ETV Bharat / opinion

మానవమృగాల అభయారణ్యం- బాధితులకు న్యాయమెక్కడ?

author img

By

Published : Mar 14, 2021, 8:33 AM IST

మానవమృగాల మదోన్మాదానికి లేడికూనలు విలవిల్లాడుతున్న ఘటనలకు కొదవ లేకుండా పోతోంది. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాల జాడ్యం దేశంలో పెచ్చరిల్లుతోంది. వీటిని నియంత్రించే విషయాన్ని పక్కనబెడితే.. బాధితులకు న్యాయం దక్కడానికే ఏళ్లు గడిచిపోతున్నాయి. పోక్సో కేసుల విచారణ నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వాలు నైతిక బాధ్యత వహిస్తేనే గుణాత్మక మార్పు సాధ్యమయ్యేది.

MINI FEATURE
మానవమృగాల అభయారణ్యం

'ఇండియా అంటే నేరాలు అత్యాచారాలు తప్ప మరేమీ కాదన్నట్లుంది...'- మూడేళ్ల క్రితం బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలవి. అవెంత నికార్సయిన చేదు నిజాలో ప్రతిరోజూ రుజువవుతూనే ఉంది. పదేళ్ల కాలంలో చిన్న పిల్లలపై లైంగిక నేరాలు అయిదు రెట్లు పెరిగాయన్న అధ్యయనాలు, పసివారిని వేధించి అమానుషంగా హింసించే క్రౌర్యం భారతగడ్డపై పెచ్చరిల్లుతోందన్న 'యునిసెఫ్‌' విశ్లేషణలు- పైశాచికత్వ ప్రదర్శనలో అసాధారణ 'వృద్ధిరేటు'కు నిలువెత్తు దర్పణాలై వర్ధిల్లుతున్నాయి.

ఈ నెల ఎనిమిదో తేదీన యావద్భారతం ధూమ్‌ధామ్‌గా మహిళా దినోత్సవ సంబరాల్లో తలమునకలైన పావన దినంనాడు యూపీలోని కాన్పూర్‌ జిల్లాలో ఎంత ఘోరం జరిగిందో విన్నారా? ఓ పదమూడేళ్ల అమ్మాయి పశుగ్రాసం కోసం బయటకు వెళ్ళింది. మాటు వేసి ఉన్న మానవమృగాలు ఆ నిర్భాగ్యురాలిని ఎత్తుకుపోయాయి. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి తెగబడ్డాయి. 'ఇలా జరిగిందని ఎవరికైనా చెప్పావో... ఖబడ్దార్‌!' అని బెదిరించి అక్కడినుంచి ముగ్గురు యువకులూ ఉడాయించారు. నోర్మూసుకుని పడి ఉండకపోతే ఈసారి బహిరంగంగా బలాత్కరిస్తామని, 'గొప్ప' కుటుంబ నేపథ్యం కలిగిన తమను ఎవరూ ఏమీ చేయలేరని హెచ్చరించాక, అంతా సద్దుమణుగుతుందనుకున్న వాళ్ల అంచనా తప్పింది. తొమ్మిదో తేదీన పోలీస్‌ ఠాణాలో ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్‌ఐఆర్‌) నమోదైంది. తమ ఫర్మానాను బేఖాతరు చేసేసరికి రగిలిపోయిన యువకులు- ఆ కుటుంబానికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. పదో తేదీన బాధితురాలి తండ్రి ట్రక్కుకింద పడి రోడ్డు ప్రమాదంలో కడతేరిపోయాడు. పోలీస్‌ అధికారి కొడుకులిద్దరి ప్రమేయం కలిగిన కేసులో ఠాణా సిబ్బంది అలసత్వం, పిల్ల తండ్రిది క్రూరమైన హత్యేనంటూ మిన్నంటిన ఆందోళనల దృష్ట్యా- ఇద్దరు ఎస్సైలను, ఒక కానిస్టేబుల్‌ను విధులనుంచి సస్పెండ్‌ చేశారు. బతుకు మీద ఆశను, తండ్రి నీడను ఏకకాలంలో కోల్పోయిన ఆ నిస్సహాయురాలి జీవితం ఈ 'నిర్భయ భారతం'లో కడకు ఏ మలుపు తిరగనుందో ఏమో!

కొదవలేని ఉదంతాలు

పశువాంఛలు ప్రకోపించిన మానవమృగాల మదోన్మాదానికి లేడికూనలు, సంబంధీకులు విలవిల్లాడుతూ నేలకొరిగిన ఉదంతాలకు ఈ గడ్డమీద కొదవ లేదు. మొన్నీమధ్యే యూపీలోని హాథ్రస్‌లో ఏడేళ్ల బాలిక సామూహిక అత్యాచారం, దాన్ని వెన్నంటి పరమ కిరాతక హత్య ఎందరినో దిగ్భ్రాంతపరచాయి. ఇంచుమించు అదే సమయంలో ఫతేపూర్‌కు చెందిన ఇద్దరు దళిత మైనర్‌ అక్కాచెల్లెళ్లపై లైంగిక దాష్టీకానికి తెగబడి చంపేసి ఊరి చివరి చెరువులో పారేసిన ఘటన గగ్గోలు పుట్టించింది. తాము వేధిస్తుండగా పదహారేళ్ల బాలిక ప్రతిఘటించడాన్ని తట్టుకోలేక ఫిరోజాబాద్‌లో ముగ్గురు యువకులు ఆమెను అక్కడికక్కడే కాల్చి చంపేశారు. తాజాగా కాన్పూర్‌ ఘటనలో సామూహిక అత్యాచార నేరారోపణలపై భారత శిక్షా స్మృతి(ఐపీసీ) సెక్షన్‌ 376 కింద, పోక్సో(లైంగిక నేరాలనుంచి బాలల సంరక్షణకు ఉద్దేశించిన చట్టం) కింద ముగ్గురు నిందితులపై కేసులు పెట్టారు.

బాధితులకు న్యాయమేది?

కాన్పుర్‌ దురంతం బహిర్గతమైన సమయంలోనే, నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత కైలాస్‌ సత్యార్థి పేరిట నెలకొన్న ఫౌండేషన్‌ కొన్ని విస్మయపరచే వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. పోక్సో చట్టం కింద నమోదవుతున్న కేసులలో ఏటా సుమారు మూడు వేల దాకా సరైన విచారణకు నోచకుండానే మరుగున పడుతున్నాయని ఆ సంస్థ చెబుతోంది. జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) రికార్డుల ప్రకారమే అయిదింట రెండు పోక్సో కేసులు ఛార్జిషీట్‌ దశకు చేరకుండానే మూతపడుతున్నాయంటే- బాధితులకు దక్కుతున్న న్యాయమెంత, అనివార్యంగా దాపురిస్తున్న అన్యాయమెంత? 2016 నాటికి దేశంలో అపరిష్కృతంగా పోగుపడి ఉన్న పోక్సో కేసులు ఒక కొలిక్కి రావడానికి అధమపక్షం 20 సంవత్సరాలైనా పడుతుందని మూడేళ్ల క్రితం కైలాస్‌ సత్యార్థి లెక్కకట్టారు. వాటికి ఏటా కొత్తగా జమపడే కేసుల్ని జోడిస్తే చిన్న పిల్లలపై లైంగిక దాడుల కేసులు వారి వృద్ధాప్య దశలోనైనా పరిష్కరణకు నోచుకుంటాయో లేదో నికరంగా చెప్పగలవారెవరు?

నత్తలకు నడకలు నేర్పే వేగంతోనా?

నేరన్యాయ విచారణలో తీవ్ర జాప్యాన్ని న్యాయ నిరాకరణగానే పరిగణించాలి. అలా అలవిమాలిన జాప్యం జరగనివ్వరాదన్న సత్సంకల్పంతో 'పోక్సో' కేసులన్నింటా శీఘ్రతర విచారణ చేపట్టాలని 2018లోనే సర్వోన్నత న్యాయస్థానం పిలుపిచ్చింది. అత్యాచార, పోక్సో కేసుల సత్వర పరిష్కరణ నిమిత్తం 1023 ఫాస్ట్‌ట్రాక్‌, ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయదలచినట్లు 2020 జనవరిలో కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటించింది. వాస్తవంలో, లైంగిక హింసాపీడితులు ఎందరో సహేతుక సత్వర న్యాయప్రదానానికి చకోరాలై నిరీక్షిస్తున్నారన్న కైలాస్‌ సత్యార్థి ఫౌండేషన్‌ తాజా అధ్యయనాంశాలు చాటుతున్నదేమిటి? పరిస్థితి ఎక్కడా గాడిన పడనే లేదని! నత్తలకు నడకలు నేర్పే ప్రస్తుత వేగంతో అపరిష్కృత పోక్సో కేసుల్ని చక్కబెట్టడానికి రాష్ట్రాలవారీగా కనీస వ్యవధి ఎంత పట్టనుందో లోగడే అంచనాలు వెలువడ్డాయి. ఆ గడువు మణిపూర్‌లో కనీసం 30 ఏళ్లు, గుజరాత్‌లో 53 ఏళ్లు, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 99 సంవత్సరాలన్న విశ్లేషణాత్మక కథనాలు- దేశంలో న్యాయ విచారణ ప్రక్రియ వేగం తీరుతెన్నులు ఎంత పరిహాసాస్పద స్థితికి చేరాయో చెప్పకనే చెబుతున్నాయి. ఈ దశలోనూ 'దీటుగా స్పందిస్తాం', 'బాధితుల కన్నీరు తుడుస్తాం', 'ఫలానా చర్యలు చేపడతా'మన్న మూస వాగ్దానాలకు పరిమితం కాకుండా- లైంగిక హింసోన్మాదం పెచ్చరిల్లిన చోట్ల ఆయా ప్రభుత్వాలు నైతిక బాధ్యత వహించడానికి సిద్ధపడాలి.

సంస్కార బీజాలు నాటాలి!

చట్టాలు వండివార్చడం, మందకొడి పోలీస్‌ విచారణల తంతును ఖండించడంతోనే ప్రజాప్రభుత్వాలు విధ్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించినట్లు కాదు. సామాజికంగా విలువల పతనానికి కారణమై, పశువాంఛను ప్రేరేపిస్తున్న అశ్లీల వెబ్‌సైట్లు, స్మార్ట్‌ ఫోన్లలో బూతు వీడియోల ఉరవడిపై ఉక్కుపాదం మోపాలి. ప్రాథమిక దశనుంచీ పాఠ్యపుస్తకాల్ని ప్రక్షాళించి బడి చదువుల్లోనే సంస్కార బీజాలు నాటే యత్నం ఊపందుకోవాలి. మత్తులో ముంచి సభ్యత సంస్కారాల పీక నులిమే మత్తు, మాదకద్రవ్యాల్నీ అరికట్టాలి. తమ వంతుగా తల్లిదండ్రులూ బిడ్డల నడతను, నడవడిని గమనిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మరింత కీలకం. ఉన్మాదానికి ఊపిరిపోస్తున్న అవ్యవస్థను తుత్తునియలు చేసే ఉమ్మడి బాధ్యతను అందరూ అందిపుచ్చుకొన్నప్పుడే- గుణాత్మక మార్పు మొదలవుతుంది. ఏమంటారు?

-బాలు

'ఇండియా అంటే నేరాలు అత్యాచారాలు తప్ప మరేమీ కాదన్నట్లుంది...'- మూడేళ్ల క్రితం బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలవి. అవెంత నికార్సయిన చేదు నిజాలో ప్రతిరోజూ రుజువవుతూనే ఉంది. పదేళ్ల కాలంలో చిన్న పిల్లలపై లైంగిక నేరాలు అయిదు రెట్లు పెరిగాయన్న అధ్యయనాలు, పసివారిని వేధించి అమానుషంగా హింసించే క్రౌర్యం భారతగడ్డపై పెచ్చరిల్లుతోందన్న 'యునిసెఫ్‌' విశ్లేషణలు- పైశాచికత్వ ప్రదర్శనలో అసాధారణ 'వృద్ధిరేటు'కు నిలువెత్తు దర్పణాలై వర్ధిల్లుతున్నాయి.

ఈ నెల ఎనిమిదో తేదీన యావద్భారతం ధూమ్‌ధామ్‌గా మహిళా దినోత్సవ సంబరాల్లో తలమునకలైన పావన దినంనాడు యూపీలోని కాన్పూర్‌ జిల్లాలో ఎంత ఘోరం జరిగిందో విన్నారా? ఓ పదమూడేళ్ల అమ్మాయి పశుగ్రాసం కోసం బయటకు వెళ్ళింది. మాటు వేసి ఉన్న మానవమృగాలు ఆ నిర్భాగ్యురాలిని ఎత్తుకుపోయాయి. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి తెగబడ్డాయి. 'ఇలా జరిగిందని ఎవరికైనా చెప్పావో... ఖబడ్దార్‌!' అని బెదిరించి అక్కడినుంచి ముగ్గురు యువకులూ ఉడాయించారు. నోర్మూసుకుని పడి ఉండకపోతే ఈసారి బహిరంగంగా బలాత్కరిస్తామని, 'గొప్ప' కుటుంబ నేపథ్యం కలిగిన తమను ఎవరూ ఏమీ చేయలేరని హెచ్చరించాక, అంతా సద్దుమణుగుతుందనుకున్న వాళ్ల అంచనా తప్పింది. తొమ్మిదో తేదీన పోలీస్‌ ఠాణాలో ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్‌ఐఆర్‌) నమోదైంది. తమ ఫర్మానాను బేఖాతరు చేసేసరికి రగిలిపోయిన యువకులు- ఆ కుటుంబానికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. పదో తేదీన బాధితురాలి తండ్రి ట్రక్కుకింద పడి రోడ్డు ప్రమాదంలో కడతేరిపోయాడు. పోలీస్‌ అధికారి కొడుకులిద్దరి ప్రమేయం కలిగిన కేసులో ఠాణా సిబ్బంది అలసత్వం, పిల్ల తండ్రిది క్రూరమైన హత్యేనంటూ మిన్నంటిన ఆందోళనల దృష్ట్యా- ఇద్దరు ఎస్సైలను, ఒక కానిస్టేబుల్‌ను విధులనుంచి సస్పెండ్‌ చేశారు. బతుకు మీద ఆశను, తండ్రి నీడను ఏకకాలంలో కోల్పోయిన ఆ నిస్సహాయురాలి జీవితం ఈ 'నిర్భయ భారతం'లో కడకు ఏ మలుపు తిరగనుందో ఏమో!

కొదవలేని ఉదంతాలు

పశువాంఛలు ప్రకోపించిన మానవమృగాల మదోన్మాదానికి లేడికూనలు, సంబంధీకులు విలవిల్లాడుతూ నేలకొరిగిన ఉదంతాలకు ఈ గడ్డమీద కొదవ లేదు. మొన్నీమధ్యే యూపీలోని హాథ్రస్‌లో ఏడేళ్ల బాలిక సామూహిక అత్యాచారం, దాన్ని వెన్నంటి పరమ కిరాతక హత్య ఎందరినో దిగ్భ్రాంతపరచాయి. ఇంచుమించు అదే సమయంలో ఫతేపూర్‌కు చెందిన ఇద్దరు దళిత మైనర్‌ అక్కాచెల్లెళ్లపై లైంగిక దాష్టీకానికి తెగబడి చంపేసి ఊరి చివరి చెరువులో పారేసిన ఘటన గగ్గోలు పుట్టించింది. తాము వేధిస్తుండగా పదహారేళ్ల బాలిక ప్రతిఘటించడాన్ని తట్టుకోలేక ఫిరోజాబాద్‌లో ముగ్గురు యువకులు ఆమెను అక్కడికక్కడే కాల్చి చంపేశారు. తాజాగా కాన్పూర్‌ ఘటనలో సామూహిక అత్యాచార నేరారోపణలపై భారత శిక్షా స్మృతి(ఐపీసీ) సెక్షన్‌ 376 కింద, పోక్సో(లైంగిక నేరాలనుంచి బాలల సంరక్షణకు ఉద్దేశించిన చట్టం) కింద ముగ్గురు నిందితులపై కేసులు పెట్టారు.

బాధితులకు న్యాయమేది?

కాన్పుర్‌ దురంతం బహిర్గతమైన సమయంలోనే, నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత కైలాస్‌ సత్యార్థి పేరిట నెలకొన్న ఫౌండేషన్‌ కొన్ని విస్మయపరచే వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. పోక్సో చట్టం కింద నమోదవుతున్న కేసులలో ఏటా సుమారు మూడు వేల దాకా సరైన విచారణకు నోచకుండానే మరుగున పడుతున్నాయని ఆ సంస్థ చెబుతోంది. జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) రికార్డుల ప్రకారమే అయిదింట రెండు పోక్సో కేసులు ఛార్జిషీట్‌ దశకు చేరకుండానే మూతపడుతున్నాయంటే- బాధితులకు దక్కుతున్న న్యాయమెంత, అనివార్యంగా దాపురిస్తున్న అన్యాయమెంత? 2016 నాటికి దేశంలో అపరిష్కృతంగా పోగుపడి ఉన్న పోక్సో కేసులు ఒక కొలిక్కి రావడానికి అధమపక్షం 20 సంవత్సరాలైనా పడుతుందని మూడేళ్ల క్రితం కైలాస్‌ సత్యార్థి లెక్కకట్టారు. వాటికి ఏటా కొత్తగా జమపడే కేసుల్ని జోడిస్తే చిన్న పిల్లలపై లైంగిక దాడుల కేసులు వారి వృద్ధాప్య దశలోనైనా పరిష్కరణకు నోచుకుంటాయో లేదో నికరంగా చెప్పగలవారెవరు?

నత్తలకు నడకలు నేర్పే వేగంతోనా?

నేరన్యాయ విచారణలో తీవ్ర జాప్యాన్ని న్యాయ నిరాకరణగానే పరిగణించాలి. అలా అలవిమాలిన జాప్యం జరగనివ్వరాదన్న సత్సంకల్పంతో 'పోక్సో' కేసులన్నింటా శీఘ్రతర విచారణ చేపట్టాలని 2018లోనే సర్వోన్నత న్యాయస్థానం పిలుపిచ్చింది. అత్యాచార, పోక్సో కేసుల సత్వర పరిష్కరణ నిమిత్తం 1023 ఫాస్ట్‌ట్రాక్‌, ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయదలచినట్లు 2020 జనవరిలో కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటించింది. వాస్తవంలో, లైంగిక హింసాపీడితులు ఎందరో సహేతుక సత్వర న్యాయప్రదానానికి చకోరాలై నిరీక్షిస్తున్నారన్న కైలాస్‌ సత్యార్థి ఫౌండేషన్‌ తాజా అధ్యయనాంశాలు చాటుతున్నదేమిటి? పరిస్థితి ఎక్కడా గాడిన పడనే లేదని! నత్తలకు నడకలు నేర్పే ప్రస్తుత వేగంతో అపరిష్కృత పోక్సో కేసుల్ని చక్కబెట్టడానికి రాష్ట్రాలవారీగా కనీస వ్యవధి ఎంత పట్టనుందో లోగడే అంచనాలు వెలువడ్డాయి. ఆ గడువు మణిపూర్‌లో కనీసం 30 ఏళ్లు, గుజరాత్‌లో 53 ఏళ్లు, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 99 సంవత్సరాలన్న విశ్లేషణాత్మక కథనాలు- దేశంలో న్యాయ విచారణ ప్రక్రియ వేగం తీరుతెన్నులు ఎంత పరిహాసాస్పద స్థితికి చేరాయో చెప్పకనే చెబుతున్నాయి. ఈ దశలోనూ 'దీటుగా స్పందిస్తాం', 'బాధితుల కన్నీరు తుడుస్తాం', 'ఫలానా చర్యలు చేపడతా'మన్న మూస వాగ్దానాలకు పరిమితం కాకుండా- లైంగిక హింసోన్మాదం పెచ్చరిల్లిన చోట్ల ఆయా ప్రభుత్వాలు నైతిక బాధ్యత వహించడానికి సిద్ధపడాలి.

సంస్కార బీజాలు నాటాలి!

చట్టాలు వండివార్చడం, మందకొడి పోలీస్‌ విచారణల తంతును ఖండించడంతోనే ప్రజాప్రభుత్వాలు విధ్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించినట్లు కాదు. సామాజికంగా విలువల పతనానికి కారణమై, పశువాంఛను ప్రేరేపిస్తున్న అశ్లీల వెబ్‌సైట్లు, స్మార్ట్‌ ఫోన్లలో బూతు వీడియోల ఉరవడిపై ఉక్కుపాదం మోపాలి. ప్రాథమిక దశనుంచీ పాఠ్యపుస్తకాల్ని ప్రక్షాళించి బడి చదువుల్లోనే సంస్కార బీజాలు నాటే యత్నం ఊపందుకోవాలి. మత్తులో ముంచి సభ్యత సంస్కారాల పీక నులిమే మత్తు, మాదకద్రవ్యాల్నీ అరికట్టాలి. తమ వంతుగా తల్లిదండ్రులూ బిడ్డల నడతను, నడవడిని గమనిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మరింత కీలకం. ఉన్మాదానికి ఊపిరిపోస్తున్న అవ్యవస్థను తుత్తునియలు చేసే ఉమ్మడి బాధ్యతను అందరూ అందిపుచ్చుకొన్నప్పుడే- గుణాత్మక మార్పు మొదలవుతుంది. ఏమంటారు?

-బాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.