భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో శోభ అనే మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారనే మనస్తాపంతో బలవన్మరణానికి ప్రయత్నించింది.
శోభ దంపతులకు ఇళ్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తానని చెప్పి చార్లెస్ అనే వ్యక్తి రూ.15 వేలు తీసుకున్నాడు. రూ.5 వేలు ఖర్చు చేసి శోభ దంపతులు స్థలాన్ని చదును చేయించుకున్నారు. అనంతరం స్థలం ఇవ్వనంటూ చార్లెస్ అడ్డుకున్నాడు.
ఫలితంగా శోభ దంపతులు పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించగా.. అధికారులు స్థలం ఇవ్వాలని సూచించారు. అయినప్పటికీ చార్లెస్ స్థలం ఇవ్వకుండా ఆ స్థలంలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాడు. ప్రశ్నించిన శోభ దంపతులపై కొందరు వ్యక్తులతో దాడి చేయించాడు. ఫలితంగా మనస్తాపానికి గురైన శోభ ఆత్మహత్యకు యత్నించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది.