మహిళా ఎస్సై.. ఓ కానిస్టేబుల్ కుటుంబంలో కలతలు రేపిన ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగింది. ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా ఎస్సై అదే పీఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తరువాత ఆ మహిళా ఎస్సైను నెల్లూరులోని దిశ పోలీసు స్టేషన్కు బదిలి చేశారు. అక్కడ ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడం వల్ల వీఆర్కు పంపారు.
ఇద్దరిలో మార్పు రాకపోగా.. ఈ వ్యవహారం ఆ కానిస్టేబుల్ భార్యకు తెలిసింది. కానిస్టేబుల్ భార్య.. భర్తను నిలదీసింది. ప్రవర్తన మార్చుకోవాలని కోరింది. ఎంత చెప్పినా కానిస్టేబుల్ వినలేదు. చేసేది లేక జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వారి సూచనల మేరకు కానిస్టేబుల్ భార్య కలువాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించాలని ఎస్పీ భాస్కర్ భూషణ్.. ఏఎస్పీని ఆదేశించారు.
ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న మహిళా ఎస్సై... శుక్రవారం కలువాయిలోని కానిస్టేబుల్ ఇంటి వద్ద గొడవకు దిగింది. ఇదే విషయమై మళ్లీ బాధితురాలు కలువాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, మీడియా అక్కడకు చేరుకోవడం గమనించిన మహిళా ఎస్సై.. కానిస్టేబుల్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన జిల్లాలో, పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం... తల, మొండెం వేరు!