల ధోరణి మారుతుందా, అంటే- సందేహమే. మరోవంక పని ప్రదేశాల్లో స్త్రీలపట్ల అధికార మదాంధుల లైంగిక దారుణ దురాగతాలదీ- అంతులేని వ్యధే!

స్త్రీ సాధికారతను చిదిమేస్తున్నారు!

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఏనాడో 47 ఏళ్ల క్రితం 'ప్రాజెక్టు టైగర్‌' కింద మెల్గాట్‌ టైగర్‌ రిజర్వు ఏర్పాటైంది. అక్కడ రేంజి ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించే దీపాలీ చవాన్‌ అటవీ మాఫియా వెన్నులో వణుకు పుట్టించి, సివంగిగా పేరు తెచ్చుకొన్న ధీశాలి. అంతటి ఖలేజాగల దీపాలీ తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. అందుకు దారితీసిన కారణాల్ని ఏకరువు పెడుతూ దీపాలీ రాసిన లేఖ- మనసున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించేదే. ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌గా దీపాలీ పై అధికారి అయిన శివకుమార్‌ తననెంతగా శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేసిందీ పూసగుచ్చారు. గర్భవతిగా ఉన్న దీపాలీని ఆరోగ్యం బాగాలేదన్నా పెట్రోలింగ్‌ విధుల పేరిట గత నెలలో మూడు రోజుల పాటు అడవిలో వందల కిలోమీటర్లు తిప్పడంతో ఆమెకు గర్భస్రావం అయింది. శివకుమార్‌ అరాచకంపై అతగాడి పై అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మానసికంగా అలసిపోయి దీపాలీ ఆత్మహత్యకు పాల్పడిన వైనం- 2013 నాటి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి ఉద్దేశించిన చట్టం ఉండీ ఉద్ధరిస్తోంది ఏమిటన్న సందేహాల్ని రగిలిస్తోంది. అదే అమరావతికి చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్‌ కౌర్‌ తనను శివసేనకు చెందిన మరో ఎంపీ అరవింద్‌ సావంత్‌ లోక్‌సభ లాబీలోనే బెదిరించారంటూ చేసిన ఆరోపణలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో మాట్లాడినందుకు జైలుపాలు చేస్తామని ఎంపీ బెదిరిస్తే, తనపై యాసిడ్‌ దాడి చేస్తామంటూ ఫోన్‌లో హెచ్చరిస్తున్నారని లోక్‌సభాపతికి నవనీత్‌ కౌర్‌ ఫిర్యాదు చేశారు. సామాజిక వైకుంఠపాళిలో ఎన్నెన్నో పాముల్ని దాటుకుంటూ స్వయంకృషితో నిచ్చెనలెక్కి గౌరవప్రద స్థానాలకు అతికష్టంతో చేరినా- అక్కడా స్త్రీ సాధికారతను చిదిమేసే మృగాళ్లు మాటువేసే ఉంటారనడానికి ఇవన్నీ దృష్టాంతాలు!

సమాన అవకాశాలు ఉన్నాయా?

'పని ప్రదేశాల్లో స్త్రీలను లైంగిక వేధింపులకు గురి చెయ్యడమంటే రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కుల్ని వారికి నిరాకరిస్తున్నట్లే. 14, 15వ అధికరణలు కల్పిస్తున్న సమానత్వ హక్కును దూరం చేసినట్లే. గౌరవప్రదంగా జీవించేందుకు వారికిగల హక్కును ఉల్లంఘించినట్లే. నచ్చిన ఉద్యోగం- వృత్తి చేసుకొనే హక్కును తిరస్కరించినట్లే' అని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. ఆకాశంలో సగం అంటూ అందమైన అబద్ధాల్ని వల్లెవేయడంలో దశాబ్దాలుగా ముందున్న నేతాగణం- సమాన స్థాయిలో అవకాశాలు కల్పించడంలో మాత్రం వెనకంజ వేస్తూనే ఉంది. 2017లో ఇండియన్‌ బార్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సర్వే- 70 శాతం మహిళలు తమపై జరిగే అఘాయిత్యాలపై ఫిర్యాదు చేయడం లేదని, పర్యవసానాల గురించి భయపడుతున్నారని నిగ్గు తేల్చింది. చట్టబద్ధంగా ఏర్పాటుకావాల్సిన అంతర్గత యంత్రాంగాలూ కానరాక, ఒకవేళ ఉన్నా అది నామమాత్రమైన దశలో దీపాలీ వంటి అభాగినుల హృదయవేదన శోకసంద్రమై పోటెత్తుతోంది. స్త్రీగౌరవాన్ని, జీవించే హక్కును పణంపెట్టి మరొకరి పరువు హక్కును కాపాడలేమంటూ న్యాయపాలిక మహిళల హక్కులు కొడిగట్టి పోకుండా అరచేతులు అడ్డుపెడుతున్నా- స్వీయ మానాభిమానాల మీద సాగుతున్న వికృత దాడిని సమర్థంగా తిప్పికొట్టేలా సామూహిక స్త్రీచేతన పురివిప్పాల్సిన తరుణమిది. కొరగాని చట్టాలకు అగ్ని సంస్కారం చేసి, మహిళల గౌరవాన్ని నిలబెట్టే సమర్థ యంత్రాంగాల కూర్పునకు ప్రభుత్వాలు నిబద్ధత చూపాల్సిన సమయమూ ఇదే. ఏమంటారు?

రచయిత- పర్వతం మూర్తి

భవిష్యత్తును తీర్చిదిద్దుకొనే హక్కు మగవాళ్లకెంత ఉందో మహిళలకూ అంతే ఉందన్నారు మహాత్మాగాంధీ. పురుషాధిక్య భావజాలం ప్రబలంగా ఊడలు దిగిన భారతీయ సమాజంలో అన్నింటా లింగ సమానత్వ భావనకు రాజ్యాంగమే పట్టం కట్టింది. సామాజికంగా వెనకబడిన వర్గాలకు తగు ప్రోత్సాహకాలందించే సదావకాశాన్ని ప్రభుత్వాలకు కట్టబెట్టింది. కులమత ప్రాంత వర్గ భేదాలతో నిమిత్తం లేకుండా తరాల తరబడి అబలలన్న ముద్రపడి ఇంటిపట్టుకే పరిమితమైన సగటు భారత నారి- సామాజిక వాతావరణంలో కొన్ని దశాబ్దాలుగా వస్తున్న మార్పులకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకొంటోంది. అవకాశం ఉన్నచోట అతివలెంతగా రాణించగలరో నాసా శాస్త్రవేత్త స్వాతి మోహన్‌, అగ్రరాజ్యం ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ రుజువు చేసి స్ఫూర్తిదాతలవుతుంటే- చట్టబద్ధంగా దక్కాల్సిన వాటికోసమూ కోర్టుల్ని ఆశ్రయించాల్సిన ప్రారబ్ధం దేశీయంగా మహిళల్ని వెంటాడుతోంది. గౌరవప్రద జీవనం కోసం అహరహం శ్రమించి ఎదుగుతున్న మహిళలకూ లైంగిక వేధింపులు తప్పని పీడ- ప్రాణాంతక చీడగా దాపురించింది. దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాలకు సిద్ధపడుతున్న జాతి మనది. జనావళిలో సగంగా ఉన్న మహిళల కన్నీటి నివేదనల్ని ఆలకించడం అందరి విధి!

రణరంగంలో శత్రువుల్ని చెండాడిన ఝాన్సీ లక్ష్మీబాయి వీరగాథను పాఠ్యాంశంగా పసి మెదళ్లకు నూరిపోసే ప్రభుత్వం- సైన్యంలో సమన్యాయానికి తలుపులు మూసేయడం ఏమిటి? ఇజ్రాయెల్‌లో మహిళా సైనికులు పాతికేళ్లకుపైగా పోరాట విధుల్లో పాల్గొంటుంటే- 2001 నుంచి జర్మనీ, 2013 నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, 2018 నుంచి బ్రిటన్‌ అందుకు అనుమతించాయి. పరిమిత కాల విధుల్లో (షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌)ని మహిళా అధికారులకు పర్మినెంట్‌ కమిషన్‌ ఇవ్వాలంటూ 2010లో దిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. అప్పటిదాకా జరిగిన తప్పును సరిదిద్దుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం- ఆ తీర్పుపై అప్పీలు చేస్తూ వినిపించిన వాదనలు, పాలకుల మెదళ్లలో బూజుపట్టిన భావజాలాన్ని కళ్లకు కట్టాయి. జవాన్లలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు కావడంతో కమాండ్‌ హోదాలో మహిళా అధికారుల్ని ఆమోదించేందుకు మానసికంగా వారింకా సంసిద్ధంగా లేరట!

స్త్రీసహజ ప్రకృతి ధర్మాలు, కుటుంబపర బాధ్యతల నిర్వహణ వంటి వాటివల్ల సైనిక విధుల్లోని సవాళ్లను వారు అధిగమించలేరట! ఆ వాదనలన్నీ పసలేనివిగా తీర్మానించిన సుప్రీంకోర్టు- కవాతుల్లో పురుష జవాన్లతో కూడిన దళాలను ముందుండి నడిపించిన లెఫ్ట్‌నెంట్‌ భావనా కస్తూరి, కెప్టెన్‌ తానియా షేర్‌గిల్‌ సామర్థ్యాన్ని, ఐరాస శాంతి పరిరక్షణ దళాల్లో భారత మహిళా అధికారుల పాత్రను ప్రస్తావించి నిరుడు ఫిబ్రవరిలో పర్మినెంట్‌ కమిషన్‌ ఇవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చింది. ఆ ఆదేశాల్ని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంపై 86 మంది మహిళలు మళ్లీ కోర్టును ఆశ్రయించిన నేపథ్యం- కీలక స్థానాల్లోనూ పురుషాధిక్య భావజాలం ఎంతగా బుసలు కొడుతోందో వెల్లడించింది. మగవారి కోసం, మగవారే పెట్టుకొన్న వ్యవస్థ మహిళలపట్ల ప్రదర్శిస్తున్న దుర్విచక్షణను న్యాయపాలిక మళ్ళీ ఉతికి ఆరేసింది. 'మహిళాధికారుల్ని ఎంపిక చేయడం కన్నా వారిని తిరస్కరించడానికే బోర్డు భేటీ అయినట్లుంది' అన్న సుప్రీం వ్యాఖ్య చాలు- లింగ విచక్షణకు అదే తిరుగులేని రుజువు. దుర్విచక్షణాపూరితమైన మదింపు విధానాన్ని మార్చాలంటూ సుప్రీంకోర్టు స్పష్టీకరించినా రాత్రికిరాత్రే సంబంధిత పెద్దల ధోరణి మారుతుందా, అంటే- సందేహమే. మరోవంక పని ప్రదేశాల్లో స్త్రీలపట్ల అధికార మదాంధుల లైంగిక దారుణ దురాగతాలదీ- అంతులేని వ్యధే!

స్త్రీ సాధికారతను చిదిమేస్తున్నారు!

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఏనాడో 47 ఏళ్ల క్రితం 'ప్రాజెక్టు టైగర్‌' కింద మెల్గాట్‌ టైగర్‌ రిజర్వు ఏర్పాటైంది. అక్కడ రేంజి ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించే దీపాలీ చవాన్‌ అటవీ మాఫియా వెన్నులో వణుకు పుట్టించి, సివంగిగా పేరు తెచ్చుకొన్న ధీశాలి. అంతటి ఖలేజాగల దీపాలీ తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. అందుకు దారితీసిన కారణాల్ని ఏకరువు పెడుతూ దీపాలీ రాసిన లేఖ- మనసున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించేదే. ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌గా దీపాలీ పై అధికారి అయిన శివకుమార్‌ తననెంతగా శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేసిందీ పూసగుచ్చారు. గర్భవతిగా ఉన్న దీపాలీని ఆరోగ్యం బాగాలేదన్నా పెట్రోలింగ్‌ విధుల పేరిట గత నెలలో మూడు రోజుల పాటు అడవిలో వందల కిలోమీటర్లు తిప్పడంతో ఆమెకు గర్భస్రావం అయింది. శివకుమార్‌ అరాచకంపై అతగాడి పై అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మానసికంగా అలసిపోయి దీపాలీ ఆత్మహత్యకు పాల్పడిన వైనం- 2013 నాటి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి ఉద్దేశించిన చట్టం ఉండీ ఉద్ధరిస్తోంది ఏమిటన్న సందేహాల్ని రగిలిస్తోంది. అదే అమరావతికి చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్‌ కౌర్‌ తనను శివసేనకు చెందిన మరో ఎంపీ అరవింద్‌ సావంత్‌ లోక్‌సభ లాబీలోనే బెదిరించారంటూ చేసిన ఆరోపణలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో మాట్లాడినందుకు జైలుపాలు చేస్తామని ఎంపీ బెదిరిస్తే, తనపై యాసిడ్‌ దాడి చేస్తామంటూ ఫోన్‌లో హెచ్చరిస్తున్నారని లోక్‌సభాపతికి నవనీత్‌ కౌర్‌ ఫిర్యాదు చేశారు. సామాజిక వైకుంఠపాళిలో ఎన్నెన్నో పాముల్ని దాటుకుంటూ స్వయంకృషితో నిచ్చెనలెక్కి గౌరవప్రద స్థానాలకు అతికష్టంతో చేరినా- అక్కడా స్త్రీ సాధికారతను చిదిమేసే మృగాళ్లు మాటువేసే ఉంటారనడానికి ఇవన్నీ దృష్టాంతాలు!

సమాన అవకాశాలు ఉన్నాయా?

'పని ప్రదేశాల్లో స్త్రీలను లైంగిక వేధింపులకు గురి చెయ్యడమంటే రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కుల్ని వారికి నిరాకరిస్తున్నట్లే. 14, 15వ అధికరణలు కల్పిస్తున్న సమానత్వ హక్కును దూరం చేసినట్లే. గౌరవప్రదంగా జీవించేందుకు వారికిగల హక్కును ఉల్లంఘించినట్లే. నచ్చిన ఉద్యోగం- వృత్తి చేసుకొనే హక్కును తిరస్కరించినట్లే' అని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. ఆకాశంలో సగం అంటూ అందమైన అబద్ధాల్ని వల్లెవేయడంలో దశాబ్దాలుగా ముందున్న నేతాగణం- సమాన స్థాయిలో అవకాశాలు కల్పించడంలో మాత్రం వెనకంజ వేస్తూనే ఉంది. 2017లో ఇండియన్‌ బార్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సర్వే- 70 శాతం మహిళలు తమపై జరిగే అఘాయిత్యాలపై ఫిర్యాదు చేయడం లేదని, పర్యవసానాల గురించి భయపడుతున్నారని నిగ్గు తేల్చింది. చట్టబద్ధంగా ఏర్పాటుకావాల్సిన అంతర్గత యంత్రాంగాలూ కానరాక, ఒకవేళ ఉన్నా అది నామమాత్రమైన దశలో దీపాలీ వంటి అభాగినుల హృదయవేదన శోకసంద్రమై పోటెత్తుతోంది. స్త్రీగౌరవాన్ని, జీవించే హక్కును పణంపెట్టి మరొకరి పరువు హక్కును కాపాడలేమంటూ న్యాయపాలిక మహిళల హక్కులు కొడిగట్టి పోకుండా అరచేతులు అడ్డుపెడుతున్నా- స్వీయ మానాభిమానాల మీద సాగుతున్న వికృత దాడిని సమర్థంగా తిప్పికొట్టేలా సామూహిక స్త్రీచేతన పురివిప్పాల్సిన తరుణమిది. కొరగాని చట్టాలకు అగ్ని సంస్కారం చేసి, మహిళల గౌరవాన్ని నిలబెట్టే సమర్థ యంత్రాంగాల కూర్పునకు ప్రభుత్వాలు నిబద్ధత చూపాల్సిన సమయమూ ఇదే. ఏమంటారు?

రచయిత- పర్వతం మూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.