దుబాయిలోని బాంబే బరో అనే భారతీయ రెస్టారెంట్ ‘రాయల్ గోల్డ్ బిర్యానీ’ పేరుతో బిర్యానీని విక్రయిస్తోంది. దీని ప్లేట్ ధర రూ.1000 దిర్హామ్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 19,700. 23 కేరట్ల తినే బంగారంతో గార్నిష్ చేసి ఈ బిర్యానీని వడ్డిస్తారు. అందుకే దీనికి గోల్డ్ బిర్యానీ అని పేరు పెట్టారు. ఇదొక్కటే కాదు.. ఇందులో చాలా ప్రత్యేకతలున్నాయి.
సాధారణంగా బిర్యానీలో ఒకే రకంగా ఉండే అన్నం ఉంటుంది. కానీ ‘రాయల్ గోల్డ్లో విభిన్న రకాల అన్నాన్ని వడ్డిస్తారు. బిర్యానీ రైస్, కీమా రైస్, కుంకుమ పువ్వుతో చేసిన అన్నం, తెల్లన్నంతో దీనిని రెడీ చేస్తారు. దానిపై ఉడకబెట్టిన గుడ్లు, చిన్న బంగాళాదుంపలు, జీడిపప్పు, దానిమ్మ గింజలు తదితర వాటిని ఉంచుతారు. అన్నంపై కశ్మీరీ గొర్రె కబాబ్స్, ఓల్డ్ దిల్లీ కబాబ్స్, రాజ్ఫుత్ చికెన్ కబాబ్స్, మొఘలాయి కోఫ్తా వంటి మాంసం ముక్కలను పెట్టి.. వాటిపై 23 కేరట్ల తినే బంగారాన్ని అలంకరిస్తారు. బిర్యానీతో పాటు నిహారీ సలాన్, జోధ్పురి సలాన్, బాదామీ సాస్, రైతాను ఇస్తారు.
ప్రపంచంలోనే ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన బిర్యానీ ఇదేనని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. దుబాయి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్లో ఉండే ఈ పాపులర్ రెస్టారెంట్కు.. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు వస్తుంటారు.