ETV Bharat / opinion

కొవిడ్‌ కల్లోలంలో బర్డ్‌ ఫ్లూ కలకలం

కరోనా మహమ్మారితో ఇప్పటికే దేశం అతలాకుతలమై అల్లాడుతుంటే.. బర్డ్​ ఫ్లూ కోరలు చాస్తూ.. పౌల్ట్రీ పరిశ్రమకు పెనుసవాళ్లు విసురుతోంది. 15 ఏళ్ల క్రితమే దేశంలోకి విస్తరించిన ఈ వైరస్.. ఇప్పటికే 28సార్లు పంజా విసిరింది.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా బర్డ్​ ఫ్లూతో 4 రాష్ట్రాల పరిధిలో వేలాదిగా పక్షులు మృత్యువాతపడ్డాయి. రాజస్థాన్​, మధ్యప్రదేశ్​లో కాకులు.. హిమాచల్​ ప్రదేశ్​, కేరళల్లో బాతులు ఎక్కువగా చనిపోయాయి. ఈ నేపథ్యంలో కోళ్ల రైతులు, వ్యాపార వర్గాల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ గురించి అవగాహన పెంచడం సహా.. వైరస్‌ నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

author img

By

Published : Jan 7, 2021, 7:15 AM IST

BIRD FLU VIRUS
కొవిడ్‌ కల్లోలంలో బర్డ్‌ ఫ్లూ కలకలం

భారత్‌లో పౌల్ట్రీ పరిశ్రమకు బర్డ్‌ ఫ్లూ వ్యాధి పెనుసవాళ్లు విసరుతోంది. తొలిసారిగా 2006లో ఇండియాలోకి ప్రవేశించిన బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ఇప్పటివరకు 28 సార్లు కోర సాచింది. అయినా, దేశంలోని పౌల్ట్రీ పరిశ్రమ తట్టుకుని నిలబడగలిగింది. తాజాగా మరోసారి నాలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్‌ కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా ఆకాశంలో ఎగురుతున్న కాకులు, పావురాలు, నెమళ్లు అకస్మాత్తుగా కింద పడిపోయి మృతి చెందడంపై మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఆందోళన వ్యక్తమవుతోంది. చనిపోయిన పక్షుల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ఉన్నట్లు అధికార వర్గాలు నిర్ధారించాయి. అనంతరం ఈ వైరస్‌ మరో రెండు రాష్ట్రాలకు వ్యాపించింది. కేరళలోని కొట్టాయం, అలప్పుజా పరిసరాల్లో వేల సంఖ్యలో బాతులు వైరస్‌తో మృతి చెందాయి. వైరస్‌ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కనీసం 36వేల కోళ్లను, 12వేల బాతులను ఉత్పత్తిదారులు వధిస్తున్నారు.

ఓవైపు కరోనా- మరోవైపు బర్డ్ ​ఫ్లూ..

హిమాచల్‌ ప్రదేశ్‌లోని పాంగ్‌ జలాశయం సమీపంలో సుమారు 2,500 వలస పక్షులు మృతి చెందడం కలకలం రేపింది. అక్కడి చిత్తడి నేలల్లో వాటి కళేబరాలను కనుక్కున్నారు. వాటి శరీరాల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ఉన్నట్లు నిర్ధారించారు. చనిపోయినవాటిలో అరుదైన పక్షిజాతులూ ఉన్నట్లు నిపుణులు తేల్చారు. హరియాణాలో ఫారాల్లోని లక్షలాది కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అందుకు బర్డ్‌ఫ్లూ వైరసే కారణమా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కొవిడ్‌ తీవ్రంగా కలవరపెడుతున్న వేళ- బర్డ్‌ ఫ్లూ వైరస్‌ వ్యాప్తి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఈ ఉదంతాల్లో బర్డ్‌ ఫ్లూ లోని రెండు స్ట్రెయిన్‌లు (హెచ్‌5ఎన్‌1, హెచ్‌5ఎన్‌8) ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

అదే కాస్త ఉపశమనం..

వైరస్‌ సోకిన కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల నుంచి మనుషులకు ఈ వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉంది. అందువల్ల బర్డ్‌ ఫ్లూ వెలుగు చూసిన వెంటనే సంబంధిత ప్రాంతాల్లో నివారణ చర్యల ద్వారా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడం తక్షణం జరగాల్సిన ప్రక్రియ. కరోనా వైరస్‌లాగా బర్డ్‌ ఫ్లూ వైరస్‌ మనిషి నుంచి మనిషికి సోకదు. ఇది కాస్త ఊరట కలిగించే విషయం. కోడి మాంసాన్ని తినేముందు బాగా ఉడకబెట్టడం మన దేశంలో ఓ అలవాటు. అధిక ఉష్ణోగ్రతలో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ నిర్వీర్యం అవుతుందని, అందువల్ల మన దేశంలో ఇది కోడి మాంసం ద్వారా మనుషులకు సోకే అవకాశం తక్కువేనని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

కష్టసాధ్యంగా మారిన టీకా..

దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా బర్డ్‌ ఫ్లూ వైరస్‌ విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ యానిమల్‌ హెల్త్‌ (ఓఐఈ) సమాచారం ప్రకారం 2014లో 26 దేశాలను చుట్టుముట్టిన ఈ వైరస్‌ 2015లో 39 దేశాలకు పాకింది. తరచూ మార్పులు చెందుతుండటం వల్ల బర్డ్‌ ఫ్లూ వైరస్‌కు టీకా కనిపెట్టడం కష్టసాధ్యంగా మారింది. ఈ వైరస్‌ భారత్‌లో తొలిసారిగా 2006 మార్చిలో వ్యాపించింది. మహారాష్ట్రలోని నవపూర్‌ అనే గ్రామంలో వెలుగుచూసిన వైరస్‌- అనంతరం పలు ప్రాంతాలకు వ్యాపించింది. అనంతరం 2008లోనూ వైరస్‌ వ్యాప్తి సంభవించింది. తరవాత దేశవ్యాప్తంగా ఏదో ఒక రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ తలెత్తుతూనే ఉంది. భారత్‌లోకి ఈ వైరస్‌ ప్రవేశించిన తరవాత ఇప్పటివరకు 72 లక్షలకు పైగా కోళ్లను వధించారు.

నియంత్రణ చర్యలే మార్గాలు..

కేంద్రం, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటివరకు కోళ్ల రైతులకు రూ.24 కోట్లకు పైగా పరిహారం కింద చెల్లించాయి. సంసిద్ధత, నిఘా, నియంత్రణ చర్యలే బర్డ్‌ ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునే ప్రధాన సాధనాలు. దేశంలో కోడిమాంసం వినియోగం పెరుగుతోంది. పౌల్ట్రీ ఫారాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పరిస్థితులపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలి. టోకు, చిల్లర మాంసం దుకాణాలపై నిరంతర నిఘా అవసరం. వుహాన్‌లో కరోనా వైరస్‌ అక్కడి జంతుమాంస మార్కెట్ల ద్వారానే వ్యాపించినట్లు నిపుణులు పేర్కొనడం గమనార్హం. అందుకే పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలి. వైరస్‌ను నిర్ధారించే ప్రయోగశాలల్ని విస్తృతంగా ఏర్పాటు చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా కోళ్ల రైతులు, వ్యాపార వర్గాల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ గురించి అవగాహన పెంచాలి. వైరస్‌ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు పాటించాలో, వ్యాధి వ్యాపించినప్పుడు ఎలా వ్యవహరించాలో అందరికీ తెలియజేయాలి. దీనివల్ల బర్డ్‌ ఫ్లూను సమర్థంగా ఎదుర్కోగలం!

- నీలి ఆకాశ్‌, రచయిత

ఇదీ చదవండి: 'వలస పక్షులతోనే బర్డ్ ​ఫ్లూ- అప్రమత్తంగా కేంద్రం'

భారత్‌లో పౌల్ట్రీ పరిశ్రమకు బర్డ్‌ ఫ్లూ వ్యాధి పెనుసవాళ్లు విసరుతోంది. తొలిసారిగా 2006లో ఇండియాలోకి ప్రవేశించిన బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ఇప్పటివరకు 28 సార్లు కోర సాచింది. అయినా, దేశంలోని పౌల్ట్రీ పరిశ్రమ తట్టుకుని నిలబడగలిగింది. తాజాగా మరోసారి నాలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్‌ కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా ఆకాశంలో ఎగురుతున్న కాకులు, పావురాలు, నెమళ్లు అకస్మాత్తుగా కింద పడిపోయి మృతి చెందడంపై మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఆందోళన వ్యక్తమవుతోంది. చనిపోయిన పక్షుల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ఉన్నట్లు అధికార వర్గాలు నిర్ధారించాయి. అనంతరం ఈ వైరస్‌ మరో రెండు రాష్ట్రాలకు వ్యాపించింది. కేరళలోని కొట్టాయం, అలప్పుజా పరిసరాల్లో వేల సంఖ్యలో బాతులు వైరస్‌తో మృతి చెందాయి. వైరస్‌ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కనీసం 36వేల కోళ్లను, 12వేల బాతులను ఉత్పత్తిదారులు వధిస్తున్నారు.

ఓవైపు కరోనా- మరోవైపు బర్డ్ ​ఫ్లూ..

హిమాచల్‌ ప్రదేశ్‌లోని పాంగ్‌ జలాశయం సమీపంలో సుమారు 2,500 వలస పక్షులు మృతి చెందడం కలకలం రేపింది. అక్కడి చిత్తడి నేలల్లో వాటి కళేబరాలను కనుక్కున్నారు. వాటి శరీరాల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ఉన్నట్లు నిర్ధారించారు. చనిపోయినవాటిలో అరుదైన పక్షిజాతులూ ఉన్నట్లు నిపుణులు తేల్చారు. హరియాణాలో ఫారాల్లోని లక్షలాది కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అందుకు బర్డ్‌ఫ్లూ వైరసే కారణమా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కొవిడ్‌ తీవ్రంగా కలవరపెడుతున్న వేళ- బర్డ్‌ ఫ్లూ వైరస్‌ వ్యాప్తి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఈ ఉదంతాల్లో బర్డ్‌ ఫ్లూ లోని రెండు స్ట్రెయిన్‌లు (హెచ్‌5ఎన్‌1, హెచ్‌5ఎన్‌8) ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

అదే కాస్త ఉపశమనం..

వైరస్‌ సోకిన కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల నుంచి మనుషులకు ఈ వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉంది. అందువల్ల బర్డ్‌ ఫ్లూ వెలుగు చూసిన వెంటనే సంబంధిత ప్రాంతాల్లో నివారణ చర్యల ద్వారా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడం తక్షణం జరగాల్సిన ప్రక్రియ. కరోనా వైరస్‌లాగా బర్డ్‌ ఫ్లూ వైరస్‌ మనిషి నుంచి మనిషికి సోకదు. ఇది కాస్త ఊరట కలిగించే విషయం. కోడి మాంసాన్ని తినేముందు బాగా ఉడకబెట్టడం మన దేశంలో ఓ అలవాటు. అధిక ఉష్ణోగ్రతలో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ నిర్వీర్యం అవుతుందని, అందువల్ల మన దేశంలో ఇది కోడి మాంసం ద్వారా మనుషులకు సోకే అవకాశం తక్కువేనని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

కష్టసాధ్యంగా మారిన టీకా..

దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా బర్డ్‌ ఫ్లూ వైరస్‌ విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ యానిమల్‌ హెల్త్‌ (ఓఐఈ) సమాచారం ప్రకారం 2014లో 26 దేశాలను చుట్టుముట్టిన ఈ వైరస్‌ 2015లో 39 దేశాలకు పాకింది. తరచూ మార్పులు చెందుతుండటం వల్ల బర్డ్‌ ఫ్లూ వైరస్‌కు టీకా కనిపెట్టడం కష్టసాధ్యంగా మారింది. ఈ వైరస్‌ భారత్‌లో తొలిసారిగా 2006 మార్చిలో వ్యాపించింది. మహారాష్ట్రలోని నవపూర్‌ అనే గ్రామంలో వెలుగుచూసిన వైరస్‌- అనంతరం పలు ప్రాంతాలకు వ్యాపించింది. అనంతరం 2008లోనూ వైరస్‌ వ్యాప్తి సంభవించింది. తరవాత దేశవ్యాప్తంగా ఏదో ఒక రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ తలెత్తుతూనే ఉంది. భారత్‌లోకి ఈ వైరస్‌ ప్రవేశించిన తరవాత ఇప్పటివరకు 72 లక్షలకు పైగా కోళ్లను వధించారు.

నియంత్రణ చర్యలే మార్గాలు..

కేంద్రం, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటివరకు కోళ్ల రైతులకు రూ.24 కోట్లకు పైగా పరిహారం కింద చెల్లించాయి. సంసిద్ధత, నిఘా, నియంత్రణ చర్యలే బర్డ్‌ ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునే ప్రధాన సాధనాలు. దేశంలో కోడిమాంసం వినియోగం పెరుగుతోంది. పౌల్ట్రీ ఫారాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పరిస్థితులపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలి. టోకు, చిల్లర మాంసం దుకాణాలపై నిరంతర నిఘా అవసరం. వుహాన్‌లో కరోనా వైరస్‌ అక్కడి జంతుమాంస మార్కెట్ల ద్వారానే వ్యాపించినట్లు నిపుణులు పేర్కొనడం గమనార్హం. అందుకే పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలి. వైరస్‌ను నిర్ధారించే ప్రయోగశాలల్ని విస్తృతంగా ఏర్పాటు చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా కోళ్ల రైతులు, వ్యాపార వర్గాల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ గురించి అవగాహన పెంచాలి. వైరస్‌ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు పాటించాలో, వ్యాధి వ్యాపించినప్పుడు ఎలా వ్యవహరించాలో అందరికీ తెలియజేయాలి. దీనివల్ల బర్డ్‌ ఫ్లూను సమర్థంగా ఎదుర్కోగలం!

- నీలి ఆకాశ్‌, రచయిత

ఇదీ చదవండి: 'వలస పక్షులతోనే బర్డ్ ​ఫ్లూ- అప్రమత్తంగా కేంద్రం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.