ETV Bharat / opinion

డోపింగ్​ ఆరోపణలతో క్రీడల్లో నైతిక పతనం

author img

By

Published : Jun 12, 2020, 7:52 AM IST

నిజాయితీతో పోరాడి గెలుపు సొంతం చేసుకోవాల్సిన ఆటగాళ్లు.. మెరుగ్గా ప్రదర్శన ఇవ్వడం కోసం ఉత్ప్రేరక పదార్థాలు ఉపయోగిస్తున్న ఉదంతాలు దేశదేశాల్లో పెరిగిపోతోంది. మన దేశంలోనూ ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటీవలి కాలంలో దేశీయంగా ఎంతోమంది క్రీడాకారులు డోపింగ్​ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే, అథ్లెట్లను జాగృతపరిచి.. దేశంలో ఏ క్రీడకూ వివాదాల మకిలంటకుండా కాచుకోవాల్సిన మౌలిక లక్ష్యసాధనలో 'నాడా' చురుగ్గా వ్యవహరించాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

sports doping
క్రీడల్లో డోపింగ్​

సహజసిద్ధమైన నేర్పుతో నిజాయతీగా పోటీపడటం, ఓడినా కడకంటా బాగా ఆడారనిపించుకోవడానికి పాటుపడటం- కల్మషం అంటని క్రీడా ప్రతిభ. ఓటమిని హుందాగా స్వీకరించడమే, సిసలైన క్రీడాస్ఫూర్తికి చిరునామా! ఆ లక్షణాల్ని తోసిరాజని- అవతలివారిపై అనైతిక ఆధిక్య సాధనను లక్షించి, ఆటలో అనూహ్యస్థాయి పాటవ ప్రదర్శనకోసం నిషేధిత ఉత్ప్రేరక పదార్థాల వాడకం (డోపింగ్‌) దేశదేశాల్లో కొన్నేళ్లుగా పెచ్చరిల్లుతోంది. దురదృష్టవశాత్తు, దేశీయంగానూ అటువంటి ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రెండున్నరేళ్లుగా డోపింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజితా చానుపై ఎటువంటి చర్యలూ తీసుకోబోవడం లేదన్న అంతర్జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) తాజా ప్రకటన, ఉపశమనం కలిగిస్తోంది. మరోవైపు- దోహా ఆసియా ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో 800 మీటర్ల స్వర్ణపతక విజేత గోమతీ మారిముత్తుపై ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నాలుగేళ్ల నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం నిశ్చేష్టపరుస్తోంది.

జాబితాలో వారి పేర్లు..

తనవంతుగా నాడా (జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ) అమృత్‌పాల్‌ సింగ్‌ (బాస్కెట్‌బాల్‌), నీరజ్‌ ఫొగట్‌(బాక్సింగ్‌), శ్రావణ్‌ కుమార్‌ (షూటింగ్‌)లమీద నిషేధాంక్షలకు రంగం సిద్ధం చేసిందంటున్నారు. సుమారు ఏడాదిగా కబడ్డీ, జావెలిన్‌ త్రో, వెయిట్‌ లిఫ్టింగ్‌, దేహదారుఢ్య పోటీల్లో రాణిస్తున్నవారితోపాటు క్రికెటర్‌ పృథ్వీ షా, మహిళా అథ్లెట్‌ సంజీవనీ జాదవ్‌ ప్రభృతుల పేర్లు 'నాడా' వడపోత జాబితాలోకి చేరడం తెలిసిందే. కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ ప్రస్తావిస్తున్న 'ఆటల్లో స్వచ్ఛత' వాస్తవిక కార్యాచరణలో కొల్లబోతుండటం- రష్యా, టర్కీలను వెన్నంటి ఇండియాను డోపింగ్‌ రొంపిలోకి లాగుతోంది.

సమకాలీన ప్రపంచ చరిత్రలో పతకాల కోసం నైతిక పతనం కొనితెచ్చుకున్న దేశమేదంటే, టక్కున స్ఫురించే నామధేయం- రష్యా. తీవ్ర ఆరోపణల దృష్ట్యా, ‘వాడా’ ఏర్పరచిన స్వతంత్ర విచారణ సంఘం క్రోడీకరించిన అంశాల తీరే అందుకు దాఖలా. శిక్షకులు, వైద్యులు, అధికారులు, అథ్లెట్లు... అందరికీ తెలిసే, వ్యవస్థాగత తోడ్పాటుతో అక్కడ విచ్చలవిడిగా డోపింగ్‌ పెచ్చరిల్లింది. కనుకనే టోక్యో ఒలింపిక్స్‌, ఖతార్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ పోటీలు సహా నాలుగేళ్లపాటు ఏ భారీ క్రీడోత్సవంలోనూ మాస్కో పాదం మోపే వీల్లేదని ‘వాడా’ ఆరునెలలక్రితం కఠిన దండన ఖరారు చేసింది. అక్కడ ప్రభుత్వ యంత్రాంగమే అనుచిత విధానాలను ప్రోత్సహించి తమ దేశాన్ని అప్రతిష్ఠపాలు చేయగా- ఇక్కడ కొందరు వ్యక్తుల 'పొరపాట్లు' భారత్‌ పరువు మర్యాదల్ని దిగలాగుతున్నాయి. డోపింగ్‌ను సహించేది లేదంటూ జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ వంటి దేశాలు చట్టాల్ని రూపొందించాయి.

మెరుగ్గా వ్యవహరించాలి..

నిషేధిత ఉత్ప్రేరకాల అక్రమ రవాణాను నిరుత్సాహపరచే విధినిషేధాలకు సైప్రస్‌, డెన్మార్క్‌, పోర్చుగల్‌ తదితరాలు కోరలు తొడుగుతున్నాయి. అటువంటి పకడ్బందీ వ్యవస్థ లేని ఇక్కడ- రేసుగుర్రాల కోసం వాడే లిగండ్రాల్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి ఉపయోగించి డోప్‌ పరీక్షల్లో అడ్డంగా దొరికిపోతున్నవాళ్ల సంఖ్య పెరుగుతున్నట్లు 'నాడా'యే అంగీకరిస్తోంది. డోపింగ్‌ వలలో పడకుండా అథ్లెట్లకు, శిక్షకులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మేరీకోమ్‌ ప్రభృతులు ఎన్నాళ్లుగానో మొత్తుకుంటున్నా- యంత్రాంగం మిన్నకుండిపోయింది. కొవిడ్‌ విజృంభణ కారణంగా డోప్‌ పరీక్షలు చతికిలపడ్డాయన్న 'వాడా' ఇకపై కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ముందడుగు వేస్తామంటోంది. ఎక్కడ ఎటువంటి పరీక్షల్లోనైనా నెగ్గుకొచ్చేలా అథ్లెట్లను జాగృతపరచి, దేశంలో ఏ క్రీడకూ వివాదాల మకిలంటకుండా కాచుకోవాల్సిన మౌలిక లక్ష్యసాధనలో 'నాడా' మరింత చురుగ్గా వ్యవహరించాల్సి ఉంది!

ఇదీ చూడండి:కామన్వెల్త్ పతక విజేతపై నాలుగేళ్ల నిషేధం

సహజసిద్ధమైన నేర్పుతో నిజాయతీగా పోటీపడటం, ఓడినా కడకంటా బాగా ఆడారనిపించుకోవడానికి పాటుపడటం- కల్మషం అంటని క్రీడా ప్రతిభ. ఓటమిని హుందాగా స్వీకరించడమే, సిసలైన క్రీడాస్ఫూర్తికి చిరునామా! ఆ లక్షణాల్ని తోసిరాజని- అవతలివారిపై అనైతిక ఆధిక్య సాధనను లక్షించి, ఆటలో అనూహ్యస్థాయి పాటవ ప్రదర్శనకోసం నిషేధిత ఉత్ప్రేరక పదార్థాల వాడకం (డోపింగ్‌) దేశదేశాల్లో కొన్నేళ్లుగా పెచ్చరిల్లుతోంది. దురదృష్టవశాత్తు, దేశీయంగానూ అటువంటి ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రెండున్నరేళ్లుగా డోపింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజితా చానుపై ఎటువంటి చర్యలూ తీసుకోబోవడం లేదన్న అంతర్జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) తాజా ప్రకటన, ఉపశమనం కలిగిస్తోంది. మరోవైపు- దోహా ఆసియా ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో 800 మీటర్ల స్వర్ణపతక విజేత గోమతీ మారిముత్తుపై ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నాలుగేళ్ల నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం నిశ్చేష్టపరుస్తోంది.

జాబితాలో వారి పేర్లు..

తనవంతుగా నాడా (జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ) అమృత్‌పాల్‌ సింగ్‌ (బాస్కెట్‌బాల్‌), నీరజ్‌ ఫొగట్‌(బాక్సింగ్‌), శ్రావణ్‌ కుమార్‌ (షూటింగ్‌)లమీద నిషేధాంక్షలకు రంగం సిద్ధం చేసిందంటున్నారు. సుమారు ఏడాదిగా కబడ్డీ, జావెలిన్‌ త్రో, వెయిట్‌ లిఫ్టింగ్‌, దేహదారుఢ్య పోటీల్లో రాణిస్తున్నవారితోపాటు క్రికెటర్‌ పృథ్వీ షా, మహిళా అథ్లెట్‌ సంజీవనీ జాదవ్‌ ప్రభృతుల పేర్లు 'నాడా' వడపోత జాబితాలోకి చేరడం తెలిసిందే. కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ ప్రస్తావిస్తున్న 'ఆటల్లో స్వచ్ఛత' వాస్తవిక కార్యాచరణలో కొల్లబోతుండటం- రష్యా, టర్కీలను వెన్నంటి ఇండియాను డోపింగ్‌ రొంపిలోకి లాగుతోంది.

సమకాలీన ప్రపంచ చరిత్రలో పతకాల కోసం నైతిక పతనం కొనితెచ్చుకున్న దేశమేదంటే, టక్కున స్ఫురించే నామధేయం- రష్యా. తీవ్ర ఆరోపణల దృష్ట్యా, ‘వాడా’ ఏర్పరచిన స్వతంత్ర విచారణ సంఘం క్రోడీకరించిన అంశాల తీరే అందుకు దాఖలా. శిక్షకులు, వైద్యులు, అధికారులు, అథ్లెట్లు... అందరికీ తెలిసే, వ్యవస్థాగత తోడ్పాటుతో అక్కడ విచ్చలవిడిగా డోపింగ్‌ పెచ్చరిల్లింది. కనుకనే టోక్యో ఒలింపిక్స్‌, ఖతార్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ పోటీలు సహా నాలుగేళ్లపాటు ఏ భారీ క్రీడోత్సవంలోనూ మాస్కో పాదం మోపే వీల్లేదని ‘వాడా’ ఆరునెలలక్రితం కఠిన దండన ఖరారు చేసింది. అక్కడ ప్రభుత్వ యంత్రాంగమే అనుచిత విధానాలను ప్రోత్సహించి తమ దేశాన్ని అప్రతిష్ఠపాలు చేయగా- ఇక్కడ కొందరు వ్యక్తుల 'పొరపాట్లు' భారత్‌ పరువు మర్యాదల్ని దిగలాగుతున్నాయి. డోపింగ్‌ను సహించేది లేదంటూ జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ వంటి దేశాలు చట్టాల్ని రూపొందించాయి.

మెరుగ్గా వ్యవహరించాలి..

నిషేధిత ఉత్ప్రేరకాల అక్రమ రవాణాను నిరుత్సాహపరచే విధినిషేధాలకు సైప్రస్‌, డెన్మార్క్‌, పోర్చుగల్‌ తదితరాలు కోరలు తొడుగుతున్నాయి. అటువంటి పకడ్బందీ వ్యవస్థ లేని ఇక్కడ- రేసుగుర్రాల కోసం వాడే లిగండ్రాల్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి ఉపయోగించి డోప్‌ పరీక్షల్లో అడ్డంగా దొరికిపోతున్నవాళ్ల సంఖ్య పెరుగుతున్నట్లు 'నాడా'యే అంగీకరిస్తోంది. డోపింగ్‌ వలలో పడకుండా అథ్లెట్లకు, శిక్షకులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మేరీకోమ్‌ ప్రభృతులు ఎన్నాళ్లుగానో మొత్తుకుంటున్నా- యంత్రాంగం మిన్నకుండిపోయింది. కొవిడ్‌ విజృంభణ కారణంగా డోప్‌ పరీక్షలు చతికిలపడ్డాయన్న 'వాడా' ఇకపై కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ముందడుగు వేస్తామంటోంది. ఎక్కడ ఎటువంటి పరీక్షల్లోనైనా నెగ్గుకొచ్చేలా అథ్లెట్లను జాగృతపరచి, దేశంలో ఏ క్రీడకూ వివాదాల మకిలంటకుండా కాచుకోవాల్సిన మౌలిక లక్ష్యసాధనలో 'నాడా' మరింత చురుగ్గా వ్యవహరించాల్సి ఉంది!

ఇదీ చూడండి:కామన్వెల్త్ పతక విజేతపై నాలుగేళ్ల నిషేధం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.