సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని మారుతి హోమ్ ఆశ్రమానికి చెందిన బాలిక మృతి కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను నేడు కూడా మారుతి హోమ్లోనే పోలీసులు విచారిస్తున్నారు. బాలిక బంధువులను కూడా పోలీసులు పిలిపించినట్లు సమాచారం. మారుతి హోమ్ నుంచి లాక్ డౌన్కు ముందు మార్చి 21న బాలికను బంధువులు తీసుకెళ్లారు. ఆ తర్వాత జులై 29 న బాలికను హోమ్లో చేర్చేందుకు వెళ్లిన సమయంలో నిర్వాహకురాలు విజయ నిరాకరించింది. ఈ క్రమంలో బాలిక బంధువులకు, విజయకు చోటు చేసుకున్న వాగ్వాదం గురించి పోలీసులు అడిగి తెలుసుకునే అవకాశం ఉంది.
బాలిక అనారోగ్యం పాలైనా నిర్వాహకులు దాచిపెట్టారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బంధువులు చెప్పే వివరాలను బట్టి నిర్వాహకులను పోలీసులు ప్రశ్నించనున్నారు. మొదటిరోజు విచారణలో భాగంగా మారుతి హోమ్కు వేణుగోపాల్ రెడ్డికి ఉన్న సంబంధంపై పోలీసులు పూర్తి వివరాలు సేకరించారు. గత ఐదేళ్లుగా మారుతి హోమ్లో జరిగిన లావాదేవీలపై పోలీసులు కూపీ లాగారు. విరాళాల పేరిట ఆశ్రమ నిర్వాహకులకు దగ్గరైన వేణుగోపాల్ రెడ్డి.. ఈ మేరకు ఎన్ని విరాళాలు ఇచ్చారనే దానికి సంబంధించి సమాచారం రాబట్టారు. బాలిక మృతిపై హైపవర్ కమిటీ విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే బాలిక బంధువుల నుంచి వివరాలు తెలుసుకున్న కమిటీ సభ్యులు ఇతర వివరాలను సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: ఉగ్ర గోదావరి.. కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక