ETV Bharat / opinion

విధేయతకేనా వీరతాళ్లు.. చేజారుతున్న యువనేతలు

author img

By

Published : Jul 16, 2020, 7:54 AM IST

2013 నాటి రాజస్థాన్‌ అసెంబ్లీ ఫలితాల్లో అశోక్‌ గెహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని భాజపా 45.5 శాతం ఓట్లు, రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా 163 సీట్లతో దారుణ భంగపాటుకు గురిచేసింది. ఆ పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుడిగా నియుక్తుడైన సచిన్.. విస్తృత పర్యటనలతో పార్టీకి కొత్త ఊపిరులూదబట్టే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధారణ మెజారిటీరి చేరువై ఏకైక పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. మధ్యప్రదేశ్‌లో పరిస్థితి వికటించడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానమే జవాబుదారీ. మొన్న మార్చిలో యువనేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుకు పూర్వరంగం రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది కాదు. రాష్ట్ర స్థాయిలో నేతాగణాల మధ్య వైరుధ్యాలు వైషమ్యాలుగా దిగజారకుండా జాగ్రత్తగా కాచుకోవాల్సిన అధిష్ఠానం.. ఉండీ లేనట్లుగా వెలగబెడుతున్న నిర్వాకమే స్వయంకృత సంక్షోభాలకు అంటుకడుతోంది!

congress losing young leaders
విధేయతకేనా వీరతాళ్లు? చేజారుతున్న యువనేతలు

'పార్టీ రుణం తీర్చుకోవాల్సిన రోజు ఇది. 26 ఏళ్లకే పార్లమెంటు సభ్యుణ్ని, 30 ఏళ్లకే కేంద్రమంత్రిని, 35 ఏళ్లకే ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుణ్ని చేసి కాంగ్రెస్‌ పార్టీ నాకెంతో ఇచ్చింది' 2018 డిసెంబరులో సచిన్‌ పైలట్‌ నోట జాలువారిన మాటలివి. 'ముఖ్యమంత్రి పీఠాన్ని అశోక్‌ గెహ్లోత్‌కు వదిలేయాలి... మన స్నేహం కోసం ఈ పని చెయ్యాలి' అని ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ గట్టిగా కోరడంతో సచిన్‌ పైలట్‌ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పట్టుమని 42 ఏళ్ల వయసులోనే సీఎం కుర్చీ కోసం ఆవురావురుమంటున్నాడని సచిన్‌ పైలట్‌పై విమర్శలు రువ్వేవారు 2013నాటి రాజస్థాన్‌ అసెంబ్లీ ఫలితాల్ని గమనించాలి. నాడు అశోక్‌ గెహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని భాజపా 45.5శాతం ఓట్లు, రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా 163 సీట్లతో దారుణ భంగపాటుకు గురిచేసింది. పట్టుమని పాతిక స్థానాలైనా చేజిక్కించుకోలేక కాంగ్రెస్‌ చావుదెబ్బ తిన్న రోజులవి. ఆ పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుడిగా నియుక్తుడైన సచిన్.. విస్తృత పర్యటనలతో పార్టీకి కొత్త ఊపిరులూదబట్టే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధారణ మెజారిటీకి చేరువగా, ఏకైక పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. సోనియా కుటుంబంతో మూడుతరాల అనుబంధం ముడివేసుకున్న అశోక్‌ గెహ్లోత్‌కు సీనియారిటీ, రాజకీయ అనుభవం అర్హతలుగా మరోమారు ముఖ్యమంత్రి పీఠం దక్కింది. 2019నాటి సార్వత్రిక సమరంలో రాజస్థాన్‌లోని మొత్తం పాతిక ఎంపీ సీట్లూ గుండుగుత్తగా భాజపా పరం కావడంతో పరస్పర నిందలతో మొదలైన విభేదాలు.. తాజా సంక్షోభానికి బీజాలు వేశాయి. రాజస్థాన్‌లో నేడు భగ్గుమన్నవి కూటముల కుంపట్లుగా స్థూల దృష్టికి కనిపించవచ్చు గాక.. తరాల అంతరాలు రాజేసిన కొత్త కార్చిచ్చు అది!

స్వయంకృత సంక్షోభాలు

'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌' అంటూ కమలనాథులు రువ్విన రాజకీయ సవాళ్లను దీటుగా ఎదుర్కోలేక కళ్లు తేలేస్తూ వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి 2018లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ల ఫలితాలు ఆత్మవిశ్వాసం కలిగించాయి. తాగనేర్వని పిల్లి బోర్లా పోసుకొన్న చందంగా మధ్యప్రదేశ్‌లో పరిస్థితి వికటించడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానమే జవాబుదారీ. మొన్న మార్చిలో యువనేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుకు పూర్వరంగం రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది కాదు. సింధియాకు పీసీసీ పీఠాధిపత్యాన్ని నిరాకరించడమే కాకుండా, రాజ్యసభ సభ్యత్వానికీ మోకాలడ్డు పెట్టబట్టే అసమ్మతి ప్రజ్వరిల్లి అక్కడ ప్రభుత్వమే మూటాముల్లె సర్దుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర స్థాయిలో నేతాగణాల మధ్య వైరుధ్యాలు వైషమ్యాలుగా దిగజారకుండా జాగ్రత్తగా కాచుకోవాల్సిన అధిష్ఠానం.. ఉండీ లేనట్లుగా వెలగబెడుతున్న నిర్వాకమే స్వయంకృత సంక్షోభాలకు అంటుకడుతోంది!

నాలుగు దశాబ్దాల క్రితం 34 ఏళ్ల వయసులో తొలిసారి ఎంపీ అయిన కమల్‌నాథ్‌, తొమ్మిది పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన అపార అనుభవం ఉండీ.. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కావడానికి తనకు 72 ఏళ్ల వయసు వచ్చేదాకా నిరీక్షించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి పీఠం కోసం అధిష్ఠానాన్ని ఎప్పుడూ బ్లాక్‌మెయిల్‌ చెయ్యనే లేదు... ఆ తరహా విశ్వసనీయతే కొత్త తరం నేతల్లో కరవవుతోందన్న విమర్శలు ధాటిగా వస్తున్నాయి. సమర్థత కన్నా అధిష్ఠానం పట్ల అంధ విధేయతే ప్రధాన అర్హతగా పదవీ సంతర్పణలు చేసే సంప్రదాయానికి ఇందిర జమానాలో బీజావాపనం జరిగింది. కాంగ్రెసులో ఆనువంశిక అధిష్ఠాన నాయకత్వ సామర్థ్యమే సందేహాస్పదమై ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ పుట్టి మునుగుతున్న వేళ.. ఏ కొందరు నేతలో ఏటికెదురీది పార్టీ నావను ఒడ్డుకు చేర్చినా వాళ్లను కాదని విధేయస్వామ్యానికే వీరతాళ్లు వేసే ధోరణి రాజకీయ సంక్షోభాలకు అంటుకట్టడంలో వింతేముంది? రాష్ట్రస్థాయి నాయకుల ఎంపికలో కేంద్ర నాయకత్వానికి కొన్ని విలక్షణ ప్రాతిపదికలు, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండవచ్ఛు హరియాణాలో మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, ఝార్ఖండ్‌లో రఘువర్‌ దాస్‌, మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్‌, ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర సింగ్‌ రావత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో జైరామ్‌ఠాకుర్‌లను కీలక స్థానాలకు మోదీ-షా ద్వయం ఎంపిక చేయడంలో... సీనియారిటీ, సామర్థ్యాలు గీటురాళ్లు కాలేదు. స్వయంగా సర్వశక్తిమంతమై పార్టీని విజయపథంలో నడిపించే అధిష్ఠానం ఏం చేసినా చెల్లుబాటు అయ్యే సమకాలీన రాజకీయాల్లో కాంగ్రెస్‌ సంస్థాగత బలహీనతలే సంక్షోభాలై ఎగసిపడుతున్నాయిప్పుడు!

ప్రత్యర్థికి లాభిస్తున్న బలహీనతలు

రాజస్థాన్‌లో మధ్యప్రదేశ్‌ తరహా రాజకీయం సుడులు తిరుగుతోందని, 30మంది అనుయాయులతో సహా సచిన్‌ పైలట్‌ భాజపా తీర్థం పుచ్చుకొంటే, అశోక్‌ గెహ్లోత్‌ సర్కారు కుప్పకూలక తప్పదనీ విశ్లేషణలు వెలువడ్డాయి. శాసనసభా పక్షంలో తనను, తనవారిని తక్కువ చేస్తున్నారని ఆక్రోశించిన సచిన్‌ పైలట్‌ తాను కమలం గూటికి చేరేది లేదంటున్నారు. అధిష్ఠానం దూతలకు సచిన్‌ పైలట్‌ పెట్టిన మూడు షరతుల్లో మొట్టమొదటిది- 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించాలన్నది. ఆ తరహా షరతులకు సరేనంటే, బ్లాక్‌ మెయిల్‌కు తలొగ్గినట్లవుతుందన్న వైఖరితో గట్టిగా వ్యవహరించిన అధిష్ఠానం సచిన్‌ పదవుల్ని ఊడబెరికింది. మరోవంక పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చే అవకాశం కోసం భాజపా కాచుకొని ఉంది!

రాహుల్‌ హయాములో సమధిక ప్రాధాన్యం దక్కించుకొన్న యువనేతలు జ్యోతిరాదిత్య, అశోక్‌ తన్వర్‌, అజోయ్‌ కుమార్‌, ప్రద్యోత్‌ మాణిక్య వంటివారు కాంగ్రెస్‌ను వీడిపోయారు. మిలింద్‌ దేవరా, జతిన్‌ ప్రసాద్‌ వంటివారు నిస్పృహలో కూరుకుపోయారు.370 అధికరణ రద్దు మీద కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ జరిగితే, జనాభిప్రాయం దానికి అనుకూలంగానే ఉందంటూ యువనేతలంతా భిన్నగళంతో స్పందించడం గమనార్హం. పాతికమంది సభ్యుల సీడబ్ల్యూసీలో 75 ఏళ్లు పైబడినవారు ఏడుగురు ఉన్న కాంగ్రెస్‌.. సంస్థాగత సంస్కరణల్ని చేపట్టే చేవలేక కుదేలవుతోంది. యువనేతల్నీ కాలదన్నుకొనే స్థాయి బలహీనతలతో ప్రత్యర్థి భాజపాకు మరింత బలాన్ని తానే సమకూరుస్తోంది!

- శైలజా చంద్ర

'పార్టీ రుణం తీర్చుకోవాల్సిన రోజు ఇది. 26 ఏళ్లకే పార్లమెంటు సభ్యుణ్ని, 30 ఏళ్లకే కేంద్రమంత్రిని, 35 ఏళ్లకే ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుణ్ని చేసి కాంగ్రెస్‌ పార్టీ నాకెంతో ఇచ్చింది' 2018 డిసెంబరులో సచిన్‌ పైలట్‌ నోట జాలువారిన మాటలివి. 'ముఖ్యమంత్రి పీఠాన్ని అశోక్‌ గెహ్లోత్‌కు వదిలేయాలి... మన స్నేహం కోసం ఈ పని చెయ్యాలి' అని ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ గట్టిగా కోరడంతో సచిన్‌ పైలట్‌ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పట్టుమని 42 ఏళ్ల వయసులోనే సీఎం కుర్చీ కోసం ఆవురావురుమంటున్నాడని సచిన్‌ పైలట్‌పై విమర్శలు రువ్వేవారు 2013నాటి రాజస్థాన్‌ అసెంబ్లీ ఫలితాల్ని గమనించాలి. నాడు అశోక్‌ గెహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని భాజపా 45.5శాతం ఓట్లు, రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా 163 సీట్లతో దారుణ భంగపాటుకు గురిచేసింది. పట్టుమని పాతిక స్థానాలైనా చేజిక్కించుకోలేక కాంగ్రెస్‌ చావుదెబ్బ తిన్న రోజులవి. ఆ పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుడిగా నియుక్తుడైన సచిన్.. విస్తృత పర్యటనలతో పార్టీకి కొత్త ఊపిరులూదబట్టే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధారణ మెజారిటీకి చేరువగా, ఏకైక పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. సోనియా కుటుంబంతో మూడుతరాల అనుబంధం ముడివేసుకున్న అశోక్‌ గెహ్లోత్‌కు సీనియారిటీ, రాజకీయ అనుభవం అర్హతలుగా మరోమారు ముఖ్యమంత్రి పీఠం దక్కింది. 2019నాటి సార్వత్రిక సమరంలో రాజస్థాన్‌లోని మొత్తం పాతిక ఎంపీ సీట్లూ గుండుగుత్తగా భాజపా పరం కావడంతో పరస్పర నిందలతో మొదలైన విభేదాలు.. తాజా సంక్షోభానికి బీజాలు వేశాయి. రాజస్థాన్‌లో నేడు భగ్గుమన్నవి కూటముల కుంపట్లుగా స్థూల దృష్టికి కనిపించవచ్చు గాక.. తరాల అంతరాలు రాజేసిన కొత్త కార్చిచ్చు అది!

స్వయంకృత సంక్షోభాలు

'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌' అంటూ కమలనాథులు రువ్విన రాజకీయ సవాళ్లను దీటుగా ఎదుర్కోలేక కళ్లు తేలేస్తూ వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి 2018లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ల ఫలితాలు ఆత్మవిశ్వాసం కలిగించాయి. తాగనేర్వని పిల్లి బోర్లా పోసుకొన్న చందంగా మధ్యప్రదేశ్‌లో పరిస్థితి వికటించడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానమే జవాబుదారీ. మొన్న మార్చిలో యువనేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుకు పూర్వరంగం రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది కాదు. సింధియాకు పీసీసీ పీఠాధిపత్యాన్ని నిరాకరించడమే కాకుండా, రాజ్యసభ సభ్యత్వానికీ మోకాలడ్డు పెట్టబట్టే అసమ్మతి ప్రజ్వరిల్లి అక్కడ ప్రభుత్వమే మూటాముల్లె సర్దుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర స్థాయిలో నేతాగణాల మధ్య వైరుధ్యాలు వైషమ్యాలుగా దిగజారకుండా జాగ్రత్తగా కాచుకోవాల్సిన అధిష్ఠానం.. ఉండీ లేనట్లుగా వెలగబెడుతున్న నిర్వాకమే స్వయంకృత సంక్షోభాలకు అంటుకడుతోంది!

నాలుగు దశాబ్దాల క్రితం 34 ఏళ్ల వయసులో తొలిసారి ఎంపీ అయిన కమల్‌నాథ్‌, తొమ్మిది పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన అపార అనుభవం ఉండీ.. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కావడానికి తనకు 72 ఏళ్ల వయసు వచ్చేదాకా నిరీక్షించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి పీఠం కోసం అధిష్ఠానాన్ని ఎప్పుడూ బ్లాక్‌మెయిల్‌ చెయ్యనే లేదు... ఆ తరహా విశ్వసనీయతే కొత్త తరం నేతల్లో కరవవుతోందన్న విమర్శలు ధాటిగా వస్తున్నాయి. సమర్థత కన్నా అధిష్ఠానం పట్ల అంధ విధేయతే ప్రధాన అర్హతగా పదవీ సంతర్పణలు చేసే సంప్రదాయానికి ఇందిర జమానాలో బీజావాపనం జరిగింది. కాంగ్రెసులో ఆనువంశిక అధిష్ఠాన నాయకత్వ సామర్థ్యమే సందేహాస్పదమై ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ పుట్టి మునుగుతున్న వేళ.. ఏ కొందరు నేతలో ఏటికెదురీది పార్టీ నావను ఒడ్డుకు చేర్చినా వాళ్లను కాదని విధేయస్వామ్యానికే వీరతాళ్లు వేసే ధోరణి రాజకీయ సంక్షోభాలకు అంటుకట్టడంలో వింతేముంది? రాష్ట్రస్థాయి నాయకుల ఎంపికలో కేంద్ర నాయకత్వానికి కొన్ని విలక్షణ ప్రాతిపదికలు, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండవచ్ఛు హరియాణాలో మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, ఝార్ఖండ్‌లో రఘువర్‌ దాస్‌, మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్‌, ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర సింగ్‌ రావత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో జైరామ్‌ఠాకుర్‌లను కీలక స్థానాలకు మోదీ-షా ద్వయం ఎంపిక చేయడంలో... సీనియారిటీ, సామర్థ్యాలు గీటురాళ్లు కాలేదు. స్వయంగా సర్వశక్తిమంతమై పార్టీని విజయపథంలో నడిపించే అధిష్ఠానం ఏం చేసినా చెల్లుబాటు అయ్యే సమకాలీన రాజకీయాల్లో కాంగ్రెస్‌ సంస్థాగత బలహీనతలే సంక్షోభాలై ఎగసిపడుతున్నాయిప్పుడు!

ప్రత్యర్థికి లాభిస్తున్న బలహీనతలు

రాజస్థాన్‌లో మధ్యప్రదేశ్‌ తరహా రాజకీయం సుడులు తిరుగుతోందని, 30మంది అనుయాయులతో సహా సచిన్‌ పైలట్‌ భాజపా తీర్థం పుచ్చుకొంటే, అశోక్‌ గెహ్లోత్‌ సర్కారు కుప్పకూలక తప్పదనీ విశ్లేషణలు వెలువడ్డాయి. శాసనసభా పక్షంలో తనను, తనవారిని తక్కువ చేస్తున్నారని ఆక్రోశించిన సచిన్‌ పైలట్‌ తాను కమలం గూటికి చేరేది లేదంటున్నారు. అధిష్ఠానం దూతలకు సచిన్‌ పైలట్‌ పెట్టిన మూడు షరతుల్లో మొట్టమొదటిది- 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించాలన్నది. ఆ తరహా షరతులకు సరేనంటే, బ్లాక్‌ మెయిల్‌కు తలొగ్గినట్లవుతుందన్న వైఖరితో గట్టిగా వ్యవహరించిన అధిష్ఠానం సచిన్‌ పదవుల్ని ఊడబెరికింది. మరోవంక పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చే అవకాశం కోసం భాజపా కాచుకొని ఉంది!

రాహుల్‌ హయాములో సమధిక ప్రాధాన్యం దక్కించుకొన్న యువనేతలు జ్యోతిరాదిత్య, అశోక్‌ తన్వర్‌, అజోయ్‌ కుమార్‌, ప్రద్యోత్‌ మాణిక్య వంటివారు కాంగ్రెస్‌ను వీడిపోయారు. మిలింద్‌ దేవరా, జతిన్‌ ప్రసాద్‌ వంటివారు నిస్పృహలో కూరుకుపోయారు.370 అధికరణ రద్దు మీద కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ జరిగితే, జనాభిప్రాయం దానికి అనుకూలంగానే ఉందంటూ యువనేతలంతా భిన్నగళంతో స్పందించడం గమనార్హం. పాతికమంది సభ్యుల సీడబ్ల్యూసీలో 75 ఏళ్లు పైబడినవారు ఏడుగురు ఉన్న కాంగ్రెస్‌.. సంస్థాగత సంస్కరణల్ని చేపట్టే చేవలేక కుదేలవుతోంది. యువనేతల్నీ కాలదన్నుకొనే స్థాయి బలహీనతలతో ప్రత్యర్థి భాజపాకు మరింత బలాన్ని తానే సమకూరుస్తోంది!

- శైలజా చంద్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.